లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీస్శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆరు చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. ఎస్పీ అఖిల్మహజన్ ఆధ్వర్యంలో రాత్రిబంవళ్లు ముమ్మురంగా తనిఖీలు చేపట్టింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన గత నెల 16 నుంచి ఇప్పటి వరకు అంటే 27 రోజుల్లో 54.78 లక్షల నగదు, 6.71 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకొని సీజ్ చేసింది.
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల వేళ కోడ్ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో 50 వేలకు మించి నగదు తీసుకెళ్తే అందుకు సంబంధించిన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. అయితే, ఎలాంటి పత్రాలు లేకుండా నగదు తరలిస్తే పోలీసులు పట్టుకొని సీజ్ చేసే అధికారముంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియామవళిని పకడ్బందీగా అమలు చేస్తుండగా.. ఒక్క సిరిసిల్ల జిల్లాలోనే గురువారం వరకు 54.78 లక్షల నగదు పట్టుపడ్డది.
సరైన పత్రాలు చూపించకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. అలాగే గ్రామాల్లోని బెల్టుషాపులపై నిఘా తీవ్రతరం చేశారు. 6.71 లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. 192 కేసుల్లో 451 మందిని బైండోవర్ చేయగా, 514 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. కాగా, ఇతర జిల్లాలకు దొంగచాటుగా తరలిస్తున్న 4.9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఎన్నికల వేళ ఓటర్లను నగదు, మద్యం ఇతర వస్తువులను ఇచ్చి ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉన్నందున తనిఖీలు ముమ్మరం చేశారు.
మరోవైపు అనుమానిత బ్యాంకు లావాదేవీలపై దృష్టి సారించారు. గూగుల్, ఫోన్ఫే నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే ఖాతాల వివరాలపై నిఘా తీవ్రం చేశారు. ఎన్నికలకు సంబంధించిన నగదు, మద్యం ఇతరత్రా సమాచారం, ఫిర్యాదు చేసేందుకు సిరిసిల్ల 1950 టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ఫిర్యాదు చేసేందుకు సీ వీజిల్ యాప్ అమల్లోకి తెచ్చారు. ప్రత్యేక సిబ్బంది నిరంతరం పర్యటిస్తూ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలపై కేసులు నమోదు చేస్తున్నారు.