వంట గ్యాస్ ధర పెంపుతో కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తున్నది. అడ్డూఅదుపు లేకుండా పెంచుతూ భారం మోపుతున్నది. పదేండ్ల పాలనలో సిలిండర్ రేటును దాదాపుగా మూడింతలు చేయగా, మళ్లీ కట్టెల పొయ్యిపైనే ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆడబిడ్డలు ఎన్నిసార్లు రోడ్డెక్కి ఆందోళన చేసినా, విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోకపోవడంతో అధినేత కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా పేదలకు 400కే గ్యాస్ సిలిండర్ను ఇస్తామని ఈ నెల 15న తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారు. అదే విధంగా అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు కూడా అదే ధరకు అందిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది అమలు కానుండగా, ఉమ్మడి జిల్లాలో దాదాపు 8 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నది. దీనిపై ఎక్కడా చూసినా జోరుగా చర్చ జరుగుతుండగా, మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది. సీఎం కేసీఆర్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని, ఇక తమ గోస తీరుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నది.
పదేండ్ల నుంచి కేంద్రం గ్యాస్ భారం కొంత పెంచింది. 300 రూపాయల సిలిండర్ను రూ.వెయ్యికిపైగా చేసింది. సగటు ఒక మధ్యతరగతి కుటుంబానికి నెలకు ఒక సిలిండర్ అవసరం ఉంటుంది. ఇలాంటి క్రమంలో ప్రతి కుటుంబానికి వచ్చే ఆదాయంలో గ్యాస్ భారం ఎక్కువవుతుంది. ఈ పరిస్థితిని గుర్తించిన సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో రూ.400కు గ్యాస్ అందజేస్తామని ప్రకటించడం ఎంతో ఆనందమైన విషయం. ఏ విషయంలో చూసినా మహిళలను ఆడబిడ్డల్లా ఆదరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి పెద్దన్నలా ఉంటున్నారు. ఇలాంటి నిర్ణయాలను మహిళలు స్వాగతిస్తారు. ఒక కుటుంబలో మహిళల కష్టం తెలిసిన వ్యక్తిలా, ఇలాంటి పథకాలు సామాన్యులకు ఎంతో ఉపయోగపడతాయి.
– జిల్లెల శైలజ, సంతోష్ నగర్ (కరీంనగర్)
వంట గ్యాస్ కోసం అష్టకష్టాలు పడుతున్న మహిళలకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. వంట గ్యాస్పై అడ్డగోలు ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తన వైఖరి మార్చుకోవడం లేదు. దీంతో సామాన్యుడు సిలిండర్ కొనలేని పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో కేంద్రం ఇచ్చే సబ్సిడీతో పనిలేకుండా 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని వెల్లడించడంతో మహిళా లోకం హర్షిస్తున్నది. కేసీఆర్ మాట అంటే తప్పక అమలు చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నది.
కరీంనగర్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన 2014లో వంట గ్యాస్ ధర కేవలం 410 మాత్రమే. కానీ ఈ పదేండ్ల పాలనలో సిలిండర్ ధర భారీగా పెరిగింది. గరిష్టంగా 1,175కు చేరింది. తొమ్మిదిన్నరేళ్లలో దాదాపుగా మూడింతలకు రేటు పెరగడం దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. దీంతో సామాన్య గ్యాస్ వినియోగదారులు తమ సిలిండర్లను అటుకెక్కించి పూర్వంలోలాగా కట్టెల పొయ్యిపై వంట చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చాలా మంది వినియోగదారులు గ్యాస్పై వంటకు దూరం కావాల్సి వచ్చింది.
ముఖ్యంగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న నిరుపేదల పరిస్థితి మరీ దారుణంగా మారింది. నెల, రెండు నెలలకోసారి గ్యాస్ ధర పెరుగుతూ తాము మోయలేని భారంగా భావించిన సామాన్య వినియోగదారులు గ్యాస్ సిలిండర్ వాడడం ఎప్పుడో మానేశారు. గ్యాస్ ధరలు పెరిగినపుడుల్లా బీజేపీయేతర పార్టీలన్నీ ఆందోళనకు దిగుతూనే ఉన్నాయి. కానీ, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లయినా అనిపించడం లేదు. వచ్చే ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న విషయాన్ని దృష్టిలోకి తీసుకున్న కేంద్రం ఇటీవల గ్యాస్పై 200 సబ్సిడీని ప్రకటించింది. ఇపుడు 975కు వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నారు. నిరుపేద, సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ఇది కూడా భారంగా ఉన్నట్లు భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఈ సారి తన ఎన్నికల అస్ర్తాల్లో 400కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని ఈ నెల 15న ప్రకటించారు. అలాగే అక్రిడిటేడ్ జర్నలిస్టులకు కూడా అదే ధరకు ఇస్తామని చెప్పారు.
