పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిందని కోరుట్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న సర్కారుకు అండగా నిలువాలని కోరారు. ఈ మేరకు మెట్పల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో మంగళవారం జగిత్యాల అదనపు కలెక్టర్ బీఎస్ లతతో కలిసి 347 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసి, వారినుద్దేశించి ప్రసంగించారు. – మెట్పల్లి/మారుతీనగర్,సెప్టెంబర్12
మెట్పల్లి/మారుతీనగర్,సెప్టెంబర్12: నిరుపేదల సొంతింటి కల సాకారానికే ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి అంకురార్పణ చేసిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. అన్నివర్గాల సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించాలని విజ్ఞప్తిచేశారు. మెట్పల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో మంగళవారం జగిత్యాల అదనపు కలెక్టర్ బీఎస్ లతతో కలిసి గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకొనేవారికి ప్రభుత్వం 3లక్షలు మంజూరు చేస్తున్నదని చెప్పారు.
పుట్టిన బిడ్డ నుంచి పెళ్లి చేసి అత్తారింటికి పంపేవరకు ఏదో పథకం కింద లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు. కోరుట్ల నియోజకవర్గానికి గృహలక్ష్మి కింద 3 వేలు ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. మెట్పల్లి పట్టణంలో 350 మందిని ఎంపిక చేస్తామని చెప్పారు. మహిళల గౌరవం పెంపునకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఆర్డీవో మధు, బీఆర్ఎస్ కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా.సంజయ్ కల్వకుంట్ల, మున్సిపల్ అధ్యక్షురాలు రాణవేని సుజాత, ఉపాధ్యక్షులు బోయినపల్లి చంద్రశేఖర్రావు, తహసీల్దార్ శేఖర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ముగ్గుపోసుకుంటం
మాది పేద కుటుంబం. ముగ్గురు పిల్లలు, నేను బీడీలు చుడుత. నా భర్త కైకిలు పోతడు. ఏండ్ల సంది అద్దె ఇంట్లో ఉంటున్నం. గుంట స్థలం ఉన్నది. అయితే చేతిలో డబ్బులు లేక ఇల్లు కట్టలేదు. నాకు ప్రభుత్వం గృహలక్ష్మి మంజూరు చేసింది. రూ. 3 లక్షలు ఇస్తుందనడంతో ధైర్యం వచ్చింది. మంచి ముహూర్తం చూసుకుని ముగ్గుపోసుకుంటం. ఇంటి నిర్మాణం పనులు చాలు చేస్తం. ఇంటి కలను నెరవేరుస్తున్న ఈ ప్రభుత్వాన్ని జీవితాంతం మర్చిపోం.
-పంచకోటి మణివాణి, గృహలక్ష్మి లబ్ధిదారు (మెట్పల్లి)
ఇల్లుకు బలమచ్చింది
మాకు ముగ్గురు కొడుకులు, ఒక బిడ్డ. కూరగాయలు అమ్మితేనే కుటుంబం గడుస్తది. ఇల్లు మందం గుంట దాక స్థలం ఉన్నది. కానీ, కట్టుకునేందుకు చేతిలో చిల్లి గవ్వలేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ సారు వల్ల ఇల్లు కట్టుకునేందుకు బలం వచ్చింది. ఈ డబ్బులకు మరికొన్ని డబ్బులు కలుపుకుని మంచిగా ఇల్లు కట్టుకుంటాం. మా కలను నిజం చేస్తున్న కేసీఆర్, ఎమ్మెల్యే సార్లకు రుణపడి ఉంటాం.
– లోకిని సాయమ్మ, గృహలక్ష్మి లబ్ధిదారు (మెట్పల్లి)
గెలిపిద్దాం.. గిఫ్ట్గా ఇద్దాం
మన సంక్షేమం, మన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు నిరంతరం శ్రమిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన తనయుడు, ప్రముఖ వైద్యుడు డా. కల్వకుంట్ల సంజయ్ను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించి విద్యాసాగర్రావుకు గిఫ్ట్గా ఇద్దాం. సంజయ్ను గెలిపిస్తే మన మెట్పల్లి పట్టణం మరింత అభివృద్ధి చెందుతుంది.
– రాణవేని సుజాత, బల్దియా చైర్పర్సన్, మెట్పల్లి
మూడు విడుతల్లో 3లక్షలు
ప్రభుత్వం సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకొనేవారికి గృహలక్ష్మి కింద 3లక్షలు అందిస్తున్నది. మూడు విడుతల్లో మంజూరు చేస్తున్నది. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సొంతింటి కలను సాకారం చేసుకోవాలి. ఈ స్కీం కింద దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడమే గాకుండా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం.
– బీఎస్ లత, జిల్లా అదనపు కలెక్టర్, జగిత్యాల
బీఆర్ఎస్ది చేతల ప్రభుత్వం
బీఆర్ఎస్ చేతల ప్రభుత్వం. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంది. పేదల అభ్యున్నతికి అనేక స్కీంలను తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ది. కాంగ్రెస్, బీజేపీ దొందు దొందే. మాటలతో మభ్యపెట్టడం తప్పా పనులు చేసేది ఉండదు. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం గృహలక్ష్మి కింద 3 లక్షలు ఇస్తున్నది. నయాపైసా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి. నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తా. కోరుట్లలో ఐటీ హబ్ ఏర్పాటు చేయించి యువతకు ఉపాధి కల్పిస్తా.
– డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి