పెద్లపల్లి జిల్లా ప్రజలకు మినీ ట్యాంక్బండ్ ఆహ్లాదాన్ని పంచనున్నది. పట్టణంలోని సాగర్రోడ్డులో గల ఎల్లమ్మ గుండమ్మ చెరువు స్థానికులను ఆకట్టుకునేలా సొబగులు అద్దుకుంటున్నది. చెరువు కట్టపై ఏర్పాటు చేసిన అందమైన మొక్కలు, ఎల్ఈడీ లైట్లు, ప్రత్యేక స్వాగత తోరణాలు, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ పట్టణ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఎనిమల్ కల్చర్, డెకరేటివ్ లైట్స్, ఆర్చస్, ఆర్టిస్టిక్ సీటింగ్, మినీ ట్యాంక్బండ్పై టీ, కాఫీ, స్నాక్స్, పిలల్లకు సంబంధించిన తినుబండారాల స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి. అలాగే పర్యాటక శాఖ ద్వారా బోటింగ్ సైతం అందుబాటులోకి రానున్నది. మినీ ట్యాంక్ బండ్కి ఒక్కసారి వస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా కుటుంబంతో సహా ఇక్కడే సరదాగా గడిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పెద్దపల్లి, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలోని సాగర్ రోడ్డులో గల ఎల్లమ్మ గుండమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ ఆహ్లాదానికి కేరాఫ్ అడ్రస్గా మారనున్నది. పూర్తిగా పూడికతో నిండిపోయిన ఈ చెరువును పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి మిషన్ కాకతీయ ఫేజ్-2లో భాగంగా పునరుద్ధరణ పనులు చేపట్టారు. వాటర్ బౌల్గా తీర్చిదిద్దిన ఈ చెరువు జిల్లా కేంద్ర ప్రజలకు ఆహ్లాదం పంచేలా మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దనున్నారు. పర్యాటక శాఖ ద్వారా బోటింగ్కు సైతం ఏర్పాట్లు చేస్తుండడంతో పెద్దపల్లి సిగలో టూరిజం నగ వచ్చి చేరినట్లయింది. త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
మిషన్ కాకతీయతో అభివృద్ధి
సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి ఒక మినీ ట్యాంక్ బండ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఎల్లమ్మ గుండమ్మ చెరువును ఎంపిక చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం నడిబొడ్డున 120ఎకరాల 28 గుంటల విస్తీర్ణంలో ఉన్న ఎల్లమ్మగుండమ్మ చెరువును మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దారు. మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి నిరంతర పర్యవేక్షణలో మిషన్ కాకతీయ ఫేస్-2లో భాగంగా 6కోట్ల నిధులతో చెరువు పూడికతీత పనులు చేపట్టారు. చెరువు కట్టను విస్తరించి బయటి వైపు రిటైనింగ్ వాల్, లోపలి వైపు బండ్ రివిట్మెంట్ చేశారు. చూట్రెన్స్, డౌన్ స్ట్రీమ్, గ్రాస్, కట్టకు ఇరువైపులా రేలింగ్ పనులు పూర్తి చేశారు. దీంతో చెరువు విశాలంగా మారింది. చెరువులో బోటింగ్ కూడా ఏర్పాటు చేయనున్నారు.
