కరీంనగర్ కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 20 : శాతవాహన యూనివర్సిటీలో దివ్యాంగుడైన విద్యార్థి నర్సయ్యను పరీక్ష రాయడానికి అనమతించకపోవడంపై విద్యార్థులు మూడో రోజు శుక్రవారం తరగతి గదిలో శాంతియుతంగా నిరసన తెలిపారు. హాజరు శాతం పేరిట వేధించడం ఆపాలని ఎస్యూ జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. తర్వాత మాజీ ఎంపీ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తామందరం అటెండెన్స్ పూర్తిగా మెయింటన్ చేసినప్పటికీ, విద్యార్థులపై ఒత్తిడి తెస్తూ బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. అటెండెన్స్ పేరుతో విద్యార్థులను వేధించడం సరికాదని హితవు పలికారు.
ఈ సమస్యను మాజీ ఎంపీ వినోద్ కుమార్కు వివరించినట్లు తెలిపారు. ఈ అంశంపై యూజీసీకి, ఐజీఏఎస్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్కు అధికారికంగా వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. వినోద్కుమార్ స్పందిస్తూ వీసీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థుల సమస్యలపై పోరాడాలని, వెంటనే యూనివర్సిటీకి పార్టీ బృందం వెళ్లాలని పరిష్కారం కోసం కృషి చేయాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్గౌడ్ను ఆదేశించారు.