తాజాగా బీజేపీని వీడిన ఇద్దరు కార్పొరేటర్లు
ఇదే బాటలో మరికొంత మంది!
ఇప్పటికే సీనియర్ల తిరుగుబావుటా
సొంత గడ్డపై పట్టు కోల్పోతున్న సంజయ్
ఒంటెత్తు పోకడతో అంతర్మథనంలో శ్రేణులు
వివక్ష, చిన్నచూపుపై అసంతృప్తి సెగలు
‘గంగులపై గెలుస్తావా..’ అంటూ కేటీఆర్ విసిరిన సవాల్పై జోరుగా చర్చ
ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని సంకట స్థితితో పార్టీ నేతలు
ధర్మం కోసం కాదు.. ధనం కోసమే ‘బండి’ పనిచేస్తున్నాడని విమర్శలు
కరీంనగర్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కమలంలో కల్లోలం రేగుతున్నది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి అనుసరిస్తున్న వైఖరి శ్రేణులను అంతర్మథనంలో పడేస్తున్నది. ఒంటెత్తు పోకడ, వివక్ష రోజురోజుకూ పెరుగుతుండగా, ‘అసంతృప్తి సెగ’ బయటపడుతున్నది. ఇప్పటికే సీనియర్లు తిరుగుబావుటా ఎగురవేయగా, తాజాగా ఇద్దరు కరీంనగర్ కార్పొరేటర్లు బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరడం ఆ పార్టీ నేతలను ఆలోచనలో పడేస్తున్నది. ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. పార్టీలో ఇమడలేక చాలా మంది అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుండగా, సొంతగడ్డపై సంజయ్ పట్టు కోల్పోతున్నారన్న ప్రచారం జరుగుతున్నది. ఇటు గురువారం కరీంనగర్ వేదికగా ‘దమ్ముంటే మంత్రి గంగులపై పోటీ చేసి గెలిచి చూపించూ’ అంటూ సంజయ్కు మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్పై జోరుగా చర్చ సాగుతున్నది. దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పే బండి.. కేవలం ధనం కోసమే పనిచేస్తాడని తాజాగా పార్టీని వీడిన కార్పొరేటర్లు విమర్శలు చేయడం హాట్టాపిక్లా మారింది.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే కమలం పార్టీలో విబేధాలు రచ్చకెక్కాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ ఎన్నికల విషయంలో వేర్వేరు మార్గాలను అనుసరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఉన్న బలాన్ని పరిగణనలోకి తీసుకొని.. ఇతర పార్టీలు అభ్యర్థులను బరిలో నిలుపలేదు. ఈ పరిస్థితులను గమనించిన బండి సంజయ్.. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తమ పార్టీ నుంచి ఏ అభ్యర్థిని నిలుపలేదని, పార్టీ ఎవరికి సపోర్టు చేయడం లేదని స్పష్టంగా ప్రకటించారు. ఇలా రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా ప్రకటిస్తే.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాత్రం స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరికి ఓటు వేయాలంటూ బాహాటంగా ప్రచారం చేశారు. అదే స్వతంత్ర అభ్యర్థిని బీజేపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు బలపరిచారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం, సదరు కార్పొరేటర్లకు నోటీసులు జారీ చేసినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే ఈటల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు అప్పుడే ఉత్పన్నమయ్యాయి. ఒకరికి ఒక న్యాయం.. ఇంకొకరికి ఇంకో న్యాయం అన్నట్లుగా వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచి పార్టీలో అసంతృప్తి రాజుకుంటున్నది.
పార్టీని పట్టించుకోకపోవడం, ఒంటెత్తు పోకడ, మాటలు చెప్పడమే తప్ప ఆచరణలో పెట్టకపోవడం, సీనియర్లకు గౌరవం ఇవ్వకపోవడంపై సీనియర్లు ఇదే గడ్డపై నుంచి తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై యావత్ తెలంగాణ ప్రజానీకం భగ్గుమనగా, ఈ విషయంలో ప్రజల నుంచి వచ్చిన ప్రశ్నలకు బీజేపీ నేతలు ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు కంటోన్మెంట్ భూముల విషయంలో బండి మాట్లాడుతున్న తీరుపై కరీంనగర్ పూర్వ జిల్లా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే.. కంటోన్మెంట్ వల్ల చాలా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటు హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నా.. కంటోన్మెంట్ వల్ల రాజీవ్హ్రదారి వైపు విస్తరించడంలేదు. నిజానికి కంటోన్మెంట్ భూములు ప్రభుత్వానికి ఇవ్వాలని.. తద్వారా ఫైఓవర్లు నిర్మించి రహదారిని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు చెప్పింది. పూర్వ కరీంనగర్ జిల్లా ప్రజలు కూడా కోరుకుంటున్నది ఇదే. కానీ, ఈ విషయంలో బండి సంజయ్.. పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు పార్టీ శ్రేణులను అంతర్మథనంలో పడేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ ఆ పార్టీలో కల్లోలం రేపుతున్నాయి.
కేటీఆర్ సవాల్.. హాట్ టాపిక్
ఈనెల 17న కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్ర ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్.. బండి సంజయ్కు విసిరిన సవాల్ ప్రస్తుతం కమలం పార్టీలో హాట్ టాపిక్లా మారింది. ‘నీకు దమ్ముంటే మంత్రి గంగులపై గెలిచి చూపించూ’ అంటూ మంత్రి చేసిన సవాల్పై జోరుగా చర్చ సాగుతున్నది. బీజేపీ ప్రభావం రాష్ట్రంలో బాగా పెరుగుతున్నదని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో పాలన చేస్తామంటూ పదేపదే చెబుతున్న సంజయ్.. కేటీఆర్ విసిరిసిన సవాల్ స్వీకరించవచ్చు కదా? వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్గా తీసుకోవచ్చు కదా? అన్న అభిప్రాయాలను ఆ పార్టీలో కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే సవాల్ను స్వీకరించే, గంగులపై గెలిచే సత్తా బండికి లేదని అదే పార్టీకి చెందిన పలువురు వాదిస్తున్నారు. దీనిపై దాటవేతే తప్ప సవాల్ను స్వీకరించరంటూ కొంత మంది సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారు. వారు అనుకున్నట్లుగానే.. బండి సంజయ్ ఈ సవాల్ను దాటవేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ‘మా జాతీయ పార్టీ వారు ఏది చెబితే అదే చేస్తాం’ అంటూ దాటవేయడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. అలాగే.. బండీ మూడేళ్లలో కేంద్రం నుంచి నువ్వు ఏమైనా తెచ్చావా? యవతీ యువకుల భవిష్యత్కు ఉపయోగపడే ఒక్క పనైనా చేశావా? ఒక్క కాలేజీ అయినా తీసుకొచ్చొవా? ఒక్క గుడి అయినా తెచ్చావా? నీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కటంటే ఒక్కటి ఇది చేశానని చెప్పగలవా..? కనీసం కరీంనగర్ పట్టణం కోసం రూ.3కోట్ల పనైనా చేశావా..? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించినా.. కనీసం ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక మళ్లీ పాత పాటే అందుకున్న తీరు కూడా ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
పార్టీని వీడుతున్న కార్పొరేటర్లు
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 13 స్థానాల్లో బీజేపీ గెలిచింది. అందులో ఒక్కొక్కరు గులాబీ బాట పడుతున్నారు. గతంలోనే ఒక కార్పొరేటర్ టీఆర్ఎస్లో చేరగా.. తాజాగా (ఈ నెల 17న) బీజేపీకి చెందిన 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత-చంద్రశేఖర్, 26వ డివిజన్ కార్పొరేటర్ నక్క పద్మ-కృష్ణ కరీంనగర్ వేదికగా మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. బండి సంజయ్ సొంత నియోజకవర్గంలోనే చేరికల పర్వం కొనసాగుతుండగా, కమలం పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. అంతేకాదు, ఇదే దారిలో మరికొంత మంది గులాబీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి మరి కొద్దిరోజుల్లోనే బీజేపీలో ఊహించని పరిణామాలు జరిగే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అందులోనూ కరీంనగర్ నియోజకవర్గం, కార్పొరేషన్ పరిధిలోజరుగుతున్న పనులు ఇతర పార్టీ కార్పొరేటర్లను ఆకర్షించడానికి మరో కారణమవుతున్నది.
ధర్మం కోసం కాదు.. ధనం కోసమే : కార్పొరేటర్లు
బండి సంజయ్ ధర్మం కోసం కాదు.. ధనం కోసం మాత్రమే పనిచేస్తున్నారంటూ టీఆర్ఎస్లో చేరిన ఇద్దరు కార్పొరేటర్లు చెబుతున్నారు. 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత-చంద్రశేఖర్, 26వ డివిజన్ కార్పొరేటర్ నక్క పద్మ- కృష్ణ పార్టీని వీడేందుకు చెప్పిన కారణాలు బీజేపీ శ్రేణులను ఒక్కసారిగా అంతర్మథనంలో పడేస్తున్నాయి. బండి తన స్వార్థం తాను చూసుకోవడం తప్ప ఏనాడూ కార్యకర్తల సంక్షేమం గురించి పట్టించుకోలేదని, ధర్మం పేరు చెప్పి ధనం కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. పలు సార్లు తాను జైలుకు వెళ్లడంతో పేరు వచ్చిందని, మీరు కూడా జైలుకు వెళ్తేనే మంచి పేరు వస్తుందని చెబుతూ యువతను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. అలాగే ఒక్కరోజు కూడా నగరపాలక సంస్థకు వచ్చి సమస్యలు, అభివృద్ధి పనులపై సమీక్షించలేదని, ‘మీ నాయకుడు కేవలం పేపర్, సోషల్ మీడియాలోనే కనిపిస్తాడా..? అభివృద్ధి గురించి ఏం చెయ్యడా..?’ అని ప్రజలు నిలదీస్తుంటే.. ఎన్నోసార్లు సమాధానం చెప్పలేని పరిస్థితులు తమతోపాటు అనేక మంది బీజేపీ నాయకులు ఎదుర్కొన్నారని చెబుతున్నారు.
