Vemulawada | వేములవాడ, సెప్టెంబర్ 19 : వేములవాడ రాజన్న ఆలయ రెండవ కళ్యాణ కట్టలో విధులు నిర్వహించే నాయి బ్రాహ్మణులు శనివారం తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. తాము గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి జీతభత్యాలు లేకుండానే రెండవ కళ్యాణకట్టలో పనిచేస్తున్నామని తెలిపారు. భక్తులు ఇచ్చే కానుకల మీదే ఆధారపడి తాము పనిచేస్తుండగా రెండు రోజుల క్రితం వరంగల్ జిల్లాకు చెందిన భక్తులు అడగకముందే ఇచ్చిన నగదును తాము బలవంతంగా వసూలు చేశారన్న నేపాన్ని సంబంధిత అధికారి ఈవో దృష్టికి తీసుకెళ్లి తమకు ఒక్కొక్కరికి 15వేల రూపాయల జరిమానా విధించారని వాపోయారు. అయితే తాము ఎవరిని బలవంతంగా డబ్బులు అడగడం లేదని ఇస్తే తీసుకుంటున్నామని లేదంటే ఊరుకుంటున్నామని చెప్పారు.
తమకు కూడా ఇబ్బందిగా ఉన్నందున మొదటి కళ్యాణ కట్టలో పనిచేసే నాయి బ్రాహ్మణుల తరహాలో కమిషన్, లేదంటే వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించారు. దీంతో రాజన్న ఆలయ ఏఈవో మహేష్, పర్యవేక్షకుడు శ్రీనివాస్ శర్మ, వంశీ మోహన్ తో పాటు రెండవ కళ్యాణ కట్టను పర్యవేక్షిస్తున్న కాంట్రాక్టర్ సంబంధించిన వారు వచ్చి సంప్రదింపులు జరిపారు. సమస్యలు పరిష్కరించేందుకు రెండు రోజుల గడువు కోరినందున తాము యధావిధిగా విధులు నిర్వహిస్తామని నాయి బ్రాహ్మణులు నరసయ్య, లక్ష్మణ్, తిరుపతి, శ్రీశైలం, దామోదర్ తదితరులు తెలిపారు.