బిడ్డ కడుపులో పడ్డది అంటే.. ఆ అమ్మ ఎంతో సంతోష పడుతుంది! పుట్టబోయే బిడ్డ కోసం తొమ్మిది నెలలు ఎదురుచూస్తుంది! నెలలు నిండుతున్నా కొద్దీ సంబురపడుతుంది! తను పునర్జన్మనెత్తి బిడ్డకు జన్మనిచ్చి మురిసిపోతుంది! కానీ, పుట్టిన బిడ్డలో ఏమైనా లోపాలుంటే.. గ్రహణం మొర్రి, గుండెలో రంధ్రం, కాళ్లు, చేతులు వంకరగా ఉంటే.. లేదంటే నయంకాని వ్యాధులుంటే.. మొత్తానికే ఎదుగుదల సరిగ్గా లేకుంటే ఆ తల్లి పడే బాధ ఏంటి?
టి ఫా స్కానింగ్.. కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు 18 నుంచి 20 వారాల మధ్యన ఈ స్కానింగ్ చేస్తారు. గర్భంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలి వరకు ప్రతి అవయవాన్నీ పరిశీలిస్తారు. దీని వల్ల ఎదుగుదలను తెలుసుకోవడమే కాదు, లోపాలను గుర్తించి సరిదిద్దుకునే అవకాశముంటుంది. సర్జరీలు అవసరమైతే డెలివరీ సమయంలోనే చేసి ప్రాణాలు కాపాడవచ్చు. ఒకవేళ సరిదిద్దలేని లోపాలుంటే ముందే గుర్తించి చట్టబద్ధంగా అబార్షన్ చేసుకునే వీలుంటుంది.
అయితే ఈ టిఫా స్కానింగ్కు ప్రైవేట్లో 1500 నుంచి 2500 వరకు వసూలు చేస్తుండగా, ఇది నిరుపేదలకు భారంగా మారతున్నది. దీనిని గుర్తించిన రాష్ట్ర సర్కారు, రెండు నెలల క్రితమే టిఫా స్కానింగ్ సేవలను ప్రారంభించింది. మున్ముందు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్లు, పౌష్టికాహారం ఇలా తల్లీబిడ్డల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అన్ని రకాలుగా భరోసానిస్తున్నది. తాజాగా అత్యాధునికమైన సేవలు అందిస్తుండగా, పేద, మధ్యతరగతి వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
నిరుపేదల వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ దవాఖానలకు దీటుగా వసతులు కల్పిస్తూ మెరుగైన సేవలు అందిస్తున్నది. ముఖ్యంగా గర్భిణులు, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. అందులో భాగంగా ఇప్పటికే ‘కేసీఆర్ కిట్’ పథకం అమలు చేయడంతోపాటు గర్భిణుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా టిఫా స్కానింగ్ పరికరాలను అందుబాటులోకి తెస్తున్నది. రెండు నెలల క్రితం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వర్చువల్ విధానంలో అన్ని దవాఖానాల్లో సేవలను ప్రారంభించారు. మొదటగా కరీంనగర్లో రెండు, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లిలో ఒకటి చొప్పున టిఫా స్కానింగ్ మిషన్లను ప్రారంభించారు. ఇప్పటికే ఏరియా దవాఖానలు, సీహెచ్సీల నుంచి ప్రతిపాదనలు వెళ్లగా, మున్ముందు మరిన్ని అందుబాటులోకి తేనున్నారు.
ఈ స్కానింగ్తో గర్భస్థ దశలో ఉన్న శిశువు ఆరోగ్యాన్ని తెలుసుకునే వీలుంటుంది. దీని వల్ల లోపాలను గుర్తించి, అందుకు తగిన వైద్యం అందించి.. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్త పడే అవకాశముంటుంది. కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు ఈ స్కానింగ్ ఉపయోగ పడుతుండగా, ఎంతోమంది గర్భిణులు టిఫా స్కానింగ్ చేయించుకుని తమకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్య వివరాలను తెలుసుకుంటున్నారు. సిరిసిల్లలో ఇప్పటి వరకు 78 మంది గర్భిణులకు పరీక్ష చేసినట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు.
తప్పిన ఆర్థిక భారం
పుట్టుకతోనే కొంతమంది పిల్లల్లో ఏదో ఒక లోపం కనిపిస్తుంది. ఈ సమస్యను ముందుగానే గుర్తించేందుకు ‘టిఫా’ (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్) స్కాన్ దోహదం చేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలు ఉన్నా వాటికి టిఫా స్కాన్ తీసే సామర్థ్యం లేదు. దీంతో ప్రభుత్వ దవాఖానలో సదుపాయం లేకపోవడంతో ఇంతకాలం ప్రైవేటు సెంటర్లను ఆశ్రయించేవారు. దీంతో ఒక్కో స్కానింగ్కు 1500 నుంచి 2500 వేల వరకు భారం పడేది. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానలోనే టిఫా స్కానింగ్ సేవలు ఏర్పాటు కావడంతో పేదలకు ఉపయోగ పడుతున్నది.
