‘దోస్త్ మేరా దోస్త్.. తూహీ మేరా జాన్’ అని ఇద్దరు మిత్రుల బందాన్ని ఓ సినీ కవి పాట రూపంలో వర్ణించినట్లు.. స్నేహం చాలా గొప్పది. కుల, మత, పేద, ధనిక, ప్రాంత, లింగ భేదం లేకుండా అందరిలోనూ, అందరికీ కలిగే మధురమైన అనుభూతి దోస్తానా. అందులోనూ ఈ మిత్ర బంధం సోషల్ మీడిమా పుణ్యమా అని కొన్నేళ్లుగా దగ్గరైపోయింది. ఏ దేశంలో ఉన్నా.. ఏ రాష్ట్రంలో ఉన్నా.. సామాజిక మాధ్యమాల ద్వారా మంచీచెడులు తెలుసుకుంటూనే, మిత్రుడికి ఆపద వచ్చిందని తెలిస్తే చాలు ‘మేమున్నాం’ అంటూ ఆదుకుంటున్నారు. గెట్ టూ గెదర్లతో మరింత చేరువవుతున్నారు. అందులోనూ స్నేహితుల దినోత్సవం వచ్చిందంటే ఓ పెద్ద పండుగే చేసుకుంటున్నారు. మరెందుకు ఆలస్యం నేడు ఆ రోజురానే వచ్చింది. నేడే ఫ్రెండ్షిప్ డే.
– కోల్సిటీ/కరీంనగర్ కమాన్ చౌరస్తా, ఆగస్టు 5
మానవ జన్మకు తరగని ఆస్తి ఉందంటే అది ఒక స్నేహమే. 30 నుంచి 40 ఏండ్ల క్రితం కలిసి చదువుకున్న చిన్ననాటి మిత్రులు ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి గెట్ టూ గెదర్ పేరుతో కలుసుకుంటూ స్నేహబంధాలను ఇనుమడింపచేస్తున్నారు. ఏదిఏమై నా కాలం మారుతున్నా, స్నేహ బంధాలు మా త్రం ఇప్పటికీ తరగడం లేదనడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుత బీజీ లైఫ్ కావచ్చు, ఉన్నత చదువుల కోసం కావచ్చు, ఉద్యోగ, ఉపా ధి కోసమో.. అప్పటిదాకా ఒక్కచోట ఉన్న దోస్తులంతా దూరమవుతుంటారు. ఇలా ఎప్పుడో తెరపడిన స్నేహ బంధాన్ని ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం ‘సోషల్ మీడియా’ మళ్లీ కలుపుతుండగా, ఇప్పటికీ కొనసాగుతున్న స్నేహాన్ని మ రింత పటిష్ఠపరుస్తున్నది. ‘ఫేస్బుక్’, ‘వాట్సా ప్’, ‘ట్విట్టర్’ తదితర సామాజిక మాధ్యమాలు స్నేహ వారధుల్లా మారిపోయాయి. ఏ దేశంలో ఉన్న, ఏ రాష్ట్రంలో ఉన్నా.. వాట్సప్ గ్రూప్ అందరు స్నేహితులు అందుబాటులో ఉంటున్నారు. చెడ్డి దోస్తులు, పది దోస్తానా.., ఇంటర్ కింగ్స్, డిగ్రీ దోస్తులు, పీజీ ప్రెండ్స్.. ఇలా చాలా.. ప్రతి ఒక్కరి ఫోన్లో ఉంటూనే ఉంటున్నాయి. అంతేనా.. ఆపద అని తెలిస్తే చాలు, మేం ఉన్నాం అంటూ ఆదుకుంటున్నారు.
ఆపదలో ఆదుకుంటూ..
ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడమే కాదు తోటి మిత్రుడికి ఆపదొస్తే ఆదుకుంటున్నారు. గ్రూప్లో ఏదైనా మెస్సేజ్ వస్తే చాలు అందరూ చర్చించుకొని సాయం చేస్తున్నారు. ఉదాహరణకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హోలీ ఏంజిల్స్ పాఠశాల 1994-95లో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు, ఆ తర్వాత వారివారి ఉన్నత చదువులు పూర్తి చేసుకుని వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఈ క్రమంలో వారంతా ఒక సారి సమావేశం కావాలని నిర్ణయించుకుని నగరంలోని ఒక హోటల్ వేదికగా కలిశారు. ఈ క్రమంలో వారితో ఉన్న ఒక స్నేహితుడి సోదరి వివాహం చేయలేని పరిస్థితిలో ఉండగా, ‘మేమున్నాం’ అంటూ 2.5 లక్షలు అందజేశారు.
ఇక కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసిన స్నేహితులు, ఆ తర్వాత ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడ్డారు. అయితే వారితో చదువుతున్న మిత్రుడు హఠాత్తుగా మృతిచెందగా, ఆ కుటుంబానికి అండగా ఉందామని నిర్ణయించుకున్నారు. తలా ఒక చేయి వేసి, లక్ష వారి కుటుంబానికి అందజేశారు.
నిలవాలి స్నేహం కలకాలం
అయితే తొలి పరిచయంలోనే స్నేహితులు కావడం తప్పేమీ కాదు. కొత్త వ్యక్తి పరిచయడం కాగానే అన్ని విషయాలు చెప్పేయవద్దు. మిత్రులుగా మారాకే ఆంతరంగిక విషయాలు చెప్పా లి. మనకు అవసరం ఉంటేనే మాట్లాడడం సరికాదు. ఎదుటి వారి అవసరాల్నీ గుర్తించాలి. మి త్రుడి ఇష్టాన్ని గుర్తెరిగి బహుమతులు ఇవ్వాలి. మన ఇష్టం మేరకు కాదు. ఆ బహుమతి మిమ్మ ల్ని తలుచుకునేలా ఉండాలి. మీరు ఏదైనా వస్తువును కొనే సమయంలో స్నేహితుడికి చెప్పండి.. సంతోషమైనా, విషాదమైనా మిత్రుడితో పంచుకోవాలి. స్నేహితులుగా ఎంచుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహానికి విలువ ఇచ్చే వారిని, తోటి వారు ప్రయోజకులు అయ్యేందుకు తోడ్పడేవారిని, చెడు తిరుగుళ్లు, టీజింగ్కు దూరంగా ఉండే వారిని ఎంచుకోవాలి. ఎదుటి వారిపై నిందలు వేయని వారిని పరిస్థితులు అర్థం చేసుకునే వారిని స్నేహితులుగా ఎంచుకుంటే మంచిది.
చిన్నతనం వీడని ‘చిన్మయ’ స్టూడెంట్స్
గోదావరిఖనిలో చిన్మయ విద్యాలయంలో 1990లో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఇప్పటికీ చిన్నతనాన్ని వీడడం లేదు. నాడు ఎఫ్సీఐలో పని చేసిన కార్మికుల పిల్లలు ఇక్కడి చిన్మయ విద్యాలయంలో చదువుకున్నారు. తర్వాత ఎఫ్సీఐ మూతపడడం, వీరంతా పెరిగి పెద్దయి వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డప్పటికీ ఫ్రెండ్ షిప్ డే రోజు అందరూ ఓ చోట కలుసుకొని వేడుకగా జరుపుకుంటూ దోస్తులకే స్ఫూర్తిగా నిలుస్తున్నారు.