కమాన్ చౌరస్తా, నవంబర్ 30 : శుక్రమౌఢ్యమి రావడంతో దాదాపుగా రెండు నెలలు మంచి రోజులు లేవు. రేపటి నుంచే మళ్లీ మొదలవుతున్నాయి. ఈ నెల 2 నుంచి 19వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ జనవరి చివరి వారం వరకు ఎలాంటి మంచి రోజులు లేవని పండితులు చెబుతుండగా, ఉన్న 18 రోజుల్లోనే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి. ఇప్పటికే ఊరూవాడా సందడి మొదలు కాగా, పెళ్లి జరిపే కుటుంబాలు ఏర్పాట్లలో తలమునకలయ్యాయి. ఫంక్షన్హాళ్లు, కల్యాణమండపాలు, బ్యాండ్ మేళాలు, వాహనాలు ఇప్పటికే బుక్ అయ్యాయి. ఇప్పటికిప్పుడు పెళ్లి పెట్టుకుంటే అవి దొరకలేని పరిస్థితులున్నాయి.
ఫంక్షన్హాళ్లు ముందే బుక్..
ఒకప్పుడంటే పల్లెల్లో అయినా పట్టణాల్లో అయినా ఇంటి వద్దో లేదంటే ఇంటి సమీపంలో ఖాళీ స్థలం కనిపిస్తుండే. ఇప్పుడు ఎటుచూసినా ఇరుకిరుకు. పెళ్లి కాదు కదా, పురుడు కూడా చేయలేని పరిస్థితి. అందుకే ఏ ఫంక్షన్ అయినా కల్యాణ మండపాలు, ఫంక్షన్హాళ్లవైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం మూడు నెలల తర్వాత మంచిరోజులు వస్తుండడంతో పల్లె, పట్టణం తేడా లేకుండా ఫంక్షన్హాళ్లు, గార్డెన్లకు డిమాండ్ ఏర్పడింది. చాలా వరకు ఇప్పటికే బుక్ అయ్యాయి. ఇప్పటికిప్పుడు పెళ్లి పెట్టుకునే వాళ్లకు మండపాలు దొరకడం కష్టమే. అలంకరణలు, ఆర్బాటాలు, ఫంక్షన్హాల్ సామగ్రి, విద్యుత్ వినియోగం, తేదీ ప్రాధాన్యాన్ని బట్టి ఒక్కో వివాహానికి 20 వేల నుంచి 2 లక్షల వరకు ధర పలుకుతున్నవి. విశేషమేమిటంటే కొందరు ఫంక్షన్హాళ్లు ఖాళీగా ఉన్న సమయాల్లోనే పెళ్లి ముహూర్తాలు పెటుకోవడం కనిపిస్తున్నది.
ఫొటో, వీడియోగ్రఫీకీ డిమాండ్..
ఇక పెళ్లి జ్ఞాపకాలను కలకాలం పదిలపరిచే ఫొటో, వీడియోగ్రీఫీకి ఇటీవలి కాలంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఒకప్పుడు ఏదో పది కాపీలు, 20 కాపీల చొప్పున లెక్కలు వేసుకునో.. రీల్ చొప్పున మాట్లాడుకునో ఫొటోలు తీయించుకునేవారు. ఇప్పుడు డిజిటల్ కెమెరాల రాకతో అంతా మారిపోయింది. సినిమాల తరహాలో ఫొటో, వీడియోగ్రఫీ వచ్చి ఫొటోగ్రాఫర్లకు, కెమెరామెన్లకు డిమాండ్ పెరిగింది. వీడియో, ఫొటోగ్రఫీకి 20 నుంచి లక్ష వరకు, లైవ్ టెలీకాస్ట్ అయితే అంతకుపైనే తీసుకుంటున్నారు. ఇంకా మంగళవాయిద్యాకారులు ఒక్కో వివాహానికి 15 వేల నుంచి 30 వేల వరకు తీసుకుంటుండగా, బ్యాండ్ మేళా వాళ్లు అంతే మొత్తం అడుగుతున్నారు.
