MLA Padi Kaushik Reddy | హుజురాబాద్ ఫిబ్రవరి 3 : ఎన్నికల్లో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరేస్తామని, ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కట్టాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన రెండు మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులకు బీఫారాలను మంగళవారం అందజేశారు.
ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయలతో గత పదేళ్లలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని గుర్తు చేశారు. నాటి రెండు మేజర్ గ్రామపంచాయతీలను నగరపంచాయతీలుగా ఆ తర్వాత మున్సిపాలిటీలుగా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. రెండు పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేసి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించామని చెప్పారు.
వాడవాడల రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, స్మశాన వాటికలు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిందని, మున్సిపల్ కాంప్లెక్సులను, మున్సిషల్ కార్యాలయాల భవనాలను ప్రభుత్వమే నిర్మించిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ చేసిందేమీ లేదు..
రాష్ట్రలలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తప్ప ఒక్క సీసీ రోడ్డు అయినా వేశారా.. అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటికూడా అమలు కాలేదని, హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉందని, అత్యధిక స్థానాలను గెలిచి మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
కొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు కూడా కరువయ్యారని, ప్రజలంతా మళ్లీ కేసీఆర్ వైపు చూస్తున్నారని, కావున కారు గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. తమ అభ్యర్థులంతా ప్రజలతో మమేకమై పనిచేస్తారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.