మన విద్యార్థులు ఎక్కువగా ఉన్న విన్నిస్తియాపైనా బాంబు దాడులు
బస్సుల్లో పంపిస్తున్న యూనివర్సిటీ మేనేజ్మెంట్
చార్జీలు చెల్లిస్తేనే ఉక్రెయిన్ బార్డర్కు..
సరిపడా బస్సులు లేవంటున్న నిర్వాహకులు
సొంత చార్జీలు భరించి రొమేనియా బార్డర్కు చేరిన కొందరు విద్యార్థులు
కరీంనగర్, ఫిబ్రవరి 26(నమస్తే తెలంగాణ) : ఉక్రెయిన్లోని వివిధ మెడికల్ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లిన మన విద్యార్థులు చాలా మంది ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎక్కువ మంది చదివే విన్నిస్తియాలోనూ శనివారం తెల్లవారుజామున రష్యా బాంబులు కురిపించడంతో రాత్రంతా బంకర్లలోనే మగ్గారు. ఎక్కడి నుంచి బాంబులు వచ్చి పడతాయో, మిస్సెయిల్స్ విరుచుకుపడుతాయో తెలియక భయం భయంగా గడిపారు. రాత్రంతా నిద్ర లేక, సరైన తిండి లేక, తాగేందుకు కనీసం మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితిలో బతుకుతున్నారు. కొందరు అష్ట కష్టాలు పడి శనివారం ఉక్రెయిన్, రొమేనియా బార్డర్కు చేరుకున్నట్లు తెలుస్తున్నది. విన్నిస్తియా, తదితర ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు భారత్ రావడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది.
ఉక్రెయిన్లోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో రష్యా బాంబులు కురిపిస్తుండడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. జనావాసాలపైనా బాంబులు వేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం మొదలైన మూడు రోజులుగా పరిస్థితులు గంట గంటకూ మారిపోతున్నాయని వాపోతున్నారు. వారు అందించిన సమచారం ప్రకారం.. జిల్లాకు చెందిన ఎక్కువ మంది మెడికోలు విన్నిస్తియాలోని విన్నీసా ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నారు. శనివారం తెల్లవారుజామున ఈసిటీలోనూ రష్యా బాంబులు వేసినట్లు అక్కడ చిక్కుకున్న మన విద్యార్థులు చెబుతున్నారు. రాత్రంతా సైర న్ల మోత వినిపించిందని, తామంతా యూనివర్సిటీ హాస్టల్లోని బంకర్లో ఉన్నామని, ఒక్కక్షణం కూడా నిద్రపోవడం లేదని వాపోయారు. ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియని భయానక పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి రావడానికి మెడికోలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ల పరిస్థితిని తలుచుకుని ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
బార్డర్కు చేరడం ఎలా?
ఉక్రెయిన్ నుంచి బయటపడితే భారత్కు చేరుకున్నట్లేనని అక్కడ చిక్కుకున్న మెడికోలు చెబుతున్నారు. కానీ, ఇక్కడి నుంచి ఎలా బయటికి వచ్చేదని ఆందోళన చెందుతున్నారు. ఒక్క విన్నిస్తియాలోని పలు మెడికల్ యూనివర్సిటీల్లోనే 5 వేల మంది భారతీయులు ఎంబీబీఎస్, పీజీలు చదువుతున్నట్లు, అందులో తెలుగు వాళ్లు వెయ్యి మందికిపైగానే ఉంటారని తెలుస్తోంది. యుద్ధం కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించి పోవడం, బార్డర్కు వెళ్లే దారులన్నీ ట్రాఫిక్తో నిండిపోయిన కారణంగా ఒకేసారి ఇంత మందిని ఉక్రెయిన్ బార్డర్కు చేర్చడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇక్కడి విన్నీసా యూనివర్సిటీ విద్యార్థులను హంగేరీ బార్డర్కు పంపించే ప్రయత్నంలో శుక్రవారం రైల్వే స్టేషన్కు తీసుకెళ్లారు. సుమారు 700 మంది విద్యార్థులను ఒకేసారి తీసుకెళ్లడంతో అక్కడ సరిపడా రైళ్లు అందుబాటులో లేక పోవడంతో అందరూ వెనుదిరిగి హాస్టల్కు చేరుకున్నారు. రాత్రంతా బంకర్లలో క్షణ క్షణం భయం భయంగా గడిపిన విద్యార్థులు శనివారం కూడా ఉక్రెయిన్ బార్డర్ దాటేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే, రవాణా సదుపాయం లేక అవస్థలు పడ్డారు.
