సారంగాపూర్, ఆగస్టు 14: ‘వృద్ధులు, బీడీ కార్మికుల నుంచి పింఛన్ దరఖాస్తులు ఎందుకు స్వీకరించడం లేదు.. వారేం పాపం చేసిన్రు?’ అంటూ కాంగ్రెస్ సర్కారును జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత నిలదీశారు. ఎన్నికల సమయంలో అన్ని వర్గాలకు పింఛన్లు పెంచి ఇస్తామని ప్రకటించి, ఇప్పుడేమో వితంతు, ఒంటరి మహి ళ, చేనేత, గీత, డయాలసిస్, పైలేరియా బాధితుల నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించడమేంటని ప్రశ్నించారు.
రేవంత్రెడ్డి సర్కారు వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా పింఛన్లపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సారంగాపూర్ మండలం రేచపల్లిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రాకముందు రూ.200 ఉన్న పింఛన్ను రూ.2,016కు పెంచిన ఘనత తొలి సీఎం కేసీఆర్దేనన్నారు. ఎన్నికల సమయంలో అర్హులందరికీ రూ.4వేల పింఛన్లు ఇస్తామని, 18 ఏండ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన హామీ నేటికి అమలుకు నోచుకోవడం లేదన్నారు.
ప్రజాపాలన గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ప్రతి మండల కేంద్రంలో సదరం క్యాంపులు ఏర్పాటు చేసి అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలన్నారు. ప్రజలను అతి తక్కువ సమయంలో మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని విమర్శించా రు. హామీలు అమలు చేయనందుకు రేవంత్రెడ్డితోపాటు మంత్రులు కూడా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు తేలు రాజు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, నాయకులు కొండ్ర రాంచందర్రెడ్డి, ఒడ్నాల జగన్, సాతాల్ల రమేశ్, శ్రీనివాస్, బందెల రమేశ్, బేర మహేశ్, బుచ్చిరెడ్డి, పడిగెల గంగారెడ్డి పాల్గొన్నారు.