తెలంగాణ చౌక్, డిసెంబర్ 16: రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు విశేష ఆదరణ వస్తున్నదని, సంస్థకు అదనపు ఆదాయం సమకూరుతున్నదని టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ రాష్ట్ర బిజినెస్ హెడ్ పీ సంతోష్కుమార్ తెలిపారు. శుక్రవారం నగరంలోని ఆర్టీసీ బస్స్టాండ్లోని జోనల్ లాజిస్టిక్ కార్యాలయం జోనల్ సీటీఎం మధుసూదన్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. 2018 జూన్లో ప్రారంభించిన కార్గో సర్వీస్ సేవలను రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో అందిస్తున్నట్లు వివరించారు. 2022 ఏప్రిల్లో లాజిస్టిక్గా పేరు మారినట్లు పేర్కొన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించడంలో ముందున్నామని, వస్తువులను లాజిస్టిక్లో బుకింగ్ చేసినప్పటి నుంచి డెలివరీ దాకా ఆన్లైన్ ట్రాకింగ్ ద్వారా స మాచారం అందిస్తున్నామని వివరించారు.
ప్రైవేట్ లాజిస్టిక్ కంపెనీలు కూడా తమ వస్తువులను ఆర్టీసీ లాజిస్టిక్లో పంపిస్తున్నాయని చెప్పారు. త్వరలో హోం డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.56 కోట్లు, కరీంనగర్ జోనల్లో రూ.13 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఇంకా లాజిస్టిక్లో ఎక్స్ప్రెస్ సర్వీసు ప్రారంభించే ఆలోచన ఉందన్నారు. జోనల్ సీటీఎం మధుసూదన్తో కలిసి బస్స్టాండ్లోని లాజిస్టిక్ సర్వీస్ కౌంటర్లు పరిశీలించి, సేవలను అడిగి తెలుసుకున్నారు.