కేటీఆర్ చొరవతో ‘టిఫా’ సేవలు
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లా దవాఖానలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆక్సిజన్ ప్లాంట్, ఎన్ఐసీయూ, బ్లడ్ బ్యాంకు, పీడియాట్రిక్ ఐసీయూ వార్డు, డయాలసిస్ సెంటర్, ఐసీయూ, ప్రత్యేక కొవిడ్ వార్డు వంటి ఎన్నో రకాల కార్పొరేట్ సౌకర్యాలు కల్పించారు. గర్భిణులకు ఉపయోగకరమైన టిఫా స్కానింగ్ సేవలు రెండు నెలల క్రితం ప్రారంభించి అందుబాటులోకి తెచ్చాం. ఈ పరీక్షలకు ప్రైవేటులో 2 వేల వరకు వసూలు చేస్తున్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందిచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తున్నది.
– న్యాలకొండ అరుణ, జడ్పీ, రాజన్న సిరిసిల్ల జిల్లా దవాఖాన అభివృద్ధి కమిటీ చైర్పర్సన్
గర్భిణులకు ఎంతోమేలు
సిరిసిల్ల జిల్లా దవాఖానకు రోజూ 100 నుంచి 150 మంది వరకు గర్భిణులు వస్తున్నారు. రోజుకు సుమారుగా 8 నుంచి 10 వరకు డెలివరీలు జరుగుతున్నాయి. ప్రతి నెలా 250 నుంచి 300ల డెలివరీలు చేస్తున్నాం. వారికి అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. మంత్రి కేటీఆర్ సూచనతో ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ పరికరం ఎంతో ఉపయోగంగా ఉన్నది. ఇప్పటి వరకు 78 మందికి టిఫా స్కానింగ్ చేశాం. ఉచితంగా సేవలు అందుబాటులోకి రావడంతో పేదలపై ఆర్థిక భారం కూడా తప్పింది.
– మురళీధర్రావు, సూపరింటెండెంట్ (రాజన్న సిరిసిల్ల జిల్లా దవాఖాన)
ఇవీ ఉపయోగాలు
అంతర్జాతీయ నివేదికలు, వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం 7 శాతం శిశువుల్లో లోపాలు ఉండే అవకాశమున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీని ప్రకారం పుట్టే ప్రతి 100 మందిలో ఏడుగురు శారీరకంగా ఏదో ఒక లోపం ఉంటున్నది. మేనరిక వివాహాలు, జన్యు సంబంధిత లోపాలు, ఆలస్యంగా గర్భం దాల్చడం, గర్భం దాల్చినప్పటి నుంచే శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం కావడం, సరైన పోషకాహారం లేకపోవడం.. ఇలా ఎన్నో కారణాల వల్ల శిశువుల్లో లోపాలు తలెత్తుతున్నాయి. అయితే, అందులో అత్యధిక శాతం ముందే గుర్తిస్తే నయం చేయగలిగినవే. ఇలాంటి లోపాలను ‘టిఫా’ స్కాన్తో గుర్తించే అవకాశముంటుంది.
టిఫా స్కాన్ 18-20 వారాల మధ్య చేస్తారు. కొన్ని సందర్భాల్లో 22 వారాల వరకు కూడా చేస్తారు.
ఈ స్కానింగ్లో గర్భంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలి వరకు ప్రతి అవయవాన్ని స్కాన్ చేస్తారు.
మెదడు, కండ్లు, ముక్కు, నాలుక.. ఇలా ప్రతి అంతర్గత అవయవాన్ని 3డీ, 4డీ ఇమేజింగ్ రూపంలో నివేదికలు తయారు చేస్తారు.
నిపుణులైన రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్టులు మాత్రమే ఈ స్కాన్ చేస్తారు. ఇందుకు కనీసీం 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది. శిశువు గర్భంలో ఏ పొజిషన్లో ఉన్నది? జరాయువు/మావి(ప్లాసెంటా) ఏ ప్రాంతంలో ఉన్నది? ఉమ్మ నీరు స్థితి వంటి వాటిని గుర్తిస్తారు.
శిశువులో ఏవైనా లోపాలు గుర్తిస్తే అప్రమత్తమై సరిదిద్దే వీలు కలుగుతుంది.
కొన్ని సందర్భాల్లో పిల్లలు పుట్టగానే సర్జరీ చేయాల్సి రావొచ్చు. ముందే గుర్తించగలిగితే డెలివరీ సమయంలో పీడియాట్రిక్ సర్జన్లను అందుబాటులో ఉంచి ప్రాణాలు రక్షించవచ్చు.
గ్రహణమొర్రి, గుండెలో రంధ్రం, కాళ్లు, చేతులు వంకరగా ఉండడం వంటి లోపాలు గుర్తిస్తే ముందుగానే కుటుంబ సభ్యులను మానసికంగా సిద్ధం చేసే అవకాశం ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో శిశువుల ఎదుగుదల సరిగా లేక.. పుట్టగానే చనిపోయే అవకాశం ఉంటుంది. నయంకాని వ్యాధులు, ఎక్కువ కాలం బతకలేకపోవడం వంటివి గుర్తిస్తే ముందుగానే న్యాయపరంగా అబార్షన్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది.
జరాయువు, బొడ్డుతాడు ఉన్న స్థితిని బట్టి సాధారణ ప్రసవానికి సాధ్యమా, సిజేరియన్ చేయాలా.. అనేది నిర్ణయించవచ్చు.