సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు మళ్లీ విషం కక్కుతున్నాయి. విజయవంతంగా అమలవుతున్న స్కీంలకు అడ్డుపుల్లలు వేసేందుకు కుట్రలు పన్నుతున్నాయి. రైతులకు పంట పెట్టుబడి గోస తీర్చే రైతుబంధుపై కాంగ్రెస్ తన అక్కసు వెల్లగక్కింది. ఎన్నికల కోడ్ ఉన్నందున యాసంగి సీజన్కు పెట్టుబడి సాయం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని తాజాగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయగా, ఆ పార్టీ కుటిల బుద్ధి బయటపడింది. కోడ్ పాత పథకాలకు వర్తించదని తెలిసినా.. 2018 నుంచి అమలవుతున్న ఈ పథకాన్ని నిలిపివేయాలని ఫిర్యాదు చేయడంపై కర్షకలోకం భగ్గుమంటున్నది.
గత ఎన్నికల సమయంలోనూ ఇలాగే ఇబ్బందులకు గురి చేసిందని, మళ్లీ అదే తీరున వ్యవహరిస్తున్నదని మండిపడుతున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హస్తం పార్టీ, రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేసింది. కాంగ్రెస్ రైతు వ్యతిరేకి అని, కుట్రలను సహించేది లేదని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నది. ఇటు గత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో దళితబంధు ఆపాలంటూ బీజేపీ ఫిర్యాదు చేసిన తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అక్కసు వెల్లగక్కడంపై దళితలోకం ఆగ్రహిస్తున్నది. – కరీంనగర్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పెట్టే బిచ్చాన్ని కాంగ్రెసోళ్లు, పువ్వుగుర్తోళ్లు ఎత్తగొడ్తరు. బీజేపోళ్లు చెయ్యవట్టి నాకు దళితబంధు యేడాది ఎనుకకు వచ్చింది. అప్పుడు ఎలచ్చన్లు ఉన్నయని ఆపిచ్చిండ్రు. తినే కంచంల మన్నుపోసే రకాలు వాళ్లు. ఇప్పుడు రైతుబంధు ఇయ్యొద్దని కాంగ్రెసోళ్లు మళ్ల ఆపిచ్చిండ్రని టీవీలల్ల వార్తలు చూస్తే తెలిసింది. వాళ్లు ఇయ్యరు.. ఇచ్చెటోళ్ల కాళ్లల్ల కట్టె పెడ్తరు. కాంగ్రెసోళ్లు, పువ్వుగుర్తోళ్లను నమ్మితే మోసపోవడం ఖాయం. వాళ్లు నోటికాడికి వచ్చిన ముద్దను లాక్కుంటరు. దళితబంధులో గడ్డికట్టలు కట్టే మిషన్, ట్రాక్టర్ కొన్న. నా మందం నేను బతుకుతున్న. నాకొడుకుకు పెళ్లి ఇంకా కాలేదు. దళితబంధు చేయబట్టి నా కొడుక్కు ఉపాధి దొరికింది. కాంగ్రెసోళ్లు రైతుబంధు ఆపితే రైతులకు పెట్టుబడికి కట్టమైతది. వాళ్లకు మా ఉసురుతగుల్తది.
-మొలుగూరి సమ్మయ్య, రైతుబంధు, దళితబంధు లబ్ధిదారుడు(హుజూరాబాద్)
కరీంనగర్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీ, కాంగ్రెస్ ఏనాడూ రైతు సంక్షేమాన్ని పట్టించుకోలేదు. ఏండ్లకేండ్లు పాలించిన హస్తం పార్టీ.. ఇప్పుడు పాలిస్తున్న కమలం పార్టీ అన్నదాతకు మేలు చేసే ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదు. అలాగే, సమైక్య రాష్ట్రంలోనూ టీడీపీ, కాంగ్రెస్ అదే ధోరణితో వెళ్లాయే తప్ప.. కర్షకులను ఆదుకునేందుకు పథకాలు అమలు చేయలేదు. ఫలితంగా పెట్టుబడి లేక.. వ్యవసాయం ముందుకు సాగక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీస సాయం అందక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ సర్కారు భరోసానిచ్చింది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్లారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్కు శ్రీకారం చుట్టి.. దశాబ్దాల సాగునీటి గోసను తీర్చారు. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తూ కష్టాలకు పరిష్కారం చూపారు. రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు. అన్నదాత దురదృష్ట వశాత్తూ ఏదేని కారణంతో చనిపోయినా రైతు బీమాతో కుటుంబానికి భరోసానిస్తున్నారు.
