కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొన్నటిదాకా బీడుభూములకు ప్రాణం పోసింది. మంథని నియోజకవర్గంలో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు జీవధారమైంది. శ్రీరాంసాగర్ నుంచి నీళ్లిచ్చే పరిస్థితి లేకున్నా.. ఎల్లంపల్లి నుంచి లింక్ కెనాల్ ద్వారా నీరు ఇవ్వడంతో సాగు పండుగలా సాగింది. ఎల్లంపల్లిలోనూ నీటి లభ్యత లేని సమయంలో దిగువ నుంచి ఎత్తిపోసి నింపడంతో ఏనాడూ ఇబ్బంది కాలేదు. కానీ, ప్రస్తుతం సాగు ప్రశ్నార్థకంగా మారింది. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో నీటిమట్టం తగ్గడం, కాళేశ్వరం నుంచి ఎత్తిపోసే పరిస్థితి లేకపోవడం శాపంలా పరిణమిస్తున్నది. సాగునీరు లేక దాదాపు పది వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతుండగా, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెర్రెలు వారుతున్న పొలాలను చూసి కన్నీరు పెడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడూ ఇలాంటి దుస్థితి రాలేదని గుర్తు చేస్తున్నారు. సాగు నీరందించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపిస్తున్నారు.
కింది చిత్రంలో కనిపిస్తున్న కాకర్లపల్లికి చెందిన రైతు ఆకుల భాస్కర్. పదిహేనేళ్లుగా వ్యవసాయం చేస్తున్నడు. ఏడెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అది ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు పరిధిలోని కాకర్లపల్లిలో ఉన్నది. మొన్నటి దాకా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు చేసుకున్నడు. ఏటా రెండు పంటలు పండించాడు. కానీ, ఈ యేడు ఒక్క తడుపు కూడా రాక ఆ ఏడెకరాల పొలం దాదాపు ఎండిపోయింది. దీంతో చేసేదేమీ లేక పొలంలో ఇలా ఎడ్లను మేపుతున్నడు. కాంగ్రెస్ పాలనలో ఇగ నష్టమే తప్ప రైతులకు లాభం ఉండదని, వ్యవసాయమే ఇక దండుగ అని ఆగ్రహిస్తున్నడు. కేసీఆర్ ప్రభుత్వంలో పుష్కలంగా నీళ్లు వచ్చాయని, రెండు పంటలు పండించామని గుర్తు చేస్తున్నడు.
పెద్దపల్లి, మార్చి 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాక ముందు మంథని నియోజకవర్గంలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు భూములకు నీరందకపోయేది. ఏటా యాసంగిలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండగా, రైతులు ఆగమయ్యేది. ఇలాంటి కరువు పరిస్థితులను దూరం చేసే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గుండారం రిజర్వాయర్కు పైప్లైన్ వేసింది. దీని ద్వారా ఎల్లంపల్లి నుంచి 2టీఎంసీల నీటిని గుండారం, బేగంపేట, శుక్రవారంపేట రిజర్వాయర్లను నింపుకొని, కమాన్పూర్, ముత్తారం, మంథని ప్రాంతాల్లోని ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు ఇవ్వాలని భావించింది.
అయితే ఏటా మార్చి తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టులో తగినంత నీటి లభ్యత లేక నీళ్లిచ్చే పరిస్థితి ఉండేది కాదు. దాంతో పంటలు చేతికొచ్చే దశలో ఎండిపోయే వి. పెట్టిన పెట్టుబడులు ఎల్లక రైతులకు అప్పులే దిక్కయ్యేవి. ఒక దశలో ఆత్మహత్యలే శరణ్యమయ్యేవి. కా నీ, కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడంతో పరిస్థితి మారింది.
మేడిగడ్డ నుంచి ఎగువ బ్యారేజీల్లోకి గోదావరి జలాల ను ఎత్తిపోయడంతో ఎల్లంపల్లి ఎప్పుడూ నిండుగా ఉండేది. దాంతో మంథని నియోజకవర్గంలోని ఎస్సారె స్పీ చివరి ఆయకట్టు వరకూ సమృద్ధిగా నీరందింది. గతేడాది మార్చిలో పార్వతీ పంప్హౌస్ ద్వారా ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోసుకోవడంతో సాగునీటి సమస్య లేకుండా పోయింది. అప్పుడు ఎల్లంపల్లిలో 20.175టీఎంసీల సామర్థ్యానికి గాను 18.536 టీఎంసీల నీరు నిల్వ చేశారు. గతేడాది ఎస్సారెస్పీకి తోడు లింక్ కెనాల్ ద్వారా డీ-83, 86 కెనాళ్లకు ఎల్లంపల్లి జలాలను అందించారు. దాంతో ఎస్సారెస్పీ జలాలపై ఆధారకుండానే పంటలకు సమృద్ధిగా నీళ్లిచ్చారు. కానీ, ప్రస్తుతం సాగునీరు రాక ఎండుతున్న పంటలను చూసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి అవసరాలకే కష్టం
ప్రస్తుతం ఎస్సారెస్పీలో 90 టీఎంసీల సామర్థ్యానికి గాను 31.42 టీఎంసీలే ఉన్నాయి. ఇవి రానున్న వేసవి నేపథ్యంలో సాగునీరు, తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగపడనున్నాయి. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టులోనూ 10 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా తాగునీటి అవసరాలు, ఎన్టీపీసీ విద్యుదుత్పత్తికి మాత్రమే సరిపోనున్నాయి. ప్రతి రోజూ ఇక్కడి నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 331 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121క్యూసెక్కులు, గూడెం కెనాల్కు 145క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రతి రోజూ మొత్తం 595క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఇదే లెక్కన నీటి వినియోగం జరిగితే జూన్, జూలై వరకూ హైదరాబాద్ తాగునీటి అవసరాలకే సరిపోయే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు సాగునీరివ్వడం గగనంగానే కనిపిస్తున్నది.
