పసుపు రైతు పంట పండుతున్నది. గతంలో పోలిస్తే ఈ యేడు పసుపు లాభాలు కురిపిస్తున్నది. జగిత్యాల జిల్లాలో ఈ సీజన్లో 22వేల ఎకరాల్లో సేద్యం చేయగా, దిగుబడికి తగ్గ రేటు వస్తున్నది. రెండు రోజుల క్రితమే మెట్పల్లి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కాగా, క్వింటాల్కు గరిష్ఠంగా 12వేల పైనే పలుకుతున్నది. కొన్నేండ్లుగా ధరలు లేక కుదేలైన రైతులకు, ఈ సారి పెరిగిన ధరలతో భరోసా కలుగుతున్నది.
మెట్పల్లి, ఫిబ్రవరి15: జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి, కోరుట్ల డివిజన్లతోపాటు నిజామాబాద్ జిల్లాలో పసుపు పంటను ప్రధానంగా సాగు చేస్తున్నారు. 2023-24 సంవత్సరంలో జగిత్యాల జిల్లాలో 22 వేల ఎకరాల్లో సేద్యం చేశారు. ఇప్పుడిప్పుడే పసుపు పంట దిగుబడి వస్తున్నది. కాగా, పసుపు సాగు దుక్కి దున్ని విత్తనం విత్తిన నుంచి పంట దిగుబడి దాకా ఎకరానికి 50వేల నుంచి 70 వేల దాకా పెట్టుబడి అవుతున్నది. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉన్నా.. వాతావరణ పరిస్థితులతో 15 నుంచి 20 క్వింటాళ్లే వస్తున్నది. అయితే ఈ సారి ధరలు పెరగడం రైతులకు కలిసివస్తున్నది.
పసుపు మార్కెట్కు నిజామాబాద్ తర్వాత మెట్పల్లి ప్రసిద్ధి. ఇప్పుడిప్పుడే పంట ఉత్పత్తి చేతికి వస్తున్నది. రెండ్రోజుల క్రితమే మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో పసుపు క్రయ, విక్రయాలు మొదలయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో గరిష్ఠంగా క్వింటాల్కు 12 వేలకు పైనే ధరలు పలుకుతున్నాయి. ఐదారేళ్ల తర్వాత ఈధర వస్తుండడంతో రైతుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి దిగుబడి కాస్త తగ్గినా.. ఆశించిన ధరలతో తమకు ప్రయోజనం చేకూరుతున్నదని చెబుతున్నారు. పసుపు పంట చేతికి రావడంతో తవ్వకాలు మొదలు పెట్టి, (కొమ్ము, మండ)ను మార్కెట్కు తరలిస్తున్నారు.
పసుపు కొనుగోలు చేసిన వెంటనే రైతుకు డబ్బులు చెల్లించాలి. కానీ, వ్యాపారులు రైతుకు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా నెల గడువు పెడుతున్నారు. విక్రయించిన వెంటనే డబ్బులు ఇస్తే పంట సాగు కోసం తెచ్చిన అప్పులు, ఇతరత్రా అవసరాలకు వినియోగించుకుంటారు. అయితే వ్యాపారులు విధించిన గడువుదాకా ఆగలేక వెంటనే డబ్బులు కావాలని రైతు అడిగితే మాత్రం అదే అదనుగా 2 శాతం క్యాష్ కటింగ్ చేస్తున్నారు. ఈ దోపిడీతో తాము నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.
ఆరు నెలల కిందట నిజామాబాద్ బహిరంగ సభా వేదికగా ప్రధాని మోదీ స్వయంగా పసుపు బోర్డు ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, అందుకుపసుపు బోర్డు తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేస్తామనేది స్పష్టత లేదు. మరో వైపు ఆరు నెలలు గడిచిన ఇప్పటికీ పసుపు ఏర్పాటుపై ఎలాంటి కదలిక లేదు. రైతులకు ప్రయోజనం చేకూరిందీ లేదు.
ఈ సారి మంచి ధర మంచిగున్నది. కానీ, దిగుబడి సరిగా లేదు. మేం రెండెకరాల్లో పసుపు వేసినం. గతేడాది 60 డ్రమ్ములు ఎల్లింది. ఇప్పుడు 35 డ్రమ్ములే వచ్చింది. ఎకరానికి 70వేల నుంచి 80వేలు పెట్టుబడి అయితది. కొన్నేండ్ల సంది పసుపు ధరలు బాగా లేవు. ఇప్పుడు క్వింటాల్కు 12 వేల నుంచి 13 వేలు అంటున్రు. దిగుబడి పడిపోయినా ధర మంచిగానే ఉన్నది. అయితే అచ్చిన లాభం ఆడికాడికే అచ్చినట్లు ఉంది.
– క్యాతం ప్రమీల, మహిళా రైతు (యామాపూర్)
మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో రెండో రోజు గురువారం పసుపు కొనుగోలు జరిగాయి. పసుపు కాడి (కొమ్ము) క్వింటాల్కు గరిష్ఠ ధర 12,559, కనిష్ఠ ధర 4,059, పసుపు గోళ (మండ) క్వింటాల్కు గరిష్ఠ ధర 11,111, కనిష్ఠ ధర 6,565, పసుపు చూర క్వింటాల్కు గరిష్ఠంగా 10,500, కనిష్ఠంగా 9,166 ధర పలికింది. అదే విధంగా పసుపు క్రయ, విక్రయాలు ప్రారంభమైన మొదటి రోజు మార్కెట్లో 285 క్వింటాళ్లు, రెండో రోజు 203 క్వింటాళ్ల పసుపు కొనుగోలు జరిగినట్లు మార్కెట్ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి తెలిపారు.
నేను ఏటా పసుపే పండిస్త. ఎకరం 30 గుంటల్లో వేసిన. ఈ సారి ధరలు మంచిగ ఉన్నయి కానీ, ఏం లాభం లేదు. పంట దిగుబడి పోయిన ఏడాది కంటే సగం తగ్గింది. అప్పుడు 40 డ్రమ్ముల పసుపు ఎల్లితే, ఇప్పుడు 20 డ్రమ్ములే ఎల్లింది. ధర పెరిగిందని సంబురపడాలా… దిగుబడి పడిపోయిందని బాధపడాలో అర్థమైతలేదు. క్వింటాల్కు 15 వేలు పైన ఉంటేనే మేలు జరుగుతది.
– ఇట్టెడి ప్రమీల, మహిళా రైతు (యామాపూర్)