రైతులు ఏటా పంటల సాగు సమయంలో పెట్టుబడికి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త పథకాన్ని తెచ్చారు. 2018 మే 10న హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్ – శాలపల్లి వేదికగా రైతుబంధుకు శ్రీకారం చుట్టారు. ఆనాటి నుంచి నేటి వరకు ఏడాదికి రెండు సార్లు.. వానకాలం, యాసంగి సీజన్లలో పెట్టుబడి సాయం కింద ఎకరాకు 5 వేల చొప్పున ఏడాదికి 10 వేలు ఇస్తున్నారు. గుంట వ్యవసాయ భూమి ఉన్నా పెట్టుబడి సాయం అందిస్తున్నారు. గడిచిన వానకాలంతో కలిపి చూస్తే ఇప్పటి వరకు 11 విడుతలుగా అందించారు.
అధికారిక లెక్కల ప్రకారం చూస్తే.. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 9.25,343 మంది రైతులు సాగు చేస్తుండగా, వీరికి బీఆర్ఎస్ ప్రభుత్వం పదకొండు విడుతల్లో 7,750.68 కోట్ల పైచిలుకు మొత్తాన్ని పెట్టుబడి కింద అందించింది. ఈ లెక్కన ఒక సీజన్లో చూస్తే సగటున 700 నుంచి 800 కోట్ల వరకు అన్నదాతలకు పెట్టుబడి సహాయం అందుతున్నది. అదే ఏడాదికి 1400 నుంచి 1600 కోట్ల వరకు వస్తున్నది. ప్రభుత్వం అన్ని రకాలుగా వెన్నుదన్నుగా నిలుస్తుండడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం 2014తో పోలిస్తే 100 శాతానికి పైగా పెరిగింది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయం మొదటి ఏడాది 12 వేలకు పెంచి, ఆ తర్వాత ఐదేండ్లలో 16 వేలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా, మ్యానిఫెస్టోలో ప్రకటించారు. అంటే రైతులపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉన్నదో చెప్పడానికి గతంలోని పథకాలే కాదు, తాజా మ్యానిఫెస్టో చూస్తే అర్థమవుతుంది.
నిజానికి యాసంగి సీజన్కు సంబంధించి వచ్చే నెల అంటే నవంబర్లో ప్రభుత్వం రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. గతంలోనూ యాసంగి సీజన్కు సంబంధించి నవంబర్ నెలలోనే పెట్టుబడి సాయం అందించింది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు ప్రక్రియను యథావిధిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే, కొత్త రైతులకు కూడా అవకాశం ఇవ్వడంతోపాటు రైతుబంధు కోసం అన్ని వివరాలను ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయ శాఖలు ప్రభుత్వానికి అప్లోడ్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటిలాగే ఈ ప్రక్రియను కొసాగించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ ఈ పథకంపై విషం చిమ్ముతున్నది. రైతుబంధు నిలిపి వేయాలంటూ ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే స్వయంగా ఈ నెల 23న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం బహిర్గతమైన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.
నిజానికి ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కొత్త పథకాలు ప్రారంభించరాదనే నిబంధన ఉంది. అదే సమయంలో పాత పథకాలను యధావిధిగా కొనసాగించవచ్చు. కానీ, కాంగ్రెస్ మాత్రం నీచ రాజకీయాలకు పాల్పడుతూ, రైతుల పొట్టగొట్టే కుట్రలకు పూనుకున్నదని తాజా ఫిర్యాదు స్పష్టం చేస్తున్నది. అంతేకాదు, ఆ పార్టీ రైతు వ్యతిరేకి అని మరోసారి రుజువు చేసుకున్నదని కర్షకలోకం మండిపడుతున్నది. నిజానికి 2018 ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ ఈ తరహా కుట్రలకు పాల్పడింది.
