జమ్మికుంట, అక్టోబర్ 17: ‘నాకొక్క అవకాశం ఇయ్యండి. మీ బిడ్డగా ఆశీర్వదించాలి. పనిచేసే ప్రభుత్వానికే పట్టంగట్టాలే. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల, తట్టెడు మైట్టెనా పోసిండా చెప్పాలే. పనిచేయని నాయకుడు, ప్రజలను పట్టించుకోని వ్యక్తి మనకు అవసరమా..? చెప్పండి. రానున్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక కథనాయకుడు కావాలి. హుజూరాబాద్లో గులాబీద జెండా ఎగరేసేందుకు పనిచేయాలి. ఇక్కడి విజయాన్ని కేసీఆర్కు గిఫ్టుగిద్దాం. ప్రతిపక్షాలకు దిమ్మదిరిగే తీర్పునిచ్చేలా చైతన్యం కలిగించాలి’ అని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పిలుపునిచ్చారు.
మంగళవారం ఆయన జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 1,2,3,4వ వార్డుల్లో పర్యటించారు. ఆయా వార్డు కౌన్సిలర్లు, వార్డు కమిటీ అధ్యక్షులు, సభ్యుల ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఒక అద్భుతమని, ప్రపంచమే కొనియాడుతున్న వైనాన్ని వివరించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో లేవని, ఏ ఒక్క పథకం అమలు చేసినా చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు.
ఉప ఎన్నికల్లో గెలిచిన ఆయన ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. మూడోసారి రాష్ట్ర సీఎంగా కేసీఆరే ఉంటారని, ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లుగా ప్రజల మధ్యలో తిరుగుతున్నానని, మీ సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తున్నానని పేర్కొన్నారు. కొందరు నాయకులు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తాను ఎప్పటికీ మీ వాడినేనని తెలిపారు. పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తికైనా సమస్య వస్తే ముందుంటానని, కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని స్పష్టం చేశారు.
హుజూరాబాద్లో గెలిస్తే రూ.వెయ్యి కోట్లు అందిస్తానని సీఎం హామీ ఇచ్చారని, వచ్చే నిధులతో నియోజకవర్గాన్ని గొప్పగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ పథకాలపై చర్చ పెట్టాలన్నారు. ఓటు అడిగే హక్కు ఒక్క మనకే ఉందని, కలిసికట్టుగా పనిచేస్తే విజయం మనదేనని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, వార్డు కౌన్సిలర్లు బొంగోని వీరన్న, మారెపల్లి భిక్షపతి, మేడిపల్లి రవీందర్, ఎలగందుల స్వరూప-శ్రీహరి, వార్డు అధ్యక్షులు, సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులున్నారు.