జగిత్యాల: విజయసంకేతం చూపుతున్న ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల, చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్, సుంకె రవిశంకర్, కోరుట్ల అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు , జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, తదితరులు
జగిత్యాల కలెక్టరేట్, ఆగస్టు 23: ‘బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. సబ్బండవర్గాల మనసును చూరగొన్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలంతా రెడీగా ఉన్నరు. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. ఇక జగిత్యాల జిల్లా పరిధిలోకి వచ్చే ఐదు అసెంబ్లీ స్థానాల్లో మనమే విజయం సాధిస్తాం’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. జిల్లా పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులకు జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు జగిత్యాల, కోరుట్ల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ ఎం సంజయ్, విద్యాసాగర్రావు, సుంకె రవిశంకర్తోపాటు కోరుట్ల అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరందరినీ జడ్పీ చైర్పర్సన్ సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. గడిచిన తొమ్మిదేండ్లలో ఏ వర్గానికి ఏం అవసరమో.. ఎవరూ అడుగకుండానే సీఎం కేసీఆర్ అమలు చేస్తూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని చెప్పారు. రైతు రుణమాఫీతో రైతుల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నదని, ప్రభుత్వమంటే ఇలా ఉండాలి..? ఇంత గొప్పగా సేవలందించాలని నిశ్చితాభిప్రాయానికి వచ్చారని చెప్పారు.
రాష్ట్ర సాధన ఉద్యమంలో ఏ విధంగా ఏకతాటిపై నిలిచి పోరాడారో..? నేడు సైతం అదే స్ఫూర్తితో ప్రభుత్వానికి వెన్నంటి ఉండేందుకు రెడీ అయిపోయారని వివరించారు. రాష్ట్రంలో నేరుగా ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లే దమ్ము ఏ పార్టీకి లేదన్నారు. కాంగ్రెస్ తమ హయాంలో చేసిన పనులు చెప్పుకునే స్థితిలో లేదని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ తొమ్మిదేండ్ల పాలనలో దేశాన్ని సర్వనాశనం చేసిందని, పరిశ్రమలను అమ్మడం, మూసివేయడం, బడా వ్యాపారవేత్తలకు కొమ్ముకాస్తూ సామాన్యుడిని ముప్పుతిప్పలు పెడుతున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంట్ ఇస్తుంటే.. కేంద్రం మాత్రం సిగ్గులేకుండా మోటర్లకు మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు. రాష్ర్టాన్ని, దేశాన్ని దశాబ్దాల పాటు పాలించి అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్, మళ్లీ అధికారం కోసం అర్రులు చాస్తున్నదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలకు అధికారం కావాలి..? మాకు ప్రజాభివృద్ధి కావాలని చెప్పారు. జగిత్యాల జిల్లా కావాలనే ఆకాంక్ష ఎన్నో ఏండ్లుగా ఉందని, కానీ జిల్లాగా ఎందుకు చేయలేదు..? ఎవరు అడ్డం పడ్డరు..? రోళ్లవాగు ఆధునీకరించాలనే ఆలోచన ఎందుకు చేయలేదో.. జగిత్యాలలో అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నిస్తున్న జీవన్రెడ్డి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఆయన గెలుపు కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతారని, దేనికైనా ఒడిగడుతారని మండిపడ్డారు. కాంగ్రెస్కు తక్షణమే అధికారం కావాలనే యావలో ఉన్నారని, బీజేపీ వాళ్లు అధికారాన్ని చేబూని అల్లకల్లోలాలు సృష్టించాలని చూస్తున్నారన్నారు. వారిని నేనొక్కటే ప్రశిస్తున్నానని, ప్రతి విషయంపై విమర్శించడం కాదని, గెలిస్తే తమ కంటే ఎంత గొప్పగా పనిచేస్తరో చెప్పాలన్నారు.
పార్టీయే నా ప్రాణం..
పార్టీయే నా ప్రాణం.. సీఎం కేసీఆరే నా దైవం. రెండో సారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా. చొప్పదండి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశా. ప్రజలంతా పార్టీ వెంటే ఉన్నరు. మెట్టప్రాంతమైన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి కోనసీమగా మార్చాం. సాగు నీరు లేక వలసబాటపట్టిన ఎంతో మంది తిరిగొస్తూ సంతోషంగా ఎవుసం చేసుకుంటున్నరు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం సీఎం కేసీఆర్ హయాంలో అద్భుత క్షేత్రంగా అభివృద్ధి జరుగుతోంది.
– సుంకె రవిశంకర్, చొప్పదండి ఎమ్మెల్యే
కాంగ్రెస్, బీజేపీలవన్నీ అబద్ధాలే..
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాయి. రాష్ట్రంలో ఏ పని చేపట్టినా విమర్శించే కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ పార్టీ పాలిత రాష్ర్టాల్లో పథకాలు పరిస్థితి ఏంటో చెప్పాలి. తెలంగాణ మాదిరి ఒక్క స్కీం అయినా అమలు చేస్తున్నరా..? వాళ్లు చెప్పేవన్నీ అబద్ధాలే. అధికారంలో ఉన్నప్పుడు వారి కడుపులు నింపుకొని ప్రజల కడుపు మాడ్చారు. ఇంకా ఎవరూ మర్చిపోలేదు. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదు.
– కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కోరుట్ల ఎమ్మెల్యే
జగిత్యాల నుంచే జైత్రయాత్ర
జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుంది. జిల్లా పరిధిలో ఉన్న ఐదు అసెంబ్లీ సీట్లలో విజయం మాదే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. మహిళలకు సీట్లు ఎక్కువగా కేటాయించలేదని కారుకూతలు కూస్తున్న పార్టీలు దమ్ముంటే మహిళా రిజర్వేషన్ కోసం పార్లమెంట్లో కొట్లాడాలి. మహిళా రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో పోరాటం చేస్తుంటే మీరంతా ఎక్కడికిపోయారు. సీఎం కేసీఆర్ను విమర్శించే ముందు సోనియా, రాహుల్ గాంధీ, మోదీ గతంలో రెండు స్థానాల్లో పోటీ చేసిన విషయాన్ని మర్చిపోయారా..? సమాధానం చెప్పాలి.
– దావ వసంత, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్