కానీ, రైతులు ఆ పార్టీకి బాగా బుద్ధి చెప్పారు. అలాగే, హుజూరాబాద్ ఎన్నికల సమయంలోనూ దళితబంధు నిలిపివేయాలంటూ ఆనాడు బీజేపీ ఇదే తరహా పంథాను అనుసరించి ప్రజల్లో అబాసుపాలైంది. నిజానికి నవంబర్లో పెట్టుబడి వస్తే.. సాగు చేసుకునేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై రైతులు భగ్గుమంటున్నారు. గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దహనం చేసి, నిరసనలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్ రైతుబంధు అమలు చేస్తున్నారని, కానీ కాంగ్రెస్ ఇవేవీ పట్టించుకోకుండా పెట్టుబడి సహాయాన్ని ఆపేందుకు లేఖలు రాయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ కుట్రలు మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
నాపేరు తోట రాములు. మాది కథలాపూర్ మండలం చింతకుంట. నాకు ఊళ్లే పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో కరెంట్లేక, నీళ్లు రాక, పెట్టుబడులు ఎల్లక అరిగోసపడ్డం. తెలంగాణ వచ్చిన తర్వాతనే మా బతుకులు బాగుపడ్డయి. నాకు పసలుకు ఎకరానికి రూ.5వేల పెట్టుబడి వస్తంది. కాంగ్రెస్ రైతు బంధు ఆపాలని అంటున్నదట. మేం బాగుపడితే వాళ్లకు నచ్చదా..? వాళ్లు అధికారంలో ఉన్ననాడు ఏం చేయలే. ఇప్పుడు చేసేటోళ్లను చేయనిస్తలేరు. ఇదేం పద్ధతి. రైతు బంధు ఆపితే మాకు అప్పుల పాలైతం. ఏం లేకముందే మా రైతులమీద ఇన్ని కుట్రలు చేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత మా బతుకులు ఆగమే అయితయి. ఆత్మహత్యలే గతిఅవుతాయి. రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తది.
– తోట రాములు, రైతు, చింతకుంట(కథలాపూర్)
ఆర్థికంగా చితికిపోయిన మాకు సీఎం కేసీఆర్ ఇచ్చిన దళిత బంధుతో ఇప్పుడిప్పుడే నిలదొకుకుంటున్నం. మేం ఆర్థికంగా ఎదిగితే వాళ్లకు ఓట్లు రావని భయపడి కాంగ్రెస్ నాయకులు మేం తినే అన్నంల మట్టి కొట్టినట్లుగా చేస్తున్నరు. దళిత బంధును ఆపమని కాంగ్రెస్ నాయకులు చాలాసార్లు బాహాటంగా అన్నరు. అంతే కాకుండా, ఎన్నికల సంఘానికి లేఖ రాసి, దళితుల నోటికాడి బుక లాకున్నరు. దళితులను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే ఎలాగైనా అడ్డుకుని లబ్ధిపొందాలని కాంగ్రెస్ నాయకులు లేఖ ఇచ్చిన్రు. ఈ పథకం కొన్ని రోజులు ఆగినంత మాత్రాన మా ఓట్లు మాత్రం కాంగ్రెస్, బీజేపీకి వేసేది లేదు. దళితుల పక్షపాతిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, బీఆర్ఎస్కు అండగా ఉండి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తం. దళితులు అంటే ఏందో ఢిల్లీలోని నేతలకు చూపిస్తం.
– బత్తుల రాజలింగం, దళిత నాయకుడు, గాంధీనగర్(హుజూరాబాద్టౌన్)
ఎనుకటి నుంచి అయ్యా బాంచెన్ అనిపించుకునే దొరల పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాయకులు వారి ఆధిపత్యానికి ఎకడ దళితులు అడ్డుపడతారోనని కుట్రపూరితంగా దళితబంధు పథకాన్ని మధ్యలోనే ఆపడానికి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన్రు. ప్రతిపక్ష పార్టీల నాయకుల కుట్రలకు తగ్గట్టు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో దళితులందరం ఓటేసి గెలిపిస్తం. దళితుల ఔన్నత్యాన్ని చాటుతం. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై చీకటి ఒప్పందాలతో బీఆర్ఎస్పై కుట్రలు పన్నుతున్నది. ప్రజలను మోసగించడానికి పైకి ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నరు. దళితులను అయోమయానికి గురి చేయాలని చూస్తున్నరు. ఈ రెండు పార్టీలు దొందూ దొందే అని మాకు తెలుసు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా దళితుల పక్షపాతిగా ఉన్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్కు అండగా ఉండి వచ్చే నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటం.