వంట గ్యాస్ ధరల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఇప్పటికే అనేక సార్లు పోరాటం చేసి విసిగి పోయిన మహిళలకు బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టో ఎంతో ఊరటను ఇచ్చింది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవల విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో మహిళల కోసం ప్రకటించిన పథకాల్లో 400కే వంట గ్యాస్ సిలిండర్ పెను సంచలనంగా మారింది. ఒక సిలిండర్పై కేంద్ర ప్రభుత్వం ఎంత ధర పెంచినా 400కే ఇచ్చి మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. దీంతో మహిళల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఎక్కడ నలుగురు మహిళలు కలిస్తే అక్కడ ఈ విషయంపైనే చర్చ జరుగుతున్నది. ఇప్పటికే మహిళల కోసం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్స్, గృహలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ ఇపుడు 400కే వంట గ్యాస్ సిలిండర్ సప్లయ్ చేస్తామని చెబుతున్నారని, ఇది ఒక్క కేసీఆర్తోనే సాధ్యమవుతుందని మహిళలు విశ్వసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు భరించ లేక అటకెక్కిన సిలిండర్లపై మళ్లీ వంట చేసుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వంట గ్యాస్ కలిగి ఉన్న గృహ వినియోగదారుల సంఖ్యను పరిశీలిస్తే కరీంనగర్లో 3,12,206, జగిత్యాలలో 3,39,715, పెద్దపల్లిలో 2,27,408, సిరిసిల్లలో 1,49,245 కనెక్షన్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,28,574 కనెక్షన్లు ఉండగా, అందులో దాదాపు 8 లక్షల వరకు బీపీఎల్ కుటుంబాలకు చెందినవి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరికీ ప్రయోజనం చేకూరనున్నది. రూ. 400కే వంట గ్యాస్ సిలిండర్ రానున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై అధిక భారం పడినా భరించే లక్ష్యంతోనే బీఆర్ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో ఈ అంశాన్ని పొందుపర్చింది.
మాది నేత కార్మిక కుటుంబం. చేసుకుంటనే పని. వచ్చిన కూలీతో పొట్టబట్ట ఎల్లదీస్తున్నం. పెరిగిన ధరలతో సిలిండర్ కొనలేకపోతున్నం. పొయ్యి పెట్టుకుందామన్నా కట్టెలు కరువైనయ్. సిలిండర్ ధర పెరిగి గుదిబండైంది. నెల దాటంగనే సిలిండర్ ఒడుత్తుంది. అప్పుడప్పుడు చాయ్ పెట్టుకుని తాగుదామన్నా ధైర్యం వస్తలేదు. సిలిండర్ అయిపోయినప్పుడల్లా రందీ అనిపిస్తున్నది. ఇప్పుడు కేసీఆర్ సారు 400కే ఇస్త్తమని చెప్పిండు. మాగోస చూసే ధర తగ్గిస్త అన్నడు. కచ్చితంగా మళ్లీ గెలుస్తడు. మా తిప్పలు తీరుస్తడు.
– తాటి పద్మ, నెహ్రూనగర్ (సిరిసిల్ల)
కేంద్రం గ్యాస్ బండ ధరను రెండింతలు చేసింది. మొన్నటిదాక 1200 పెట్టి కొనేది. ఎన్నికలు వత్తున్నయనంగనే బీజేపీ ప్రభుత్వం 200 తగ్గించింది. అయినా పేద, మధ్య తరగతి ప్రజలు మస్తు ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే సిలిండర్ను మూలకుబెట్టి కట్టెల పొయ్యిమీద వండుకుంటున్నారు. కానీ, సీఎం కేసీఆర్ మొన్న 400కే వంట గ్యాస్ అందజేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే ఇస్తనని చెప్పడం సంతోషంగా ఉన్నది. అందరికోసం మంచి జేస్తున్న ఇది కచ్చితంగా చేస్తాడనే నమ్మకం ఉన్నది. ఇక ఎంతో మందికి గ్యాస్ గోస తీరుతది.