బార్డర్ దాటాలంటే చార్జీలు
యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ బార్డర్ దాటేందుకు మెడికోలకు అవస్థలు తప్పడం లేదు. ఒక పక్క రెండు రోజులుగా అక్కడ ఏటీఎంలు పనిచేయడం లేదని, మరో పక్క బార్డర్ దాటించేందుకు యూనివర్సిటీ మేనేజ్మెంట్ చార్జీలు వసూలు చేస్తోందని మెడికోలు వాపోతున్నారు. ఉక్రెయిన్కు హంగేరీ 950 కిలో మీటర్లు ఉండడంతో 300 కిలో మీటర్లు మాత్రమే ఉన్న రొమేనియాకు బస్సుల్లో పంపేందుకు మేనేజ్మెంట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు మెడికోలు చెబుతున్నారు. శనివారం కేవలం రెండు బస్సులు మాత్రమే సమకూర్చిన మేనేజ్మెంట్ రూ.వెయ్యి (ఇక్కడివైతే రూ.3 వేలు) చెల్లించిన వారినే తీసుకెళ్తామని చెప్పడంతో చాలా మంది మెడికోలు గందరగోళంలో పడ్డారు. పని చేయని ఏటీఎంల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే, డబ్బులు ఉన్న వారినే బార్డర్ దాటిస్తామనడం సరికాదని మేనేజ్మెంట్కు మెడికోలు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అయితే, ఫస్టియర్ వాళ్లను ముందుగా పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చిన రెండు బస్సుల్లో కేవలం 100 మందిని మాత్రమే రొమేనియా బార్డర్కు పంపినట్లు తెలుస్తోంది. ఇంకా వందల సంఖ్యలో ఉన్న మెడికోలు ఆందోళన చెందుతున్నారు..
ఉంచేది ఉక్రెయిన్ బార్డర్లోనే..
ఉక్రెయిన్ దాటితే భారత్కు చేర్చుతామని ఒక పక్క ఇండియన్ ఎంబసీ చెబుతున్నది. అయితే, అక్కడ పరిస్థితులు కూడా పూర్తిగా అనుకూలంగా లేవని బార్డర్కు చేరిన మెడికోలు కొందరు అంటున్నారు. సొంత రవా ణా ఖర్చులు భరించి శుక్రవారం సాయంత్రం విన్నిస్తియా నుంచి బయలు దేరిన 20 మంది మెడికోలు రొమేనియా బార్డర్కు చేరినట్లు తెలుస్తోంది. శనివారం తెల్లవారు జామున ఇక్కడికి చేరుకున్నామని, ఇక్కడి ఒక హోటల్లో 4 గంటల పాటు వేచి ఉన్నా ఇండియన్ ఎంబసీ స్పందించలేదని సూర్యాపేటకు చెందిన విష్ణురెడ్డి అనే మెడికో వాపోయారు. విన్నిస్తియా నుంచి బయలుదేరుతున్న మెడికోలకు ఉక్రెయిన్ బార్డర్లోనే ఉన్న చెర్మివెస్టీ మెడికల్ యూనివర్సిటీలో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రొమేనియా దేశ సరిహద్దు ఇక్కడికి 40కిలోమీటర్లు ఉంటుందని, ఇండియన్ ఎంబసీ నుంచి మెస్సేజ్ వచ్చి న తర్వాత ఇక్కడి నుంచి రొమేనియాకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు మెడికోలు చెబుతున్నారు. మొత్తానికి ఉక్రెయిన్లో ఉన్న మెడికోల తల్లిదండ్రుల్లో ఆందోళనైతే స్పష్టంగా కనిపిస్తోంది. గంట గంటకూ పరిస్థితులు మారుతున్నాయని, తమ పిల్లలను ఎలాగైనా భారత్కు రప్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.