Rollavagu project | సారంగాపూర్, జూన్ 25: రోల్లవాగు ప్రాజెక్ట్ పూర్తికి నిరంతరం కృషి చేస్తానని, అటవీ పర్యావరణ అనుమతుల రావడంలో ఆలస్యం జరుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్ పూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో బుధవారం ఆయా గ్రామాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.6 లక్షలు, 50మందికి కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా మంజూరైన రూ.50 లక్షల 5వేల విలవగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర స్థాయి ఉన్నత స్థాయి అటవీ అధికారులు సువర్ణ, త్రినాథ రావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడం జరిగిందని అన్నారు.
అలాగే ఎంపీ అరవింద్ దృష్టికి విషయాన్ని తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇరిగేషన్ డీఈ, ఈఈ, రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ సెక్రటరీ రవి నాయక్ ఐఏఎస్ ను కలిశానని, త్వరలో స్పష్టత వస్తుందని అన్నారు. రోల్లవాగు పూర్తి కోసం, రైతులకు న్యాయం కోసం కృషి చేస్తున్నామని ప్రజలు గమనించాలని కోరారు. బీర్పూర్ మండలానికి నాణ్యమైన వైద్యం కోసం రూ, 1 కోటి 50 లక్షలతో హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే బాలికల కోసం కస్తూర్బా గాంధీ విద్యాలయం మంజూరైందని, శాశ్వత భవన నిర్మాణం కోసం త్వరలో నిధుల మంజూరు కు కృషి చేస్తానని పేర్కొన్నారు.
రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల ను జగిత్యాలకు మంజూరుకు కృషి చేస్తానన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమం నిరంతరం కొనసాగుతుందని అన్నారు. గురుకుల విద్యార్థుల కోసం నాణ్యమైన భోజనం కోసం హాస్టల్ లలో డైట్ ఛార్జీలను రాష్ర్ట ప్రభుత్వం పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో కేడిసిసి జిల్లా మెంబర్ ముప్పాళ రామచందర్ రావు, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో లచ్చాలు, పాక్స్ చైర్మన్ నవీన్ రావు, ఆయా గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.