BRS | తిమ్మాపూర్, మే24: ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాసిన లేఖ విషయాన్ని రాజకీయం చేయడం ఆపాలని, అది చిన్న అంశమని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు స్పష్టం చేశారు. మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పార్టీ అంతర్గత అంశాన్ని ఇతర పార్టీలు అద్దంలో పెట్టి చూస్తున్నాయన్నారు. బండి సంజయ్, పొన్నం ప్రభాకర్, కేసీఆర్ ఇష్యూ ఉంటే చాలు మైకులందుకుంటారని, కేసీఆర్ గురించి మాట్లాడితే తాము ఫ్రంట్ పేజీల్లో కనిపిస్తామని అలా చేస్తారని ఎద్దేవా చేశారు. లేఖ అంశంపై రాజకీయాలు చేయడం ఆపాలన్నారు. ఎమ్మెల్సీ కవిత గతంలో సైతం ఎన్నోసార్లు అధినేత కేసీఆర్కు సూచనలు చేశారని, బీఆర్ఎస్ పార్టీలో ఆ స్వేచ్ఛ అందరికీ ఉందన్నారు. గతంలో ఆమె చేసిన సూచనలను పాటించి సక్సెస్ అయ్యామన్నారు.
ఈ విషయంపై మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. తన కాంగ్రెస్ పార్టీలో మహిళలకు పదవులు ఇవ్వడం లేదని సాక్ష్యాత్తు మహిళా అధ్యక్షురాలు పీసీసీ అధ్యక్షుడి చాంబర్ ముందు ధర్నా చేసిందని, అప్పుడెందుకు నోరు మెదపలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించిన కేంద్రంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చిన్న చిన్న అంశాలపై దృష్టిసారించకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిసారించాలని హితువుపలికారు. గతంలో అనేక సార్లు లేఖ రాసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేతిరెడ్డి దేవెందర్రెడ్డి, రావుల రమేష్, ఉల్లెంగుల ఏకానందం, పాశం అశోత్రెడ్డి, తిరుపతి, సుదగోని సదయ్య, తదితరులు పాల్గొన్నారు.