కమాన్చౌరస్తా, జనవరి 31: జిల్లా కేంద్రంలోని మారెట్ రోడ్డు శ్రీ వేంకటేశ్వరస్వామి షష్ఠమ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రధాన నిర్వాహకుడు, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో వైభవంగా కొనసాగుతున్నాయి. యాగశాలలో మంగళవారం సుదర్శన హోమం నిర్వహించారు. శ్రీవారు హనుమత్ వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం సింహవాహనంపై విహరిస్తూ నేత్రపర్వం గావించారు.
కార్యక్రమాల్లో మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో ఉడుతల వెంకన్న, అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు గంప రమేశ్, గోగుల ప్రసాద్, టీ రవీందర్, దేవత, రవికుమార్, సంతోష్కుమార్, ఏ తిరుపతి, వనిత, లత, రాహుల్ నారాయణ, ఉపేంద్రనాథ్, శ్రీనివాస్, శ్రీనివాసవరప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్, భూపతి, విద్యాసాగర్, వాస్తు రామన్న, సుభాశ్, సీహెచ్ ప్రశాంత కుమార్, ఆర్ భద్రయ్య, భాసర్, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. అలాగే, వేంకటేశ్వర స్వామిని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సంకశాల మల్లేశ్ దర్శించుకున్నారు. ఆలయంలో పూజలు చేశారు.
అలరించిన కీర్తనలు..
ఉదయం ఉషా బృందం భక్తి కీర్తనలు, పారాయణం, రవి బృందం భజనలు, వాసుదేవరాజు బృందం భక్తి కీర్తనలు, సాయంత్రం సల్వాజి ప్రవీణ్ బృందం, కాసు మధు, లక్ష్మిరెడ్డి భక్తి గీతాలు, ఎస్ఎస్పీ మ్యూజిక్, సురభి కిశోర్ శిష్య బృందం భక్తి సంగీతం, మాధవి డ్యాన్స్ అకాడమీ కూచిపూడి నృత్యం, సరళ బృందం అంధ విద్యార్థులచే భక్తి కీర్తనలు, సుహాసిని బృందం కూచిపూడి నృత్యం అలరించాయి. రాత్రి సినీ నేపథ్య గాయని సునీత, గోగుల ప్రసాద్ భక్తి కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తిలకించారు.
నేటి కార్యక్రమాలివే…
వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 8 గంటల నుంచి మహాపూర్ణాహుతి, చక్రతీర్థ, వసంతోత్సవాలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి శ్రీపుష్పయాగం, ద్వాదశారాధన, ధ్వజారోహణ, ఏకాంతసేవ, పండిత సన్మానం, మహాదాశీర్వచనంతో ఉత్సవాలు ముగియనున్నాయి.