వేములవాడ టౌన్, మే 18: సనాతన వేద సంస్కృతిని కాపాడుకోవాలని శృంగేరి శారదాపీఠం సీఈవో డాక్టర్ వీఆర్ గౌరీశంకర్ సూచించారు. భారతీయ సంస్కృతికి పునాది వేదాలని, జగత్తు యొక్క అస్తిత్వం, ధర్మం మీద ఆధారపడిందని, ఆ ధర్మాన్ని నిర్వహించాల్సింది వేదాలు మాత్రమేనని చెప్పారు. దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠం ఆధ్వర్యంలో గురువారం రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్పై నిర్వహించిన వేద సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. సనాతన వైదిక సంస్కృతిని సుసంపన్నం చేయడమే లక్ష్యంగా శృంగేరి శారదపీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేదం ఒక తపస్సు లాంటిదని, అజ్ఞానమనే చీకటిని తొలగించి బ్రహ్మచైతన్యం వైపు నడిపిస్తున్నదని చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కుప్పా శివ సుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ, ‘వేదో అఖిలో ధర్మ మూలం’ అనగా అన్ని ధర్మాలకు మూలం వేదమేనని, హైందవ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడేందుకు మూల భూతాలైన వేదాలను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి కనీస ధర్మమన్నారు. ధర్మ పరిరక్షణలో భాగంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన వేదపండితులను అభినందించారు. కార్యక్రమంలో శృంగేరి ఆస్థాన పండితులు గట్టు నరహరిశర్మ అవధాని, అచ్చలాపూర్ వేద పాఠశాల ప్రిన్సిపాల్ దుద్దిళ్ల మనోహర్ శర్మ అవధాని, జక్కి కృష్ణావధాని, ఆచార్య కేఎస్ అవధాని, వేములవాడ వాస్తవ్యులు మహోపాధ్యాయ తిగుళ్ల శ్రీహరిశర్మ, గంగాధర కేదారనాథ ఘనాపాఠి, గంటి భార్గవశర్మ ఘనాపాఠి, మల్లూరి ప్రదీప్శర్మ, మణికంఠ ఘనాపాటి, కేబీయం రాఘవశర్మ ఘనాపాటి. సంపత్కుమార్, దత్తాత్రేయశర్మ, వేదపండితులు, ఆలయ అర్చకులు గోపన్నగారి శివుడు, ప్రతాప శ్రీనివాస్, అప్పాల రాజాచంద్ర, ఆలయ ఏఈవోలు సంకేపల్లి హరికిషన్, బ్రహ్మన్నగారి శ్రీనివాస్, వేములవాడ బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఉన్నారు.
వేదఘోషతో ప్రతిధ్వనించిన క్షేత్రం
రాజన్న ఆలయంలో గురువారం వేద సమ్మేళనం ఘనంగా నిర్వహించగా, దేశం నలుమూలల నుంచి దాదాపు 100 మంది వేదపండితులు వచ్చారు. విధుశేఖర భారతీ తీర్థస్వామి తండ్రి డాక్టర్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని, కుప్పా రామగోపాల వాజపేయియాజి, శృంగేరి ఆస్థాన పండితులు రాధాకృష్ణశర్మ, గోపీనాథ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా, యజ్ఞ శివ సుబ్రమణ్యం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు వేదస్వస్తిని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో వేదపారాయణం చేశారు. తిరిగి సాయంత్రం 5.30గంటల నుంచి 8.30గంటలకు వేదస్వస్తి నిర్వహించగా, ఆలయ ప్రాంగణంతో పాటు పట్టణ పరిసర ప్రాంతాలు వేదఘోషతో మార్మోగాయి. వేద విద్వాంసులను శృంగేరి శారదాపీఠం సీఈవో, వేద పాఠశాల ప్రిన్సిపాల్ ఘనంగా సత్కరించి, ప్రశంసాపత్రాలను అందజేశారు.