కరీంనగర్ తెలంగాణచౌక్, జనవరి10 : సంకాంత్రి సందర్భంగా టీఎస్ ఆర్టీసీ అదనపు బస్సులు నడిపించనున్నది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల పరిధిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులను తిప్పనున్నది. ఈ నెల 7 నుంచి 22వ తేదీ వరకు మొత్తం 1,395 సర్వీసులు, అందులో ప్రధానంగా హైదరాబాద్-కరీంనగర్ మార్గంలో 1,195 బస్సులను అదనంగా నడుపనున్నది.
ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా డిపో-2 మేనేజర్ మల్లయ్య, స్టేషన్ మేనేజర్ అంజయ్యకు జూబ్లీ బస్టాండ్లో, ఆర్ఎం పర్యవేక్షణలో డిప్యూటీ ఆర్ఎం భూపతిరెడ్డి, ఏటీఎం రజినీకృష్ణతోపాటు కంట్రోలర్లకు కరీంనగర్ బస్టాండ్లో విధులు కేటాయించింది. ప్రయాణికుల రద్దీ పెరుగనుండంతో బస్టాండ్ పరిసరాలు, టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నది.
కాగా, రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడుపుతామని కరీంనగర్ ఆర్ఎం సుచరిత తెలిపారు. ప్రత్యేక బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ఉన్నదని, ప్రయాణికులు కూడా అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సెలవులు ముగిసిన తర్వాత కూడా హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కోసం అదనంగా బస్సులు వేస్తామని, ప్రయాణికులకు అసౌకర్యాలు కలుగకుండా చూస్తున్నామన్నారు. ఎప్పటిలాగే పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని చెప్పారు.