‘హరహర మహాదేవ..’ ‘శంభోశంకర..’ అంటూ సాగిన శివనామస్మరణతో ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు మార్మోగాయి. శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా వేములవాడ రాజన్న క్షేత్రం లక్షా 50వేల మందితో పోటెత్తింది. ఎటు చూసినా జనసందోహమే కనిపించింది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు దంపతులతో కలిసి స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు.. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ అధికారులు పట్టువస్ర్తాలు సమర్పించారు. సాయంత్రం 6గంటల తర్వాత ‘మహాలింగార్చన’, అర్ధరాత్రి లింగోద్భవ ఘట్టాన్ని నిర్వహించగా, భక్తులు తిలకించి పులకించిపోయారు. ఇటు ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు, పలుచోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు శైవ క్షేత్రాలకు వెళ్లి పూజలు చేశారు.
– వేములవాడ/ వేములవాడ టౌన్, ఫిబ్రవరి 18
వేములవాడ/ వేములవాడ టౌన్, ఫిబ్రవరి 18 : వేములవాడ రాజన్న సన్నిధికి శనివారం భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ ఒక్కరోజే సుమారు లక్షా 50వేల మందికిపైగా రావడంతో వేములవాడ క్షేత్రం కిక్కిరిసిపోయింది. పరిసరాల్లో ఎటుచూసినా జనసందోహం కనిపించింది. కరోనా నేపథ్యంలో మూడేళ్ల పాటు ధర్మగుండంలో స్నానాలకు అనుమతి రద్దు చేసి, ఈ సారే మళ్లీ అవకాశం ఇవ్వడంతో భక్తులు వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించారు. రాయేశుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడె మొక్కును చెల్లించుకున్నారు. తలనీలాలతోపాటు బంగారం(బెల్లం) మొక్కులను కూడా సమర్పించారు. గంటలపాటు క్యూలైన్లలో నిల్చుండి మరీ స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5గంటల సమయంలో దాదాపు 2వేల మంది శివభక్తులు రాజన్న సన్నిధికి చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకొని, మొక్కుచెల్లించుకున్నారు. అనంతరం అనుబంధ దేవాలయమైన భీమేశ్వరుడి సన్నిధానంలో ఇరుముడులను విప్పి, మాల విరమణ చేశారు
స్వామి వారికి పట్టువస్ర్తాలు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉదయం 9 గంటలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విజయలక్ష్మి దంపతులు స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు దంపతులతో కలిసి రాగా, కలెక్టర్ అనురాగ్ జయంతి, రాజన్న జోన్ డీఐజీ రమేశ్ నాయక్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈవో కృష్ణప్రసాద్ అమాత్యుడికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అద్దాల మండపంలో అల్లోల దంపతులకు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేయగా, ఎమ్మెల్యే రమేశ్బాబు శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేశారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఉదయం 8 గంటలకు టీటీడీ డీప్యూటీ ఈవో హరింద్రనాథ్, అధికారులు పట్టువస్ర్తాలు సమర్పించారు. అద్దాలమండపంలో అర్చకులు ఆశీర్వచనం చేయగా, ఈవో కృష్ణప్రసాద్ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. మంత్రి వెంట జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, అడిషనల్ కలెక్టర్లు సత్యప్రసాద్, ఖీమ్యానాయక్, ఏఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి, పట్టణ సీఐ వెంకటేశ్, రూరల్ సీఐ బన్సీలాల్, తహసీల్దార్లు రాజిరెడ్డి, నక్క శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
రాజన్న క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం : దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
వేములవాడ టౌన్, ఫిబ్రవరి 18 : తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాలపై ప్రత్యేక దృష్టి సారించారని, వేములవాడ రాజన్న క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఉద్ఘాటించారు. శనివారం స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వామివారి దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని, యాదాద్రి తరహాలో వేములవాడ, కొండగట్టును గొప్ప క్షేత్రాలుగా తీర్చిదిద్దుతారని చెప్పారు. రాజన్న పేదల ఇలవేల్పు అని, ఇక్కడికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారన్నారు. ఈ ఆలయం రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదాయాన్ని సమకూర్చేదిగా పేరుగాంచిందన్నారు. కేంద్రం ప్రసాద్ స్కీం ద్వారా 50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శివార్చన కార్యక్రమాలు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ట్రెజరీ నుంచి 2,600 మంది అర్చకులకు వేతనాలు ఇవ్వడం దేశంలో మరెక్కడా లేదని స్పష్ట ంచేశారు. ధూప దీప నైవేద్యాల ద్వారా అర్చకులకు వేతనాలు ఇస్తున్నామన్నారు.
వైభవంగా మహాలింగార్చన
సాయంత్రం 6 గంటల నుంచి 9 వరకు పట్టణంలోని అనువంశిక అర్చక కుటుంబాలకు చెందిన అగ్రహార బ్రాహ్మణులతో ఆలయంలోని అద్దాల మండపంలో మహాలింగార్చన వైభవంగా నిర్వహించారు. 366 లింగాలు, 366 జ్యోతులను అలంకరించి వేదమంత్రాలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నంత సేపు భక్తులు శివనామ స్మరణ చేశారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో దాదాపు 128 కుటుంబాలకు చెందిన బ్రాహ్మణులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము 3.30 గంటల వరకు ఆలయ స్థానాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు.
కనులపండువలా శివార్చన
ఆలయ చెరువు ప్రాంతంలో శుక్రవారం ప్రారంభించిన శివార్చన కార్యక్రమాలు రెండోరోజూ కనుల పండువలా సాగాయి. ఉదయం 7గంటల నుంచే మొదలయ్యాయి. సాయంత్రం 6గంటల నుంచి నేటి ఉదయం 6 వరకు 12గంటల పాటు నిర్విరామంగా సాగాయి. పేరిణి, భరతనాట్యం, కూచిపూడి ఇలా ఎన్నో ప్రదర్శనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు దంపతులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు తిలకించారు.
శివార్చన అద్భుతం
మహా శివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న శివార్చన అద్భుతంగా ఉంది. కళాకారులు చేసిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. రెండు రోజుల పాటు దాదాపు 1500 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం కళాకారులకు ప్రత్యేక గుర్తింపును, ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. ప్రతిభా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఇలాంటి వేదికలు ఎంతగానో ఉపయోగడతాయి.
– ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు