వేములవాడ టౌన్, ఫిబ్రవరి 15: వేములవాడ రాజన్న ఆలయం ముస్తాబైంది. 17 నుంచి 19 దాకా మూడు రోజులపాటు జరిగే మహా శివరాత్రి జాతరకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం రూ.3.70కోట్ల వ్యయంతో అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు సేదతీరేందుకు దాదాపు 3 లక్షల చదరపు గజాల స్థలంలో తాత్కాలిక చలువ పందిళ్లను, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఈ రాజేశ్ తెలిపారు. వాహనాల పార్కింగ్ కోసం చెరువులోని స్థలాన్ని చదునుచేసి ఉంచారు. ఇంకా భక్తుల భద్రత కోసం ఆలయ ఆవరణ, వివిధ ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలను అమర్చారు. పవర్ కట్ అయిన సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా రూ.24 లక్షలతో తాత్కాలిక జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఎలక్ట్రికల్ డీఈ ద్వారక శేఖర్ తెలిపారు. క్యూలైన్లలో నిలిచిఉండే భక్తులకు మంచినీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
చెరువులో నుంచి పార్కింగ్ స్థలంలోని రావడానికి వీలుగా యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మెట్లను నిర్మించారు. జాతరలో తప్పిపోయిన భక్తుల వివరాలు ప్రకటించడం కోసం తాత్కాలిక మైక్సెట్లను ఏర్పాటు చేశామని, ఆలయ గోపురాలకు, ధర్మగుండం చుట్టూ, రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయం, కేదారేశ్వరాలయం, వేణుగోపాలస్వామివారి ఆలయానికి రంగులు వేసి పనులను పూర్తిచేశారు. కాగా, వివిధ ప్రాంతాల నుంచి వేములవాడకు వచ్చిన భక్తులు ఆలయానికి చేరుకునేందుకు తిప్పాపూర్ బస్టాండ్ నుంచి రాజన్న ఆలయం దాకా 14 ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంకా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీస్ పటిష్టబందోబస్తు కల్పిస్తున్నారు.