పూలకు గిరాకీ..
నాడు ఎవరింట చూసినా పూల చెట్లు కనిపించేవి. 30 ఏళ్ల క్రితం అయితే ఇంట్లో పెళ్లి ఉందంటే ముందుగానే ఇందుకోసం బంతి, చామంతి, కనకంబరాలు, నారు పోసేవాళ్లు. ఇంకా మల్లెలు, గులాబీలను ముందుగానే సిద్ధం చేసుకునేవాళ్లు, కొబ్బరిమట్టలతో మండపాన్ని వేసి, పూలతో అందంగా అలంకరించేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఎవరింట చూసినా ఒక్క పువ్వుకూడా కనిపించడం లేదు. పైగా ఫంక్షన్హాళ్లలో రెడీమేడ్ మండపాలు కావడంతో ప్రతీది కొనాల్సిందే. అందుకే పెళ్లిళ్ల సమయంలో పూలకు విపరీతమైన డిమాండ్ ఉంటున్నది. ఒక్కో పూల పెళ్లిపందిరికి 20 వేల నుంచి లక్ష వరకు తీసుకుంటుండగా, పూలకు గిరాకీ పెరిగింది.
వంటా వార్పులు..
పెళ్లిలో ముఖ్యంగా చెప్పుకునేది భోజనం గురించే. ఒకప్పుడు దగ్గరి వాళ్లతో వంటలు చేయించినా, ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా వంటవాళ్లతోనే చేయిస్తున్నారు. కొందరు భాషిక పూజ నాటి నుంచి వివాహం, రిసిప్షెన్ కలిసి మూడు రోజులు మాట్లాడుకుంటే, మరికొందరు కేవలం పెళ్లి రోజు వరకే మాట్లాడుకుంటున్నారు. వంటవాళ్లు 10వేల నుంచి 70 వేల వరకు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో కేటరింగ్ వాళ్లకు కూడా గిరాకీ ఉంటున్నది. ఆహార పదార్థాల మెనూను బట్టి ఒక్కో ప్లేట్కు 150 నుంచి 400 తీసుకుంటున్నారు. ఇందులో వడ్డన బాధ్యత వీరే తీసుకుంటారు.
వాహనాలు కష్టమే..
పెళ్లికి ముందు, పెళ్లి అయ్యాక వధూవరుల కోసం తప్పనిసరి కారు కావాల్సిందే. బంధువులను తరలించేందుకు బస్సో వ్యానో ఉండాల్సిందే. ఇప్పుడు పెళ్లివాళ్లు ట్రావెల్స్ను ఆశ్రయిస్తుండడంతో అద్దెలను రెండింతలు చేశారు. డిమాండ్ ఉండడంతో అడిగినంత ఇస్తున్నారు. లోకల్ టూ లోకల్, లోకల్ టూ నాన్లోకల్ను పరిగణలోకి తీసకొని 2500 నుంచి 15వరకు తీసుకుంటున్నారు. అందులో వాహనాలను బట్టి ధరలు చెబుతున్నారు. అయితే చాలా వరకు ముందే బుక్ చేసుకున్నారు.
పార్లర్లు బిజీ బిజీ..
ఒకప్పుడు వధూవరులు ఇళ్లలోనే ముస్తాబయ్యేవారు. పౌడరో లేదా క్రీమో రాసుకుని పెళ్లికి రెడీ అయ్యేవారు. కానీ, ఇటీవలి కాలంలో అలంకరణ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఇందులో భాగంగా లేడీస్ ఎంపోరియాలు, బ్యూటీ పార్లర్లకు గిరాకీ పెరిగింది. ముహూర్త సమయానికి పార్లర్లలో అమ్మాయిలను కుందనపు బొమ్మలా, అబ్బాయిని యువరాజులా బ్యూటీషియన్స్ అలంకరిస్తున్నారు. ఇంకా ఇంటి వద్దకే వచ్చి మేకప్ వేస్తున్నారు. ప్రత్యేక అలంకరణకు తక్కువలో తక్కువ వెయ్యి నుంచి 10 వేల వరకు తీసుకుంటున్నారు.
