పెద్దపల్లి, మే 6(నమస్తే తెలంగాణ)/మంథని రూరల్/ముత్తారం : అకాల వర్షం నిండా ముంచింది. అన్నదాత రెక్కలకష్టాన్ని నీళ్లపాల్జేసింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత మంథని డివిజన్లో పడిన వర్షం దాటికి, మార్కెట్ యార్డుల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. మంథని, ముత్తారం, పెద్దపల్లి డివిజన్లోని అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని పలు గ్రామాల్లో తీవ్రమైన గాలులతో అకాల వర్షం కురవడంతో మంథని మార్కెట్ యార్డుతోపాటు ఆయా మండలాల్లోని వ్యవసాయ ధాన్యమంతా మట్టిలో కొట్టుకుపోయింది.
మంథని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్, మంథని మండలంలోని పుట్టపాక, లక్కెపూర్, గాజులపల్లి, మైదుపల్లి, ఎక్లాస్పూర్, బిట్టుపల్లి, పోతారం, ముత్తారం, తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పదిహేను రోజుల కిందటే కోతలు కోసి, ధాన్యాన్ని కేంద్రాలకు తరలించి కొనుగోళ్ల కోసం పడిగాపులు పడుతున్న తరుణంలో కోలుకోలేని దెబ్బతీసింది. కొనుగోళ్లు వేగంగా చేస్తే తమ ధాన్యం తడిసేది కాదని కుప్పల చుట్టూ వర్షం నీటిని చూపిస్తూ రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తడిసి ముద్దయిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడ్డారు. కాగా, మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని మంత్రి శ్రీధర్బాబు పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్, ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.
