కమాన్చౌరస్తా, జనవరి 27: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఊరు-మన బడి, ఉపాధ్యాయుల బదిలీలు అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలతో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో చేపట్టాలని సూచించారు. ప్రతి జిల్లాలో ఉపాధ్యాయులు సీనియార్టీ, ఖాళీల జాబితా ఆన్లైన్లో ప్రదర్శించాలని, అందులో అభ్యంతరాలను ఉపాధ్యాయుల నుంచి స్వీకరించాలన్నారు. జిల్లాలో ఉపాధ్యాయుల కోసం తాతాలికంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మన ఊరు-మనబడి కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించారని, మోడల్ పాఠశాలలను త్వరలో ప్రారంభిస్తామని, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కోసం సీనియార్టీ, ఖాళీల జాబితా సమర్పించామని, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన 30 మోడల్ పాఠశాలల్లో పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ, డైరెక్టర్ దేవాసేన, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా విద్యాశాఖ అధికారి సీహెచ్ జనార్దన్ రావు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.