– బోల్నేని స్వప్న, ముత్తారం
సీఎం మ్యానిఫెస్టోలో ప్రకటించిన వంట గ్యాస్ సబ్సిడీ అద్భుతం. ఇది గృహిణులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సీఎం కేసీఆర్ సర్ ఇప్పటికే మహిళల కోసం అనేక పథకాలను పెట్టి అమలు చేస్తుండు. ఇప్పుడు ఈ పథకాన్ని కూడా సక్సెస్ చేస్తడు. కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్యాస్ బండ మోయలేని భారంగా ఉండేది. గ్యాస్ అయిపోయేటట్టుంది అంటే భయమయ్యేది. కానీ తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తమనడంతో ఆనందంగా ఉన్నది. ఇక మాకు వంటింట్లో సగం బాధ పోతది. మళ్లీ సీఎం కేసీఆర్కే మహిళలు మద్దతు పలుకుతరు.
-మణుగూరి ఉమాదేవి, కొండపల్కల (మానకొండూర్)
సిలిండర్ కన్న కట్టెల పొయ్యి నయముండే. సిలిండర్ అని ఇచ్చి ఆగం పట్టించిన్రు. ధరలు పెంచుకుంటూ మాతో ఆడుకుంటున్నరు. ఎటు చూసినా మా లాంటి గరీబొళ్లకే తిప్పలు. తెలంగాణ సర్కారు వచ్చినంక మంచి పనులు చేస్తున్నది. గ్యాస్ అయిపోతే ఎట్లన్న భయమైతది. పెరిగిన సిలిండర్ ధరతోటి ఆగమవుడే తప్ప ఏం ప్రయోజనం లేదు. సీఎం కేసీఆర్ 400కే సిలిండర్ ఇస్తమని చెప్పిండు. సారుతోనే ధర తగ్గుతది. సిరిసిల్ల సభలో చెప్పినంక భరోసా అనిపించింది. ఈసారి కూడా సారె రావాలి.
– ఇంజాపురి వినోద (సిరిసిల్ల)
బీజేపీ సర్కారు పేదలను గ్యాస్ పొయ్యికి దూరం చేసింది. ఇష్టమున్నట్లు ధరలు పెంచితే పేదోళ్లు ఎలా బతుకుతరు. నాడు రూ.400కు ఉన్న సిలిండర్ ధరను రూ.1100 చేసింది. సామాన్య ప్రజలు ఎలా కొంటరు? కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. మొదట్లో ఇచ్చినట్లే ఇచ్చి.. తర్వాత మోసం చేసింది. ఈ బాధలు దూరం చేసేందుకు సీఎం కేసీఆర్ సారు రూ.400కే సిలిండర్ అందిస్తామని మంచి నిర్ణయం తీసుకున్నరు. ఇచ్చిన మాటను మరిచే వ్యక్తి కాదు కేసీఆర్. ఇవ్వని హామీలను సైతం నెరవేర్చారు. మారోమారు కేసీఆర్ ప్రభుత్వాన్నే గెలిపిస్తాం.
– జూపాక శైలజ, వెల్గటూర్
మొన్నటి దాకా సిలిండర్ ధర 1175 ఉండేది. ఇప్పడు కొంచెం తగ్గింది 975కే వస్తున్నది. మా ఇంట్లో ఏడుగురం ఉంటాం. ఎంత పొదుపుగా వాడిన నెలలోపు సిలిండర్ ఖాళీ అవుతుంది. నెలకు వెయ్యికి పైనే గ్యాస్కు ఖర్చు చేయాల్సి వత్తున్నది. పేదోళ్ల బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ సార్ 400లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించడం ఎంతో సంతోషం. కేసీఆర్తోని తెలంగాణకు మంచి జరుగుతుంది. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి.
-నార్ల లక్ష్మి, పెద్దకల్వల (పెద్దపల్లి)
మా పేదోళ్ల కష్టం సీఎం కేసీఆర్కే తెలుసు కాబట్టే మా కోసం మంచి మంచి పథకాలు తెస్తున్నడు. బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ధరలు ఇష్టమున్నట్లు పెంచింది. రూ.400 ఉన్న సిలిండర్ ధరను రూ.1100లు చేసింది. ఇట్లా అయితే మాసోంటోళ్లు ఎట్ల బతుకుతరు. మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయ్యే పరిస్థితి అచ్చింది. ఎన్నిసార్లు రేట్లు దించుమని అడిగినా పట్టించుకోలే. కానీ మా బాధలు చూడలేక కేసీఆర్ సారు మంచి నిర్ణయం తీసుకున్నడు. మూడోసారి అధికారంలోకి వస్తే రూ.400కే సిలిండర్ ఇస్తామని చెప్పిండు. మా మహిళలంతా చాలా సంతోషపడుతున్నరు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సారు మళ్లీ సీఎం కావాలని ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారిని కోరుకుంటున్న.
– మారం సునీత, ఎండపెల్లి (’వెల్గటూర్)