Sunke Ravishankar | గంగాధర, జూలై 16: తన రాజకీయ గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు ఇవ్వడానికి తో అధికంగా సహాయం చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోని పంట భూములను బీడు భూములుగా మార్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే సుంకర శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలకు నీళ్లు ఇవ్వాలని కోరితే బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని పంట పొలాల్లో చల్లాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తదానం చేశారు. తమ రక్తాన్ని చూపుతూ తాము రక్తాన్ని ఇస్తున్నాము, తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వు రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ కెసిఆర్ హయంలో కాలేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని గుర్తు చేశారు. కెసిఆర్ ను బదనాం చేయడానికి కన్నేపల్లి నుండి నీటి నెత్తిపోయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని దుయ్యబట్టారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నేపల్లి పంప్ హౌస్ను సందర్శించి, నీటిని ఎత్తిపోయాలని కోరితే , పంట పొలాల్లో బిఆర్ఎస్ పార్టీ నాయకుల రక్తం చల్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం హేయమైన చర్య అని దిగబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్తం మరిగిన తోడేలుల వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలేశ్వరం పంప్ హౌస్ నుండి నీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలా గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు, నాయకులు కంకణాల విజయేందర్ రెడ్డి, వేముల దామోదర్, రామిడి సురేందర్, ముక్కెర మల్లేశం ద్యావ మధుసూదన్ రెడ్డి, మడ్లపల్లి గంగాధర్, ఎండి నజీర్, జోగు లక్ష్మీరాజం, వట్లూరి ఆదిమల్లు, దోమకొండ మల్లయ్య, మామిడిపల్లి అఖిల్, జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.