గంగాధర, మార్చి 7: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తోన్న హాత్ సే హాత్ జోడో యాత్ర.. బడా జూటా యాత్ర అని, ఆయన బస్సులో పాదయాత్ర చేస్తున్నాడని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. మంగళవారం గంగాధర మండలం మధురానగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రేవంత్రెడ్డి పార్టీలు మారుతూ కోట్లాది రూపాయలు కూడబెట్టిన సంగతి ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ చంద్రబాబు నాయుడికి తొత్తుగా పని చేస్తున్నాడని మండిపడ్డారు. నాడు బలి దేవత అని విమర్శించిన రేవంత్రెడ్డికి.. సోనియాగాంధీ నేడు దేవత ఎైట్లెందో చెప్పాలని ప్రశ్నించారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో చొప్పదండి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి పాలనలో కొండగట్టు దేవాలయ అభివృద్ధికి ఒక్క పైసా కేటాయించారా? అని ప్రశ్నించారు.
కొండగట్టు బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటు, క్షతగాత్రులకు రూ.3 లక్షలు ఇచ్చి ఆదుకున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఏనాడైనా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వారి కుటుంబాలను పరామర్శించారా? అని ప్రశ్నించారు. వారిని పరామర్శిస్తే నిజాలు తెలిసేవన్నారు.
తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటైనా నిజమని ఆధారాలతో నిరూపిస్తే మధురానగర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఇక్కడ ఎంపీపీలు పర్లపెల్లి ప్రసాద్, చిలుక రవీందర్, ఏఎంసీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలగౌడ్, వెలిచాల తిర్మల్రావు, మెన్నేని రాజనర్సింగరావు, కొండగట్టు డైరెక్టర్ పుల్కం నర్సయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, పులి వెంకటేశ్గౌడ్, కత్తెరపాక కొండయ్య, గంట్ల జితేందర్రెడ్డి, వెల్మ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, సర్పంచులు పునుగోటి కృష్ణారావు, కంకణాల విజేందర్రెడ్డి, వేముల దామోదర్, బద్దం తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, నాయకులు వేముల అంజి, రామిడి సురేందర్, రేండ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.