ఎండిపోతున్న పంటలు
గతంలో ఎస్సారెస్పీ నుంచి నీళ్లు రాకున్నా.. లింక్ కెనాల్ ద్వారా ఎల్లంపల్లి నుంచైనా నీళ్లిచ్చేది. కానీ, ఈ సారి అటు ఎస్సారెస్పీ, ఇటు ఎల్లంపల్లి నుంచి సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. దీంతో మంథని నియోజకవర్గంలో మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. దాదాపు పది వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల దెబ్బతింటున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఏప్రిల్, మేలో పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కండ్లముందే ఎండుతున్న పంటలను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. పాలకుల అవగాహనలోపం, పట్టింపులేనితనంతోనే ఈ దుస్థితి వచ్చిందని మండిపడుతున్నారు. తక్షణం తడుపు ఇస్తే తప్పా పంటలను కాపాడుకునే అవకాశం లేదని చెబుతున్నారు. ఇటు పంటలను రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కొందరు చేసేదేమీ లేక పంటలను వదిలేస్తున్నారు.
కాళేశ్వరమే పరిష్కారం
కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి పెద్దపల్లి జిల్లాకు ఎక్కడా సాగునీటి సమస్య రాలేదు. ప్రధానంగా ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు ప్రాంతమైన మంథని నియోజకవర్గానికి ఏ ఇబ్బందీ ఎదురుకాలేదు. మూడు నాలుగేండ్లుగా గోదావరి జలాలను మేడిగడ్డ వద్ద ఒడిసిపట్టి, ఎగువ బ్యారేజీలు, పంపుహౌస్లతో ఎల్లంపల్లిని నింపుకోవడంతో ఎప్పుడు చూసినా ఆ ప్రాజెక్టు నిండుగా కనిపించేది. లింక్ కెనాల్ ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీటిని అందించాలన్నా.. 2 టీఎంసీల ద్వారా మంథని నియోజకవర్గంలోని చివరి ఆయకట్టకు నీళ్లు ఇవ్వాలన్నా.. కాళేశ్వరం ఎత్తిపోతలే శాశ్వత పరిష్కారంగా ఉన్నది.
దాంతోనే రైతులు సంబురంగా సాగు చేసుకుంటున్నారు. యాసంగిలోనూ బంగారం లాంటి పంటలు పండిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. అవగాహన, ప్రణాళికా లోపం ఈ ప్రాంత రైతులకు శాపంలా పరిణమించింది. ఈసారి సాగునీరు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుండగా, సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. మేడిగడ్డ బ్యారేజీకి వేగంగా మరమ్మతులు చేపట్టి ఎత్తిపోతలను కొనసాగిస్తేనే వచ్చే సీజన్లోనైనా పంటలకు నీరందుతుంది. లేదంటే భూములు బీళ్లుగా ఉంచే దుస్థితి వస్తుంది. అందుకే రాజకీయాలను పక్కన పెట్టి తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తేవాలని కర్షకలోకం విజ్ఞప్తి చేస్తున్నది.
ఎన్నడూ గుంట కూడా ఎండలె
కాళేశ్వరం నడిచినన్ని రోజులు మాకు ఏ రోజు సాగు నీటికి ఇబ్బంది కాలేదు. పుష్కలంగా సాగు నీరు వచ్చింది. పంటలు పండిచ్చుకున్నం. ఇప్పుడెందుకు ఈ సమస్య వచ్చిందో ప్రభుత్వమే పరిశీలించాలే. నేను ఆరెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న. నాట్లప్పుడు ఒక్క తడుపు వచ్చింది. ఇగ మల్ల కాలువల్ల నీళ్లు కానరాలె. ఇైట్లెతే రైతు ఎట్ల బతుకుడు? రైతుకు ఎట్ల కౌలు గట్టాలె? అసలు ఎట్ల బతుకుడు? ఈ ఏడు నష్టమే. కేసీఆర్ సీఎం ఉన్నన్నీ రోజులు ఎన్నడూ గుంట కూడా ఎండలె. గట్ట జూసుకున్నడు.
-తానె లింగయ్య, రామకిష్టాపూర్ (ముత్తారం మండలం)
మోయెడు పంటలు మంచిగా పండినయ్
మాది కాకర్లపల్లి. మోయెడు పుష్కలంగా కాలువ నీళ్లు అచ్చినయి. పంటలు మంచిగా పండినయి. అందుకే ఈ యేడు చెరువెనుక ఆరెకురాలు, బోరు కింద మూడెకురాలు కౌలుకు తీసుకొని దున్నుతున్న. ఇప్పటి దాకా ఒక్క చుక్క నీళ్లు రాలే. బోర్ల నీళ్లు అత్తలెవ్వు. పొలం అల్లిపోతంది. పంటెట్ల పండుతది? ఎడ్ల మేపుడే అయేటట్టు ఉన్నది. గరీబోల్లం గదా. బటాయికి తీసుకున్న కాడ ఏం ఇయ్యాలే. ఆసామికి ఏం గట్టాలే. ఇప్పటికే ఎకురానికి ముప్పై వేల దాకా ఖర్చయింది. గిట్లయితే మేం ఎట్ల బతుకుతం? ఏది ఏమైనా మాకు కాలువ నీళ్లు కావాలే. పంటలు పండిచ్చు కోవాలే. గట్ల జూడాలే.
– తోట రాజయ్య, కాకర్లపల్లి (మంథని మండలం)