Vote bank politics | పెద్దపల్లి, జనవరి 31(నమస్తే తెలంగాణ): నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు త్వరలో జరగనున్న ఎన్నికల వార్డు రిజర్వేషన్లలో ఓసీలకు తీరని అన్యాయం జరిగిందని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు. పెద్దపల్లి మండలంలోని కాసులపల్లిలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి ఓసిల మహాధర్నా వాల్పోస్టర్లను ఓసీ జేఏసీ రాష్ట్ర నాయకులతో కలిసి పోలాడి రామారావు శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. మున్సిపల్ రిజర్వేషన్లలో ఓసిలను అణగతొక్కాలనే పాలకుల బ్యూరోక్రాట్ల కుట్ర స్పష్టంగా బయటపడిందన్నారు.
ఓసీల జనాభా 80శాతం ఉన్న వార్డులు, డివిజన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీలు 79 నుంచి 89 శాతం ఉన్న ప్రాంతాలను జనరల్ కేటగిరీలో చేర్చడం ఈ కుట్రకు నిదర్శనం అన్నారు. ప్రస్తుతం జనరల్ కేటగిరీకి రిజర్వ్ చేయబడిన స్థానాల్లో ఓసీయేతరులు 80 శాతం ఉండటంతో ఓసీలు అక్కడ గెలుపొందే పరిస్థితి లేదన్నారు. శాస్త్రీయంగా లేని రిజర్వేషన్ల మార్పుపై తక్షణమే ఒక నిర్ణయం తీసుకోని పక్షంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓసీలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం తథ్యమని రామారావు హెచ్చరించారు.
జనరల్ స్థానాల్లో కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసీయేతరులకు కొన్ని రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చి ఓసిలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్ధానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే విధమైన విధానాలు అనుసరించడం వల్ల ఓసీలు సర్పంచ్ అవకాశాలు కోల్పోయారని రామారావు వెల్లడించారు. ఓసీలకు రాజకీయ ప్రాధాన్యత కోసం ఓసి జేఏసీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో చేస్తున్న పోరాటానికి రాజకీయాలకు అతీతంగా ఓసీలు కలిసి రావాలని, ఐక్యంగా ప్రభుత్వాల మెడలు వంచాలని రామారావు పిలుపు నిచ్చారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ స్థాయిలో ఓసి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, ప్రస్తుతమున్న 50 శాతం దాటని రిజర్వేషన్లలో ఓసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, ఈడబ్లూఎస్ అర్హతకు వార్షికాదాయం 10లక్షలకు పెంచాలని, రైతు భీమాకు వర్తించే వయోపరిమితిని, 70ఏళ్లకు పెంచాలని, రైతులు పండించే ధాన్యానికి రైతులే గిట్టుబాటు ధర నిర్ణయించే భాగస్వామ్యం ఉండాలనే డిమాండ్లతో పాటు ఇతర ఓసిల డిమాండ్ల సాధనకు ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఫిబ్రవరి 23న నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి ఓసిల మహాధర్నాకు రాజకీయాల కతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓసి సామాజిక వర్గీయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రామారావు పిలుపు నిచ్చారు.
రఘునందన్రెడ్డికి నివాళి..
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరుడు రఘునందన్ రెడ్డి అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఆయన మృత దేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పోలాడి రామారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ఓసీ జేఏసీ పెద్దపల్లి జిల్లా చైర్మన్ బైరెడ్డి రాంరెడ్డి, నాయకులు ఎర్రం మల్లారెడ్డి, ఏర్రం ప్రభాకర్ రెడ్డి, అడప బాపు రెడ్డి, సిద్దూరి బుచ్చం రావు, చింతి రెడ్డి తిరుపతి రెడ్డి, కొత్తిరెడ్డి సంత్ రెడ్డి, కనకయ్య, రమేష్, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.