కలికోట శివారులోని సూరమ్మ చెరువు విస్తీర్ణం 650 ఎకరాలు.. ఇది కథలాపూర్తో పాటు మేడిపల్లి, భీమారం, రుద్రంగి మండలాల పరిధిలోని వందలాది చెరువులకు ఆధారం.. వాటి పరిధిలో సుమారు 50 వేల ఎకరాల ఆయకట్టు.. వేలాది మంది రైతులకు జీవనోపాధి.. కానీ, నాటి సమైక్య పాలకుల పుణ్యమాని ఆ చెరువు నెర్రెలువారింది. ఫలితంగా వందలాది చెరువులు వట్టిపోయి, వేలాది ఎకరాల ఆయకట్టు బీడుగా మారింది. రైతాంగం జీవనోపాధి కోల్పోయింది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో వరదకాలువ జీవనదిలా మారడం.. తాజాగా సూరమ్మ చెరువును ఎత్తిపోతల ద్వారా నీటిని నింపుతామని సీఎం కేసీఆర్ జగిత్యాల సభలో ప్రకటించడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తమ భూములు సస్యశ్యామలమవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కథలాపూర్, డిసెంబర్ 8 : బీడుగా ఉన్న వేలాది ఎకరాల భూములను సాగులోకి తేవాలనే ఉద్దేశంతో కథలాపూర్ మండలం కలికోట శివారులో సూరమ్మ ప్రాజెక్టు నిర్మించేందుకు 2006లో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రణాళిక రూపొందించారు. కానీ, ఈ ప్రాజెక్టులోకి అధికంగా నీళ్లు వచ్చే మార్గం లేకపోవడంతో అవి కార్యరూపం దాల్చలేదు. వరదకాలువ కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల్లోని పలు గ్రామాల మీదుగా వెళ్తున్నా.. గతంలో వరదకాలువలో నీళ్లు లేకపోవడం, నీళ్లున్నా లిఫ్ట్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన అప్పటి పాలకులకు రాకపోవడంతో సూరమ్మ చెరువు నిండడం కలగానే మిగిలిపోయింది. కానీ, రాష్ట్రం అవతరించిన తర్వాత ఆశలు చిగురించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవడం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో వరదకాలువ జీవనదిలా మారడంతో భరోసా కనిపించింది. తాజాగా వరదకాలువ నుంచి ఎత్తిపోతలతో నింపాలని, అందుకు అవసరమైన నిధులు ఇస్తామని తాజాగా (గురువారం) జగిత్యాల సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. సూరమ్మ చెరువు నింపడంతోపాటు కుడికాలువల నిర్మాణం పూర్తయితే వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్ మండలం, మేడిపల్లి, భీమారం, రుద్రంగి మండలాల్లో సుమారు 50 వేల ఎకరాలకు నీరందనుండగా, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నెరవేరనున్న రైతుల కల
సూరమ్మ చెరువులోకి నీళ్లు వచ్చే మార్గం లేకపోవడంతో గతంలో చెరువు నెర్రెలు బారింది. ఎస్సారెస్పీ వరదకాలువ నుంచి నీళ్లు అందిద్దామన్నా కాలువ చెరువుకు దిగువ ప్రాంతంలో ఉన్నది. ఈ క్రమంలో చెరువు నింపాలంటే ఎత్తిపోతల పథకం అనివార్యం అవుతున్నది. ఈ విషయాన్ని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు సీఎం కేసీఆర్కు విన్నవించారు. దీంతో జగిత్యాల సభలో సీఎం కేసీఆర్ వరదకాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా సూరమ్మ చెరువును నింపుతామని, అందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నియోజకవర్గంలోని రైతుల కల నెరవేరినట్లయింది.
ప్రణాళిక ఇలా..
సూరమ్మ చెరువు ఎత్తు ప్రాంతంలో ఉండడంతో నీరు నింపడం ఎట్ల? అని పలుసార్లు అధికారులు సర్వే చేశారు. వరదకాలువ నుంచి ఎత్తిపోతలతోనే నింపవచ్చని తుది నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. వరదకాలువ నుంచి సూరమ్మ చెరువు వరకు సూమారు 15 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ పనులకు సుమారు 783 కోట్లు అవసరం అవుతాయని అధికారులు ప్రతిపాదించారు. కథలాపూర్ మండలం దుంపేట శివారులో ఎత్తిపోతల పంపులు బిగించి ప్రత్యేక పైపులైన్లు ఏర్పాటు చేసి సూరమ్మ చెరువులోకి నీరు చేరేలా ప్రణాళిక రూపొందించారు.
రెండు పంటలకు నీళ్లందుతయ్
ఎన్నో ఏండ్ల సంది భూముల్లో పూర్తిగా పండించలేక పోయి నం. వానకాలంలనే పంటలు వేసేది. ఏసంగిలో భూములను బీడుగ ఉంచేటోళ్లం. సూరమ్మ చెరువును నీళ్లతోనింపు తమని సీఎం కేసీఆర్ చెప్పడం సంతోషంగా ఉంది. సూరమ్మ చెరువు నిండితే రెండుపంటలకు నీళ్లందుతయ్.
సాగుకు భరోసా
వాన పడితేనే కథలాపూర్ మండలంలో పంటలు పండే పరిస్థితి. వర్షాల కోసం నిరీక్షించి విత్తనాలు వేసేది. సూరమ్మ చెరువులో నీళ్లుంటే రైతుల కష్టాలు తీరినట్లే. ఏడాదిలో రెండు పంటలకు పుష్కలంగా నీళ్లందుతాయి. బోరుబావులపై ఆధారపడి సాగుచేసుకుంటున్న మెట్టప్రాంత రైతులకు దేవుడు సూరమ్మ చెరువు రూపంలో వరమిచ్చినట్లయింది. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– ధరావత్ సరోజ, సర్పంచ్ (కలికోట)
ఏళ్ల కల నెరవేరుతున్నది
సూరమ్మ చెరువు నిండుతుందని ఏళ్లుగా నిరీక్షించినం. జగిత్యాల సభలో వరదకాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా సూరమ్మ చెరువుకు నీళ్లందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతులు సంతోషపడుతున్నరు. ఇన్నాళ్లూ సాగుపై నిరాశతో ఉన్న రైతులకు ఆశలు చిగురించినయ్. ఇందుకు కృషి చేసిన మంత్రులకు, ఎమ్మెల్యే రమేశ్బాబుకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు.
-సంగు నరేశ్, రైతు (కలికోట)