అలాగే మున్సిపల్ నిధులతో చెరువు కట్టపై 1.8కిలో మీటర్ల వరకు రోడ్డు నిర్మించి ప్రత్యేకంగా మొక్కలను నాటారు. కట్టపై ప్రత్యేకమైన ఎల్ఈడీ లైట్లను బిగించి అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మినీ ట్యాంక్ బండ్పైకి వెళ్లేందుకు మూడు వైపులా దారులు ఉండడంతో వాటిని ప్రత్యేక స్వాగత తోరణాలుగా ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దుతున్నారు. అదే విధంగా ఉదయం, సాయంత్రం స్థానికులు వాకింగ్ చేసుకునేందుకు వీలుగా ట్రాక్ను నిర్మించారు. ఫుట్పాత్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కట్టపై వ్యాయామం కోసం ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేశారు. ఔట్డోర్ చిల్డ్రన్స్ ప్లే మెటీరియల్ను త్వరలో బిగించనున్నారు. ఎనిమల్ కల్చర్ను డెకరేటివ్ లైట్స్ను, ఆర్చిస్ను, ఆర్టిస్టిక్ సీటింగ్, మినీ ట్యాంక్ బండ్పై టీ, కాఫీ, స్నాక్స్, పిలల్లకు సంబంధించిన తినుబండారాలను అందుబాటులో ఉంచే విధంగా స్టాళ్లు, టాయిలెట్స్ ఏర్పాటు చేయనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పిల్లా పాపలతో ఇక్కడే సరదాగా గడిపే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అందుబాటులోకి టూరిజం బోట్లు
120 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎల్లమ్మ గుండమ్మ చెరువును చుట్టి వచ్చే విధంగా మున్సిపాలిటీ, రాష్ట్ర టూరిజం శాఖ సమన్వయంతో బోటింగ్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. 20 మంది పర్యాటకులు కూర్చునే సామర్థ్యం ఉన్న ఒక ప్యాసింజర్ స్పీడ్ బోట్, నలుగురు కూర్చునే సామర్థ్యం ఉన్న స్పీడ్ బోట్, ఇద్దరు పర్యాటకులు కలిసి బోటింగ్ చేసే సామర్థ్యం ఉన్న రెండు పెడల్ బోట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. పర్యాటకులకు చుక్క నీరు కూడా తగుల కుండా బోట్ ఎక్కడానికి వీలుగా జెట్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మినీ ట్యాంక్బండ్కు పర్యాటక శాఖ నుంచి 20 మంది ప్రయాణించే సామర్థ్యం కలిగిన స్పీడ్ బోట్ను అందుబాటులో ఉంచి, ట్రయల్ రన్ను నిర్వహించారు. బోట్లో ప్రయాణం చేసే వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు లైఫ్ జాకెట్లను సైతం తెప్పించారు.
సెల్ఫీ స్పాట్గా మినీ ట్యాంక్ బండ్
పెద్దపల్లి మినీ ట్యాంక్బండ్పై రూ.కోటితో లేజర్ షోను, వీకెండ్ మస్తీ నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. చుట్టూ పచ్చని మొక్కలు, గడ్డి మధ్యలో నీళ్లు, గ్రిల్స్, అందమైన ఎల్ఈడీ బల్బుల కాంతిలో తళుక్కుమనేలా వస్తున్న ఫొటోలను చూసి పర్యాటకులు మురిసిపోతున్నారు. ఫొటోలకు ఫోజులిచ్చే వారితో మినీ ట్యాంక్బండ్ కళకళలాడుతున్నది. త్వరలోనే సెల్ఫీ పాయింట్ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
నియోజకవర్గానికి ఆహ్లాదకర కానుక
అన్ని నియోజకవర్గాల ప్రజలు ఆహ్లాదాన్ని పొందాలనేది సీఎం కేసీఆర్ సంకల్పం. దీంతో సీఎం కేసీఆర్ పెద్దపల్లికి మినీ ట్యాంక్ బండ్ను మంజూరు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్గా రూపుదిద్దుకున్నాం. గత ప్రభుత్వాల పాలనలో ఈ చెరువు ఎలా ఉండేది. ఈ చెరువుకాడికి ఎవలన్నా వచ్చేదా..? ఒక్క బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి తప్ప ఎప్పుడూ వచ్చేవారు కాదు. ఇప్పుడు అందరూ ఆనంద పడేలా ఏర్పాట్లు చేస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ త్వరలో ప్రారంభించనున్నారు.
-దాసరి మనోహర్రెడ్డి, ఎమ్మెల్యే పెద్దపల్లి
సద్వినియోగం చేసుకునేలా..
పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లోని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఎల్లమ్మగుండమ్మ చెరువును ఎమ్మెల్యే మనోహర్రెడ్డి చొరవతో మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుకున్నాం. ఇరిగేషన్ శాఖ ద్వారా మున్సిపాల్టీ, టూరిజం శాఖ సంయుక్త ఆధ్వర్యంలో టూరిజం స్పాట్గా అభివృద్ధి చేస్తున్నాం. మున్సిపాలిటీ నుంచి బోట్లను, డెకరేటివ్ లైటింగ్స్ను, ప్లాంటేషన్, ఆర్చరీలు, ఎనిమల్స్ కల్చర్, సెల్ఫీ పాయింట్, ఆర్టిస్టిక్ సీటింగ్, టాయిలెట్స్ను ఏర్పాటు చేస్తున్నాం. పనులు తుది దశలో ఉన్నాయి. త్వరలోనే ప్రారంభిస్తాం.
-దాసరి మమతారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పెద్దపల్లి