కార్పొరేటర్లకు సరైన గౌరవం ఇవ్వలేదని, ఒక్కరోజు కూడా మా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదని, బీజేపీ కార్పొరేటర్ల డివిజన్లలో అభివృద్ధి పనులు సాగుతున్నాయా? లేదా అని అడిగిన పాపాన పోలేదన్నారు. ఆ పార్టీలో దళితులకు ప్రాధాన్యం లేదని, అందుకే దళితులమైన తాము ఆ పార్టీని వీడుతున్నామని చెప్పారు. కానీ, టీఆర్ఎస్ సర్కారు దళిత సంక్షేమం కోసం దళితబంధు పథకం ప్రవేశపెట్టిందన్నారు. గత ఎంపీగా పనిచేసిన వినోద్కుమార్ పట్టుబట్టి నగరానికి స్మార్ట్ సిటీ సాధించారని, జాతీయ రహదారుల హబ్గా మార్చి ఆ కార్యాలయాన్ని కరీంనగర్లో పెట్టించారని, అలాగే కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వేలైన్ లాంటివి ఎన్నో తెచ్చారని గుర్తు చేశారు. కానీ, బండి సంజయ్ మాత్రం మూడేళ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా తీసుకు రాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అడిగే ప్రశ్నలకు ఏమి సమాధానం చెబుతామన్నారు. అనేక లోపాలున్న ఆ పార్టీలో కొనసాగడం మంచిది కాదన్న విషయాన్ని చాలా మంది ఆలోచిస్తున్నారని చెప్పారు. అతి కొద్ది సమయంలోనే చాలామంది ఆ పార్టీని వీడుతారంటూ ఆ ఇద్దరు కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలు బీజేపీలో లోతైన చర్చకు దారి తీశాయి.
ఎంపీగా గెలిచి చేసిందేమీ లేదు..
కార్యకర్తలు, ప్రజలను బండి సంజయ్ ఏ రోజూ పట్టించుకోలేదు. బీజేపీ కార్పొరేటర్లకు ఎక్కడా కనీస ప్రాధాన్యత ఇచ్చింది లేదు. ఏ రోజు కూడా మీ డివిజన్లో ఉన్న సమస్యలు ఏమిటి? ఏమైనా చేయాల్సి ఉన్నదా? అని అడిగింది లేదు. ఎంత సేపూ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం తప్ప మరొకటి లేదు. కార్యకర్తలు, యువత ధర్మం కోసం పని చేస్తే.. సంజయ్ మాత్రం ధనం, పేరు కోసం పని చేస్తున్నాడు. ఎంపీగా గెలిచిన ఈ మూడేళ్ల కాలంలో ఎప్పుడు కూడా నగరాభివృద్ధిని పట్టించుకోలేదు. ఒక్క రోజు కూడా నగరపాలక సంస్థకు వచ్చి సమస్యలు, అభివృద్ధి పనులపై సమీక్షించిన పాపాన పోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నగర ప్రజలు నిలదీస్తున్నారు. మీ నాయకుడు కేవలం పేపర్, సోషల్ మీడియాలోనే కనిపిస్తాడా..? అభివృద్ధి గురించి ఏం చెయ్యడా..? అని ప్రశ్నిస్తే ఏం చెప్పాలో తెలియడం లేదు. పార్టీలో దళితులకు ఏమాత్రం ప్రాధాన్యత లేదు. కానీ, తెలంగాణ సర్కారు దళితుల కోసం దళితబంధు తెచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. స్థానిక మంత్రి గంగుల కమలాకర్ నిత్యం నగర, నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపిస్తున్నడు. బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా గుండెలపై చేతులు వేసుకొని నిజాలు చెప్తే ఆయన రాజకీయ జీవితం ఏమి లేకుండాపోతుంది. మా లాగే మరికొంత మంది టీఆర్ఎస్లోకి వచ్చే అవకాశం ఉంది.
–మెండి శ్రీలతా చంద్రశేఖర్, కరీంనగర్ 44వ డివిజన్ కార్పొరేటర్