ధర్మారం, డిసెంబర్ 23: ఎన్నో ఏళ్లుగా పంట పొలాలకు వెళ్లేందుకు ఇరుకు దారులతో ఇబ్బంది పడుతున్న రైతులకు మంత్రి ఈశ్వర్ పరిష్కార మార్గం చూపారు. బీటీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ధర్మారం మండలం బొట్లవనపర్తి నుంచి పైడిచింతలపల్లి వరకు, ఖిలావనపర్తి నుంచి జూలపల్లి మండలం కుమ్మరికుంట శివారు వరకు రహదారుల నిర్మాణానికి రూ. 6.90 కోట్లు మంజూరు చేయించారు. శుక్రవారం అమాత్యుడు శంకుస్థాపన చేయనుండగా ప్రజాప్రతినిధులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ధర్మారం మండలం బొట్లవనపర్తి నుంచి పైడిచింతలపల్లి వరకు ఒక మార్గంలో, ఖిలావనపర్తి నుంచి జూలపల్లి మండలం కుమ్మరికుంట శివారు వరకు మరో మార్గంలో బీటీ రోడ్డు నిర్మాణానికి ముందడుగు పడింది. కాగా ఈ రెండు మార్గాలు వ్యవసాయ భూములు ఉన్న ప్రదేశాలు కావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బొట్లవనపర్తి శివారు నుంచి గొల్లపల్లి, కానంపల్లి మీదుగా పైడిచింతలపల్లి వరకు రోడ్డు ఎంతో అధ్వానంగా ఉంది. ఈ మార్గంలో కొన్నేళ్ల క్రితం కానంపల్లి నుంచి పైడిచింతలపల్లి వరకు కంకర రోడ్డు వేశారు. బొట్లవనపర్తి నుంచి బుచ్చయ్యపల్లి శివారు గొల్లపల్లి వరకు సరైన రోడ్డు సౌకర్యం లేక రైతులు ఇబ్బందులకు గురయ్యారు. ఇది మట్టిరోడ్డు. వానకాలం వచ్చిందంటే ఈ మార్గంలో కనీసం ద్విచక్ర వాహనం కూడా నడిచే పరిస్థితి లేదు. దీంతో రైతులు వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఎన్నో అవస్థలు పడ్డారు. సమస్యను పరిష్కరించాలని పలుసార్లు రైతులు మంత్రి ఈశ్వర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి ఈశ్వర్ బీటీ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమం చేశారు.
ఖిలావనపర్తి నుంచి కుమ్మరికుంట వరకు..
ఖిలావనపర్తి నుంచి జూలపల్లి మండలం కుమ్మరికుంట వరకు కేవలం 7నుంచి8 కిలో మీటర్ల దూరం మాత్రమే ఉండేది. కానీ సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు సుమారు 20 కిలో మీటర్లు దూరం తిరిగి నంది మేడారం చామనపల్లి, కొత్తూరు మీదుగా కుమ్మరికుంటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఖిలావనపర్తి గ్రామ రైతులు కూడా పంట పొలాలకు సరైన దారి లేక ఇబ్బందులకు గురికాగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో స్పందించి నాలుగేళ్ల క్రితం 3 ఒర్రెలపై వంతెనలు నిర్మించారు. కానీ ఈ రోడ్డు మార్గం మాత్రం రైతులకు అనువుగా లేకుండా పోయింది. కుమ్మరికుంట వెళ్లేందుకు సరైన దారి లేక ఇబ్బందులు పడ్డారు. ఈ తరుణంలో ఖిలావనపర్తి నుంచి కుమ్మరికుంట వరకు పంట పొలాలకు ఉపయోగపడడంతోపాటు రోడ్డు మార్గం ఉండేలా మంత్రి కొప్పుల ఈశ్వర్ బీటీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించారు.
రెండు మార్గాలకు రూ. రూ. 6.90 కోట్లు
బొట్లవనపర్తి నుంచి పైడిచింతలపల్లి వరకు, ఖిలావనపర్తి నుంచి కుమ్మరికుంట వరకు బీటీ రోడ్ల నిర్మాణం కోసం మంత్రి ఈశ్వర్ ప్రతిపాదనలు పంపించి పీఎంజీఎస్వై పథకం ద్వారా రూ. 6.90 కోట్లు మంజూరు చేయించారు. బొట్లవనపర్తి నుంచి వయా ఎస్సీ కాలనీ, బుచ్చయ్యపల్లి శివారు మీదుగా గొల్లపల్లి, కానంపల్లి నుంచి పైడిచింతలపల్లి వరకు 5.35 కిలోమీటర్ల దూరం పాటు బీటీ రోడ్డు నిర్మించేందుకు రూ. 3,56,49,000, ఖిలావనపర్తి ఎస్సీ కాలనీ నుంచి బూరుగుంట, బలుపాల బోరు మీదుగా కుమ్మరికుంట వరకు 5.40 కిలో మీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. శుక్రవారం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ రెండు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్రెడ్డి తెలిపారు. కుమ్మరికుంట వెళ్లే మార్గానికి ఖిలావనపర్తిలో బొట్లవనపర్తి నుంచి పైడిచింతపల్లి వెళ్లే రోడ్డు మార్గానికి పైడిచింతపల్లి, కానంపల్లి, బొట్లవనపర్తి గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించి మంత్రి కొప్పుల శంకుస్థాపన చేస్తారని వారు వివరించారు. కానంపల్లి, బొట్లవనపర్తిలో నిర్మించిన వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలను మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. మంత్రి పర్యటనకు ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, సర్పంచులు రెడపాక ప్రమీల, గుర్రం మనీషా, బద్దం వెంకటమ్మ, సాగంటి తార, ఎంపీటీసీ మోతె సుజాత,ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. కాగా, మంత్రి పర్యటన సందర్భంగా శిలాఫలకాలను సిద్ధం చేశామని ఈఈ మునిరాజ్, పీఆర్ డీఈఈ శంకరయ్య వెల్లడించారు.
రైతుల గోస తీర్చేందుకే ..
వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రైతులు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. వారి బాధలు దగ్గరుండి చూసిన. బొట్లవనపర్తి, బుచ్చయ్యపల్లి, కానంపల్లి, పైడిచింతలపల్లి, ఖిలావనపర్తి, కుమ్మరికుంట రైతుల ఇబ్బందులను శాశ్వతంగా బీటీ రోడ్డు నిర్మించి పరిష్కారం చేయాలని సంకల్పించిన. ఈ రెండు రోడ్ల నిర్మాణాలకు నిధుల మంజూరుకు ప్రతిపాదన పంపించిన. పీఎంజీఎస్వై ద్వారా రూ.6.90 కోట్ల నిధులు మంజూరు చేయించిన. బీటీ రోడ్ల నిర్మాణంతో రైతుల కల నెరవేర్చడం ఎంతో ఆనందంగా ఉంది.