Ramagundam | కోల్ సిటీ, ఫిబ్రవరి 20: రామగుండం నగర పాలక సంస్థ ఎన్నికల ఘట్టం ముగిసింది. కొత్త పాలక వర్గం కొలువుదీరింది. ఇక నామినేటెడ్ పదవుల ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉంది. ఐతే కో ఆప్షన్ పదవులు ఎవరికి దక్కుతాయన్నదే మిస్టరీగా మారింది. గతంలో మాదిరిగా కార్పొరేషన్ లో కో- ఆప్షన్ పదవులు ఐదుకే పరిమితం చేస్తారా..? లేదంటే 10 నుంచి 15 వరకు పెంచుతారా? అన్నది నోటిఫికేషన్ వెలువడితేనే తేలిపోతుంది. కో ఆప్షన్ పదవులకు స్థానిక రాజకీయాలపై పట్టు ఉండి ఇదివరకు కార్పొరేటర్లుగా చేసి ఉండాలి.
అలాగే రిటైర్డ్ మున్సిపల్ ఉద్యోగులను కూడా కో-ఆప్షన్ పదవులకు అర్హులుగా పరిగణిస్తారు. ఇక ముస్లిం మైనార్టీ నుంచి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రిజర్వేషన్లు అనుకూలించక పోటీ చేయలేని సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కో – ఆప్షన్ సభ్యులకు ఈ నామినేటెడ్ పదవులు ఇస్తామని ఎన్నికలకు ముందు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట కూడా ఇచ్చారు. అలాగే టికెట్లు ఆశించి భంగపడ్డ అభ్యర్థులు, నామినేషన్ వేసి నాయకత్వం సూచనల మేరకు ఉపసంహరించుకున్న అభ్యర్థులకు సైతం కో-ఆప్షన్ పదవి ఖాయమని ఆశ చూపించినట్లు తెలిసింది.
ఈ లెక్కన సుమారు 20 మంది అభ్యర్థుల వరకు కో-ఆప్షన్ పదవులు ఇస్తామని చెప్పడంతో ఇప్పుడు వారంతా ఆ పదవులపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే పాత పద్ధతి ప్రకారంగానే కార్పొరేషన్ కు కేవలం ఐదు కో-ఆప్షన్ పదవులే కేటాయిస్తూ నోటిఫికేషన్ వెలువడితే అంతమందిలో ఎవరికి దక్కుతాయన్నదే ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ నాయకత్వంను ఇరకాటంలో పడేస్తోంది. లేదంటే కో-ఆప్షన్ పదవులు 10 -15 వరకు పెంచినట్లయితే ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఏదిఏమైనా రామగుండంలో కో-ఆప్షన్ పదవుల కోసం అప్పుడే ఒత్తిళ్లు మొదలు కావడంతో కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్షగానే మారిందని చెప్పుకుంటున్నారు.