– పోచంపల్లి సదయ్య, దళిత నాయకుడు, పెద్దపాపయ్యపల్లి (హుజూరాబాద్టౌన్)
నాది మంథని మండలం సూరయ్యపల్లి గ్రామం. నాకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. గతంలో ఏ ప్రభుత్వం గిట్ల ఎవుసానికి సాయం చేయలేదు. పంటలు పండియ్యాలంటే లాభం కన్నా, నష్టాలే మిగిలేవి. ఏడాది పొడువు కష్ట పడ్డ వచ్చిన పైసలు అప్పులు కట్టేందుకు కూడా సరిపోయేవి కాదు. మళ్ల వ్యవసాయ పనులు చేయడానికి అప్పులు తీసుకోవచ్చు, పంట చేతికి అచ్చిన తరువాత అప్పులు కట్టుడు. ఎప్పటికీ ఇట్లనే జరుగుతుండేది. కానీ కేసీఆర్ అచ్చినంక రైతు బంధు పథకం ద్వారా రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి కింద సాయం అందజేస్తున్రు. ఆ డబ్బులను ఎరువులు కొనేటందుకన్నా లేదా కూలీల ఖర్చులకన్నా ఉపయోగపడుతున్నై. పంట సాయం ఆపేందుకు కాంగ్రెసోళ్లు కుట్రలు జేత్తున్నరు. ఎన్నికలు వస్తే మేము ఎవుసం చేయద్దా. రైతు బంధు ఇవ్వద్దంటే మరీ మేం మళ్లీ అప్పులు తెచ్చుకొని పంటల సాగు చేసుజోవాలా..? కాంగ్రెస్సోళ్లు ఇయ్యద్దనుడు ఎంత మాత్రం సరికాదు. వాళ్లు పెట్టరు.. సర్కారును పెట్టనియ్యరా.
– గాదె గట్టయ్య, రైతు, సూరయ్యపల్లి, (మంథని)
కాంగ్రెస్ సర్కారున్నపుడు కరెంట్ ఇచ్చే శాతగాలేదు. వాళ్లిచ్చిన కరెంట్ కోసం రాత్రి పగలు పంటకాడ్నే పడిసచ్చినం. వచ్చిన కరెంట్ గుంట కూడ తడవక మొత్తం ఎండి పోయి అప్పుల పాలు జేసింది. ఎప్పుడో ఓసారి చేతికొచ్చిన పంటను కొన్న మోహం లేదు. పదేండ్ల సంది పంటలు మంచిగ పండుతున్నయి. కేసీఆర్ పుణ్యమా అని గిట్టుబాటు ధర ఇచ్చి వడ్లు కొంటుండు. వద్దన్నా.. ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇత్తుండు. ఆనాడేమో కాంగ్రెసోళ్లు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఎరువులు, విత్తనాలు ఇయ్యమంటే గంటల కొద్దీ లైన్లో నిలబెట్టి ఒకలనొకలం తన్నుకునేట్టు చేసిండు. గియ్యాలొచ్చి ఏదో ఎలగబెడతమని తెలంగాణ సర్కారు ఇస్తున్న రైతుబంధు వద్దంటే ఊకుంటమా ఏంది. ఓటు ఎయ్యమని ఎట్లత్తరో సూత్తం.
– అల్లూరి గంగారెడ్డి, రుద్రంగి మండలం
దళిత బంధు పథకాన్ని అడ్డుకుంటున్న కాంగ్రెస్కు, ఆ పార్టీ అభ్యర్థికి దళితులం ఐక్యంగా ఉండి ఓటుతో బుద్ధి చెబుతాం. దళితబంధు ద్వారా నియోజకవర్గంలోని ఎస్సీ కుటుంబాలన్నింటికీ ఎంతో మేలు జరుగుతంది. సీఎం కేసీఆర్ ఎంతో ఇష్టంతో గత ఉప ఎన్నికల్లో మొదలు పెట్టి హుజూరాబాద్ను పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకుంటే ఎంతో మంది దానితో బాగుపడ్డరు. దళితులు బాగుపడడం చూడలేక కళ్ళుమండి కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘానికి లేఖ రాసి అడ్డుకున్నరు. గత ఉప ఎన్నికల్లో ఈ పథకాన్ని ఆపేందుకు బీజేపీ నాయకులు కుటిల ప్రయత్నాలు చేసిన్రు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు పూర్తిగా అడ్డుకోవాలని చూస్తున్నరు. అందులో భాగంగానే లేఖ రాసి దళితబంధును ఆపించిన్రు. ఎస్సీలు బాగుపడడం కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఏమాత్రం ఇష్టం లేదు. దళితులు గొప్పగా ఎదిగితే వారి ఓటు రాజకీయం నడవదని, బీఆర్ఎస్కు ఎదురు ఉండదని భయపడి కాంగ్రెస్ నేతలు కుట్రపూరితంగా ఆపించిన్రు. దళితబంధును అడ్డుకునే వారికి వచ్చే నెల 30న ఓటుతో దళితులందరం రాజకీయ సమాధి కడుతాం.
-మొలుగూరి ప్రభాకర్, దళితబంధు మండల సమన్వయ అధికారి (హుజూరాబాద్టౌన్)