కరీంనగర్ డెయిరీ జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ ఏజెన్సీ (జైకా) ప్రాజెక్టుకు ఎంపిక కావడం అభిందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. డెయిరీకి 90.70 కోట్ల రుణం మంజూరు కానున్నదని, దీనిని సద్వినియోగం చేసుకొని సంస్థ ఆకాశమే హద్దుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం 16 రకాల ఐస్క్రీంలు, బిస్కెట్లతోపాటు మానేరు పేరిట కొత్తగా తీసుకువచ్చిన టోన్డ్మిల్క్, పెరుగు బకెట్ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఇప్పటి వరకు ఉత్పత్తులను రెండింతలు చేసిన డెయిరీ ఇప్పుడు సభ్యులను డబుల్ చేసుకోవాలని సూచించారు.
– కార్పొరేషన్, మార్చి 13
కార్పొరేషన్, మార్చి 13: తెలంగాణలోనే కరీంనగర్ డెయిరీకి 90.70 కోట్ల జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేటివ్ ఏజెన్సీ (జైకా) నిధులు రావడం ఎంతో గొప్ప విషయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ప్రశంసించారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకొని ఆకాశమే హద్దుగా ఎదగాలని, ఇప్పటి వరకు ఉత్పత్తులను రెండింతలు చేసిన డెయిరీ ఇప్పుడు తమ సభ్యులను కూడా రెండింతలు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి సభ్యులను చేర్చుకోవాలని, అవసరమైతే ప్రొసిజినల్ సభ్యత్వం కల్పించే దిశగా ఆలోచనలు చేయాలన్నారు. కరీంనగర్ డెయిరీ నూతనంగా మానేరు పేరిట ఉత్పత్తులను తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కరీంనగర్ డెయిరీ ఇన్నాళ్లూ ప్యూర్ మిల్క్తో కూడిన పెరుగును అమ్ముతుండగా, ఇప్పుడు వీటికితోడుగా డెయిరీ నుంచి 16 రకాల ఐస్క్రీంలు, బిస్కట్లను, మానేరు బ్రాండ్తో టోన్డ్మిల్క్, పెరుగు బకెట్లను తీసుకువచ్చింది. సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని డెయిరీ కార్యాలయ ఆవరణలో నూతన ఉత్పత్తుల ప్రారంభోత్సవానికి వినోద్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం మాట్లాడారు.
కరీంనగర్ డెయిరీకి జైకా ప్రాజెక్టు కింద 90.70 కోట్లు మంజూరు కానున్నాయని, అందులో 71.52 కోట్లు రుణం కాగా, 12.46 కోట్లు గ్రాంట్ రూపంలో, మరో 6.72 కోట్లు కరీంనగర్ డెయిరీ సహకారంతో ప్రాజెక్టు రూపుదిద్దుకోనున్నదని వెల్లడించారు. ఈ రుణానికి 1.5 శాతం మాత్రమే వడ్డీ చెల్లించనుండగా, దీనిని 10 ఏండ్ల వ్యవధిలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నిధులను పాల సేకరణ సంస్థలు, భవనాలు, పాల పరీక్ష యంత్రాలు, పాల క్యాన్లు, పాల సేకరణ యూనిట్లు, ఫర్నిచర్ తదితర మౌలిక సదుపాయాల కోసం వినియోగించవచ్చని తెలిపారు. నాణ్యతతో కూడిన కరీంనగర్ డెయిరీ ఉత్పత్తులకు హైదరాబాద్లో మంచి డిమాండ్ ఉందన్నారు. గతంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాల్లో భాగంగా వచ్చిన నిధులతో తిమ్మాపూర్ మండలం నల్లగొండ వద్ద సుమారు 100కోట్లతో 5 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న డెయిరీ నిర్మించామని, అతిత్వరలోనే దీనికి ప్రారంభోత్సవం కూడా ఉంటుందన్నారు. ప్రస్తుతం చేపడుతున్న ఉత్పత్తులతోపాటు మరిన్ని సరికొత్త ఉత్పత్తులు తెచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు. డెయిరీ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్రావు మాట్లాడుతూ, కమర్షియల్ అవసరాల కోసం సరికొత్తగా ఫ్యాట్ తక్కువగా ఉండే పెరుగును తీసుకురావాలని ఆలోచన చేసినప్పుడు కొత్త బ్రాండ్ పేరు వాడాలనుకున్నామని తెలిపారు. దీనిని వినోద్కుమార్కు దృష్టికి తేవడంతో కరీంనగర్కు సొంతమైన మానేరు నది పేరిట కొత్త బ్రాండ్ తీసుకోవాలని ఆయన సూచించారని, ఈ మేరకు మానేరు పేరుతో పెరుగు బకెట్లను తీసుకువచ్చామన్నారు.
మానేరు పేరిట టోన్డ్ మిల్క్ పెరుగు 5, 10 కిలోల్లో బకెట్లు అందిస్తున్నామన్నారు. అలాగే కరీంనగర్ డెయిరీ పేరిట 16 రకాలైన ఐస్క్రీంలు కప్స్, కోన్స్, స్టిక్స్, బార్స్, నోవాల్టీస్, బట్టర్స్కోచ్, వెనిల్లా, మ్యాంగో, చాకోలెట్ తదితర ఉత్పత్తులు ఉన్నాయన్నారు. అలాగే 100, 400 గ్రాముల చొప్పున, జార్ల్లోనూ ఉస్మానియా బిస్కట్లను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. జైకా నిధులతో 1.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో పెరుగు తయారీ ప్లాంట్ ఏర్పాటు, మార్కెటింగ్కు మద్దతుగా వాక్ ఇన్ కోల్డ్స్టోర్స్, మిల్క్ పార్లర్లు, ఉత్పాదకత పెంపుదల, పశుగ్రాసాల అభివృద్ధి, పాల ఉత్పత్తిని పెంచేందుకు ఎంపీఐ సంస్థలను బలోపేతం చేయడం, నాణ్యమైన దాణా, ఖనిజ మిశ్రమం, రాష్ట్ర వ్యాప్తంగా డెయిరీ కార్యకలాపాలను విస్తరించేందుకు వినియోగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్రావు, డెయిరీ జనరల్ మేనేజర్ శంకర్రెడ్డి, సలహాదారు హన్మంతరెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.