ధర్మారం, జూన్ 25 : స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో ఆదివారం మంత్రి ఈశ్వర్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్కు ను సర్పంచ్ మొట్టె లక్ష్మీశంకరయ్య ఆధ్వర్యంలో మహిళలు కోలాట, నృత్యంతో ఘన స్వాగతం పలికారు. గ్రామ శివారు నుంచి ప్రభుత్వ పాఠశాల సమీపం వరకు స్థానికులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో స్థానిక యువకులు ఈ నెల 10 నుంచి నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో విజేత జట్లు కమ్మర్ఖాన్పేటకు రూ.20,016, రన్నరప్ జట్టు పెరుకపల్లికి రూ.10,016తో పాటు కప్ను మంత్రి ఈశ్వర్ అందజేశారు. అనంతరం సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన బీజేపీ అనుబంధ యూత్ నాయకుడు గంగిపల్లి స్వామితోపాటు, యువకులు, మహిళలు, స్వచ్ఛందంగా మరికొంతమంది సుమారు 200 మంది పార్టీలో చేరగా మంత్రి ఈశ్వర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దారన్నారు. ప్రధానంగా నీటి ప్రాజెక్టులు నిర్మించడంతో సాగునీటి సమస్య శాశ్వతంగా తొలగిపోయి బీడు భూములను సాగులోకి రావడంతో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. మొట్టమొదట రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నీటి తీరువాను రద్దు పరిచి మేలు చేసిందని ఆయన గుర్తు చేశారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందితే చూడలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం తగదని విమర్శించారు. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎంతో అరిగోస పడ్డారని, ఆ విషయాన్ని ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేరని ఆయన స్పష్టం చేశారు. నాడు గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు మళ్లీ అభివృద్ధి చేస్తామని గ్రామాలకు వస్తే వారికి తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇక బీజేపీ దేశాన్ని పాలించి అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని, కేవలం యువతను రెచ్చగొట్టే విధంగా ఆ పార్టీ నాయకులు ప్రసంగం చేస్తున్నారని, యూత్ వారి మాటలు నమ్మవద్దని మంత్రి ఈశ్వర్ పిలుపునిచ్చారు.
ప్రజలంతా బీఆర్ఎస్ ప్రభుత్వం వైపు ఉన్నారని, అందుకు ఉదాహరణ పెద్ద సంఖ్యలో పెర్కపల్లికి చెందిన మహిళలు, యువత తమ పార్టీలో చేరడమేనని చెప్పారు. బంజేరుపల్లి గ్రామం నుంచి విడిపోయి పెర్కపల్లి కొత్త గ్రామపంచాయతీ ఏర్పడి సర్పంచ్ లక్ష్మి శంకరయ్య ఆధ్వర్యంలో సుమారు రూ.70 లక్షల విలువైన సీసీ రోడ్ల అభివృద్ధి పనులు జరగడం అభినందనీయమని మంత్రి ఈశ్వర్ ప్రశంసించారు. బంజేరుపల్లి నుంచి పెరపల్లి గ్రామం వరకు ప్రత్యేకంగా బీటీ రోడ్డు నిర్మాణం చేయించామని, మిగతా కమ్మర్ఖాన్పేట వరకు రోడ్డును విస్తరిచేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామస్తులు కోరిన ప్రకారం పెర్కపల్లి గ్రామానికి కొత్త గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు, వైకుంఠం గ్రామం వరకు సీసీ రోడ్డు నిర్మాణం, యువత కోసం జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఓపెన్ జిమ్ ఏర్పాటు, గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం వంటి సమస్యలను పరిషరిస్తానని మంత్రి ఈశ్వర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి సర్పంచ్ లక్ష్మీ శంకరయ్య అధ్యక్షత వహించగా ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, నంది మేడారం ప్యాక్స్ చైర్మన్, జిల్లా సహకార సంఘాల అధ్యక్షుల ఫోరం చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, పార్టీ మండల అధికారి ప్రతినిధి గుర్రం మోహన్ రెడ్డి, పార్టీ పెర్కపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు సత్తనవేని సదయ్య, పార్టి మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ సత్తనవేని శ్రీనివాస్, పిట్టల మహేశ్, చిమ్మాళ్ల ఉదయ్, అప్పని శేఖర్, ఉగ్గె నరేశ్, బీఆర్ఎస్ అనుబంధ మండలాధ్యక్షులు అజ్మీరా మల్లేశం నాయక్, దేవి నళినీకాంత్, దేవి వంశీక్రిష్ణ, నాయకులు గంగిపల్లి నర్సయ్య, చిమ్మాల్ల చిన్న రాజయ్య, నెల్లి చిన్న లింగయ్య, కల్లెం హన్మంత రెడ్డి, అప్పని గోపాల్, ఆకారి సత్యం తదితరులు పాల్గొన్నారు.