కరీంనగర్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ నాయకులకు బీఆర్ఎస్ అధిష్టానం మరోసారి అవకాశం కల్పించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్కుమార్కు కరీంనగర్, మరో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు పెద్దపల్లి టికెట్లు ఖరారు చేసింది. వీరి అభ్యర్థిత్వాన్ని ఇప్పటికే వెల్లడించిన పార్టీ అధినేత కేసీఆర్, సోమవారం అధికారికంగా ప్రకటించారు.
పార్టీలో సీనియర్ నాయకులు, వివాదరహితులైన ఈ ఇద్దరికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడంతో బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వీరి గెలుపు ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన బోయినపల్లి వినోద్కుమార్, కొప్పుల ఈశ్వర్ పార్టీ పటిష్టతకు అహర్నిషలు శ్రమించారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు కీలక పదవు ల్లో ఉన్న ఈ ఇద్దరు నాయకులు ప్రజ ల్లో మంచి గుర్తింపు సాధించారు.
కలిసికట్టుగా ఉండి గెలిపించుకుంటాం
-మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
బీఆర్ఎస్ శ్రేణులందరం కలిసి కట్టుగా ఉండి కరీంనగర్లో వినోద్కుమార్, పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. వినోద్కుమార్కు కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన అధినేత కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడిచిన వినోద్కుమార్కు కరీంనగర్లో మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించడం హర్షణీయమన్నారు.
గతంలో ఎంపీగా ఉన్నపుడు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి జిల్లాకు జాతీయ రహదారులు, రైల్వే లైన్లు తెచ్చిన ఘనత వినోద్దేనని కొనియడారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ బండి సంజయ్ ప్రధానిని ఒప్పించి ఒక్క అభివృద్ధి పనినైనా చేయలేకపోయాడని విమర్శించారు. అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విరక్తి పుట్టిందని, వారి అసత్యాలు, అమలు కాని హామీలపై ప్రజల్లో చర్చ జరుగుతున్నదని తెలిపారు. వినోద్కుమార్, కొప్పుల ఈశ్వర్కు అవకాశం కల్పించినందుకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు హర్షం వ్యక్తం చేశారు.
పెద్దపల్లిలో గులాబీ జెండా ఎగురవేస్తాం
-రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని, మార్చి 4 : పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ప్రకటించడంపై రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ హర్షం వ్యక్తం చేశారు. అధినేత కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గులాబీ సైనికులంతా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.