వేములవాడ టౌన్, డిసెంబర్ 11: కార్తీక మాసం చివరి రోజు కావడంతో వేములవాడ రాజన్న క్షేత్రం సోమవారం భక్తజనసంద్రమైంది. అధిక సంఖ్యలో భక్తులు తరలిరాగా, అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వరాలయం, బద్ది పోచమ్మ, నగరేశ్వరాలయాలు కిటకిటలాడాయి. సుమారు 60 వేలమందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ దృష్ట్యా అధికారులు గర్భగుడిలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది.
ధర్మగుండంలో స్నానాలు ఆచరించి, కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించుకొని, రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకున్నారు. క్యూలైన్ల మీదుగా ఆలయం లోనికి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్నకు దాదాపు 29లక్షలకు పైగా ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. కాగా, స్వామివారిని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం అందజేశారు. ఇక్కడ ఫ్రొటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, అల్లి శంకర్, ఆలయ ఇన్ సెక్టర్ చెక్కిళ్ల అశోక్, తదితరులు ఉన్నారు.