కరీంనగర్ రూరల్, అక్టోబర్ 31: టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు మృతి పార్టీకి తీరని లోటని మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ మండలం చేగుర్తికి చెందిన (55) బల్మూరి సోమవారం ఉదయం కరీంనగర్లోని తన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలిసిన మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, మేయర్ సునీల్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చేగుర్తిలో అంత్యక్రియలు నిర్వహించగా, పార్టీ నాయకులతో కలిసి వెళ్లారు. బల్మూరి మృతదేహంపై పుష్పగుచ్ఛాలు పెట్టి నివాళులర్పించారు. బల్మూరి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన మృతి టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు తీరని లోటని తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ముందుకు నడిపించారని గుర్తు చేసుకు న్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అనంతరం ఆనందరావు కొడుకులు అభిజిత్రావును, అర్షిత్ రావులను, సతీమణి భాగ్యలక్ష్మిని పరామర్శించారు. ఆయన చేసిన సేవలు, మరువలేవని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరారు.
మునుగోడుకు వెళ్లేందుకు సిద్ధమవుతూ హఠాన్మరణం..
కరీంనగర్లోని రాయల్ అపార్ట్మెంట్లో ఉంటున్న ఆనందరావు సోమవారం మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం చేగుర్తిలో పలువురు నాయకులతో మాట్లాడారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 5.45 గంటలకు నిద్రలేచిన ఆనందరావు, 6 గంటలకు ఇంట్లో వాష్రూమ్కు వెళ్లి హఠాత్తుగా పడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే దవాఖానకు తరలించేలోపే మృతిచెందారు. గ్రామస్తులు, నాయకులు చేగుర్తికి మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు ని ర్వహించారు. పెద్ద సంఖ్యలో నాయకులు, అభిమానులు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. బల్మూరి అంతక్రియలకు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు, జిల్లా అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్లాల్, ఆర్డీఓ ఆనందరావు, జడ్పీటీసీ పురుమల్ల లలిత, తహసీల్దార్ నల్ల వెంకట్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆనిల్కుమార్, కార్పొరేటర్లు వాల రమణారావు, బండారి వే ణు, నాయకులు చీటీ రామారావు, కాశెట్టి శ్రీనివాస్, మాజీ సింగిల్ విండో చైర్మన్ మందరాజమల్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, సర్పంచ్లు జ క్కం నర్సయ్య, చామనపల్లి అరుణ, ఉపసర్పంచ్లు గాండ్ల విజయ, సంపత్రావు, ముత్యం శం కర్ గౌడ్, సర్వర్పాషా, నరేందర్ పాల్గొన్నారు.
మంచి సన్నిహితుడిని కోల్పోయాం..
అఖిల భారత వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు గుండెపోటుతో మృతిచెందడం చాలా బాధాకరం. మంచి సన్నిహితుడిని కోల్పోయాం. పలుసార్లు అఖిల భారత వెలమ సంఘం కార్యవర్గ సభ్యుడిగా సంక్షేమ సంఘానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి. సింగిల్ విండో డైరెక్టర్గా, సర్పంచ్గా, దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్గా విశేష సేవలందించారు. అతి తక్కువ సమయంలోనే ప్రజా నాయకుడిగా పేరుతెచ్చుకున్న గొప్ప వ్యక్తి ఆయన.
– పాపారావు, అఖిల భారత వెలమ సంఘం అధ్యక్షుడు.