పెద్దపల్లి రూరల్ జూన్ 29: ‘మాకున్న కొద్దిపాటి భూములను రెక్కలు ముక్కలు చేసుకుని కాపడుకున్నం. ఇప్పుడు బైపాస్ రోడ్డు మా భూముల్లోంచి వేస్తామంటే అసలే ఒప్పుకోం. ఇంతకు ముందు ఎట్ల మంజూరైందో అట్లనే వేసుకోండి. అవసరమైతే చావనైనా చస్తాం గానీ, మా భూములు ఇవ్వం’ అని పెద్దకల్వల, పెద్ద బొంకూర్ రైతులు తేల్చి చెప్పారు. ఈ మేరకు సోమవారం పెద్దకల్వల శివారులో పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం సర్వే చేస్తున్న సిబ్బందిని అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా రాజీవ్ రహదారిపైకి చేరి పడుకుని నిరసన తెలిపారు.
మహిళా రైతులు రోడ్డుపైన పడుకొని పొర్లుదండాలు పెట్టారు. అరగంటకు పైగా ఆందోళన చేశారు. మొదట శంకుస్థాపన సమయంలో మంజూరైన విధంగానే రోడ్డు నిర్మాణం చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు దారి మళ్లించి మరో చోటు నుంచి బైపాస్ రోడ్డు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. రూటు మార్చడం వల్ల కొద్దో గొప్పో ఉన్న భూములు పోతే తాము ఏం చేసుకుని బతుకుడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకొని, బాధిత రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.