బిజీగా ఈవెంట్ సంస్థలు..
వివాహంలో వ్యాఖ్యానాలు, గానాబజానాలకు కూడా ప్రాధాన్యం పెరిగింది. అందుకు ప్రత్యేక సౌండ్ సిస్టంను వాడుతున్నారు. కార్డ్లెస్, కాలర్మైక్లు, ట్రాక్లు, పెద్ద సౌండ్ బాక్స్లు, ఎకో సౌండ్లు వంటివి ఉపయోగిస్తున్నారు. పాటల కచేరి కోసం పలు ఈవెంట్ నిర్వాహకులకు, గాయకులకు, వాయిద్యకారులకు మంచి గిరాకీ ఉంటుంది. ఒక్కో వివాహానికి సౌండ్స్ వారు 5వేల నుంచి 20 వేల వరకు తీసుకుంటున్నారు. ఈవెంట్స్ ప్యాకేజీ రూపంలో తీసుకుంటున్నారు. వారివారి స్థోమతను, వీలును బట్టి 20 వేల నుంచి ఐదు లక్షల దాకా అడుగుతున్నారు.
జోరుగా బట్టలు, బంగారం కొనుగోళ్లు..
పెళ్లి అనగానే ముందుగా గుర్తొచ్చేవి బట్టలు, బంగారం. ఇప్పుడు ఎక్కడ చూసినా జోరుగా కొనుగోళ్లు సాగుతున్నాయి. షాపులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఒక్కో కుటుంబం 50 వేల నుంచి 80 వేల బట్టలు కొంటుండగా, బంగారం వారి తాహతును బట్టి 2 తులాల నుంచి 30 తులాల వరకు కొనడం కనిపిస్తున్నది.
పురోహితులు బిజీ..
హిందూ సంప్రదాయంలో పురోహితులు లేనిదే పెళ్లి జరగదు. ప్రస్తుతం వీరికి డిమాండ్ పెరిగింది. ఐదు రోజుల్లోనే పెళ్లిళ్లు ఎక్కువగా ఉండడంతో ఒక్కో పురోహితుడు రెండు మూడు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఒక్కో వివాహానికి 5 నుంచి 50 వేల వరకు సంభావన తీసుకుంటున్నారు. ఇక్కడే కాకుండా హైదరాబాద్, వరంగల్ లాంటి ప్రధాన నగరాల్లోనూ పెళ్లి చేసేందుకు వెళ్తున్నారు.
డిసెంబర్ 3 నుంచి 19 వరకు ముహూర్తాలు
రెండు నెలల నుంచి శుక్రమూఢమి కొనసాగుతున్నది. శనివారం నుంచి 15 మంచి రోజులు వచ్చాయి. ఈ రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 వేల వరకు వివాహాది శుభకార్యాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్లో 3, 4, 8, 9, 11,14, 16,18, 19 మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 23వ తేదీ అమావాస్య, 24వ తేదీ నుంచి పుష్యమాసం (శూన్యమాసం) ఆరంభమవుతుంది. ఈ క్రమంలో శుభకార్యాలు పనికిరావు. తిరిగి మళ్లీ జనవరి 22వ తేదీ నుంచి మాఘమాసం మంచిరోజులు ప్రారంభమవుతాయి. అందులో మార్చి 18వ తేదీ వరకూ అన్నీ మంచిరోజులు ఉన్నాయి. ఆ సమయంలో అత్యధికంగా వివాహాది శుభకార్యాలు జరుపుకోవచ్చు. జనవరి 26వ తేదీ వసంతపంచమి వస్తుంది. ఇందులో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో శుభకార్యాలు ఉన్నాయి.
– మంగళంపల్లి శ్రీనివాసశర్మ, ప్రధాన పురోహితుడు (కరీంనగర్)