ఐటీ టవర్లో ఆవిష్కరించిన కలెక్టర్ ఆర్వీ కర్ణన్
కమాన్చౌరస్తా, మే 17: ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం వారధి యాప్ను కరీంనగర్ ఐటీ హబ్ ఆధ్వర్యంలో రూపొందించినట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. గ్రూప్ 1, 2 పరీక్షలకు హాజరయ్యే వారు ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళవారం కరీంనగర్ ఐటీ టవర్లో టీమ్-అప్ సంస్థ అధినేత ఎం కృష్ణచైతన్య, కో ఫౌండర్ రంజిత్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంకతో కలిసి వారధి యాప్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఐటీ రంగ విస్తరణలో భాగంగా ప్రభుత్వం కరీంనగర్లో ఐటీ టవర్ను నెలకొల్పిందన్నారు.
నగరంలోని మొట్టమొదటి సారిగా టీమ్-అప్ సంస్థ ద్వారా రూపొందించిన యాప్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మాక్ టెస్ట్, స్టడీ మెటీరియల్స్, పలు రకాల ఫీచర్స్ ఉచితంగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ యాప్ను జిల్లా వాసులే కాక, రాష్ట్రంలోని యువత వినియోగించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. టీమ్-అప్ సంస్థ సీఈవో కృష్ణచైతన్య మాట్లాడుతూ, ఈ యాప్ సేవలను పొందడానికి ఫోన్ నెంబర్, ఓటీపీతో లాగిన్ అవ్వాలని తెలిపారు. ఇంతకు ముందు వారధిలో మెంబర్ అయితే, వారి వారధి అకౌంట్లో లాగిన్ అవ్వాలని సూచించారు. ఇందుకోసం https://play.google.com/store/apps/details ?id=com. teamup. varadhi యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో వారధి సెక్రటరీ ఆంజనేయులు, టీం-అప్ సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.