సిరిసిల్ల, డిసెంబర్ 8: ఒకరికి ఒకే ఓటు నిబంధనను పటిష్టంగా అమలు చేసేందుకు భారత ఎన్నికల సంఘం (సీఈసీ) చర్యలు చేపట్టింది. ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డబుల్ ఓట్లను తొలిగించేందుకు రంగం సిద్ధం చేసింది. జిల్లాలో దాదాపు 8,858 బోగస్ ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.. వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్లిన ఉద్యోగులు, పిల్లల చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, వలసలు వెళ్లిన వారు అక్కడ కూడా వారి ఓటును నమోదు చేసుకుంటున్నారు. అప్పటికే వారి స్వస్థలాల్లో ఓటు హక్కు ఉంటుంది. ఇలా ఒకరికి రెండు, మూడు చోట్ల ఓటు హక్కు ఉండడంతో మొత్తం ఓటర్ల సంఖ్యలో తేడా వస్తున్నది. ప్రతి ఎన్నికల్లో ఈ సమస్య ఉత్పన్నమవుతున్నది. దీనిని నివారించేందుకు భారత ఎన్నికల సంఘం సరికొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చింది. ఫొటో సిమిలార్ ఎంట్రీస్ అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఫొటోల ఆధారంగా డబుల్ ఓట్లను గుర్తించి వాటిని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
ఒక గ్రామంలో ఓటు హక్కు కలిగిన వ్యక్తి ఉద్యోగ రీత్యా ఒక పట్టణానికి వెళ్లాడు. గతంలోనే తన గ్రామంలో అతడికి ఓటు హక్కు ఉంది. కొత్తగా పట్టణానికి వెళ్లడంతో అక్కడ ఓటు హక్కు నమోదు చేసుకున్నాడు. కొద్ది సంవత్సారాలకు అతడు అక్కడి నుంచి బదిలీ కావడం… అప్పుడే ఎన్నికలు రావడంతో అక్కడా తన పేరును నమోదు చేసుకున్నాడు. దీంతో అతడికి మూడు చోట్ల ఓటు హక్కు లభించింది. ఇలాంటి వాటిని తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనుంది.
డబుల్, ట్రిపుల్ ఓట్ల సమస్యను గుర్తించిన భారత ఎన్నికల సంఘం వాటి ఏరివేత ప్రక్రియను వేగవంతం చేసింది. దీని కోసం ఫొటో సిమిలార్ ఎంట్రీస్ అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఫొటోల ఆధారంగా డబుల్ ఓట్లను గుర్తిస్తున్నారు. సీఈసీ వెబ్సైట్లో ఓటరు నమోదు కావాలంటే తప్పనిసరిగా ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకే రకమైన ఫొటో, పేరు, ఇంటి పేరు, తండ్రి పేరును సరి చూస్తున్నారు. చిరునామాలు వేర్వేరుగా ఉండి ఒకే రకమైన వ్యక్తిగత సమాచారం ఉంటే బోగస్ ఓటుగా నిర్ధారిస్తున్నారు.
డబుల్ ఓట్లు కలిగిన వారందరినీ గ్రామాలు, వార్డుల వారీగా విభజిస్తారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఫొటోలతో పాటు వచ్చిన జాబితాను తహసీల్ కార్యాలయంలో బూత్ లెవల్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఓటరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఓటు ఉండేలా ఆదేశాలు ఉండడంతో రెండింటిలో ఒక చోట ఓటును తొలిగిస్తున్నారు. ఎక్కడైతే ఓటరు నివసిస్తున్నాడో అక్కడే ఓటు ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం 1 జనవరి 2022 నాటికి 18 ఏండ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పిస్తూ ఓటరు తుది జాబితాను జనవరి 5, 2022న విడుదల చేసింది. ఈ జాబితాననుసరించి బోగస్ ఓట్ల గుర్తింపును భారత ఎన్నికల సంఘం చేపట్టింది
గ్రామాల నుంచి పట్టణాలకు బతుకుదెరువు కోసమో, ఉద్యోగ రీత్యా వెళ్లిన కుటుంబాలు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఓటరు జాబితాలో రెండు చోట్ల పేర్లు ఉండడంతో గ్రామాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, పట్టణాల్లో జరిగే పురపాలక సంఘం ఎన్నికల్లో ఓటును వినియోగించుకుంటున్నారు. మరి కొందరికి రెండేసి వార్డుల్లో ఓటు హక్కు ఉంది. మరో పక్క అద్దెనివాసముండే వారు ఇతర చోటికి మారడంతో ముందుగా ఉన్న అద్దె ఇంటి నంబర్పై ఒక ఓటు, అద్దెకు మారిన చోట ఓటరు జాబితాలో మరో ఓటు ఉంటున్నాయి. అలాంటి వాటిని గుర్తించి బోగస్ ఓట్లను తొలగించడానికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది.
జిల్లాలో నవంబర్ 10న ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2022 ఓటరు జాబితా ముసాయిదా ప్రకారం జిల్లాలో 4,31,659 మంది ఓటర్లు ఉన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 2,26,187 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,11,149 మంది పురుషులు, 1,15,038 మంది మహిళలున్నారు. వేములవాడ నియోజకవర్గంలో 2,05,316 మంది ఓటర్లు ఉండగా 99,204 మంది పురుషులు, 1,06,110 మంది మహిళలు ఉన్నారు.
జిల్లాలో దాదాపు 8,853 బోగస్ ఓట్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఫొటో సిమిలార్ ఎంట్రీస్ సాఫ్ట్వేర్ వంటి అధునాతన టెక్నాలజీతో జిల్లాలో ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 5,123 మంది, వేములవాడ నియోజకవర్గంలో 3,735 మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. భారత ఎన్నిక సంఘం ఆదేశాల ప్రకారం వీటిని రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారులు గుర్తించారు.