Road Accident | పాలకుర్తి : పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన దుర్గం మల్లయ్య (52) శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బసంత్ నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మల్లయ్య తెల్లవారుజామున ఫస్ట్ షిఫ్ట్ విధులకు ఇంటి నుంచి బయలుదేరాడు. రామారావుపల్లి బస్టాండ్ వద్ద వేగంగావస్తున్న టిప్పర్ ఢీకొనడం వల్ల తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు.
జయ్యారం క్వారీల నుంచి కన్నాల క్రషర్ల యజమానులు టిప్పర్లతో ఓవర్లోడ్, అతివేగంగా బోల్డర్ (బండరాయి) తరలిస్తున్నారు. చిన్నరోడ్ పై నిత్యం టిప్పర్ లారీలు ఓవర్ లోడ్ తో అతివేగంగా నడవడం వల్ల ఈ మార్గం లో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు మండిపడుతున్నారు. విషయం తెలుసుకున్న బసంత్ నగర్ ఎస్ఐ నూతి శ్రీధర్ సంఘటనా స్థలానికి వెళ్లి సమాచారం తెలుసుకుని మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.