గోదావరిఖని, డిసెంబర్ 22: సిరుల వేణి సింగరేణి.. ఊహకందని ప్రగతి సాధిస్తున్నది. సమైక్య రాష్ట్రంలో చిక్కిశల్యమైన సంస్థ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పునర్జీవం పోసుకొని రాష్ర్టానికే మణిహారంగా నిలుస్తున్నది. 49శాతం వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వం సంస్థ నుంచి వచ్చే డివిడెంట్లు, పన్నులు తీసుకుంటూ.. ఏమాత్రం సహకరించకున్నా ఏడున్నరేండ్లలోనే రెట్టించిన అభివృద్ధి సాధిస్తున్నది. కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు, లాభాల్లో వాటా, కారుణ్య నియామకాలు.. ఇలా అనేక కార్యక్రమాలతో ముందు కెళ్తూ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నది. ఇంకా రాష్ట్ర అసెంబ్లీలో సింగరేణి కార్మికులకు ఇన్కంటాక్స్ రద్దు చేయాలని తీర్మానం చేసి పంపిన అంశంపై నిర్ణయం తీసుకోలేదు. నేడు సింగరేణి సంస్థకు చెందిన 4బొగ్గు బ్లాకులను సంస్థకు చెందకుండా వేలం ద్వారా అమ్మివేసే చర్యలకు సంస్థ పూనుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది.
సంక్షోభంలోనూ కార్మికులకు బాసట..
తెలంగాణ మణిహరంగా ఉన్న సింగరేణి సంస్థ ప్రతి ఏటా అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోంది. కరోనా కష్ట కాలంలో బొగ్గు ఉత్పత్తి తగ్గిన లాభాల్లోనే ఉండడం విశేషం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 70మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ సారి రికార్డు స్థాయి బొగ్గు ఉత్పత్తి సాధించడం సాధ్యమని పేర్కొంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కేవలం 50మిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తి 70మిలియన్ టన్నులకు చేరుకోవడం విశేషం. అంతక్రితం అరకొరగా ఉన్న లాభాలు భారీగా పెరుగుతూ సంస్థ మరింత ముందుకు సాగుతున్నది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో 1766 కోట్ల లాభాలు ఆర్జించగా ఈసారి లాభాలు 2వేల కోట్లకు పైగా సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. రికార్డు బొగ్గు ఉత్పత్తి, లాభాలే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. కొవిడ్ సంక్షోభంలోనూ గడిచిన రెండేళ్లలో రెండు దఫాలుగా 2400 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేశారు. 100కు పైగా డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు కల్పించారు. కొవిడ్ సంక్షోభంలో నిలిపివేసిన 15రోజుల వేతనాన్ని తిరిగి చెల్లించడం, కొవిడ్తో అన్డ్యూటీలో ఉండి మృతి చెందిన వారికి రూ.15లక్షలు ప్రకటించారు. కొవిడ్ కారణంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును ప్రారంభించి, కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టి కార్మికుల పక్షపాతి అని నిరూపించుకున్నారు. మరోవైపు సంస్థ సీఎండీ, ఐఏఏస్ అధికారి నడిమెట్ల శ్రీధర్ సింగరేణిని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
వేగంగా విస్తరణ..
తెలంగాణ రాష్ర్టానికే ఇంత కాలం పరిమితమైన సింగరేణి ఇక ముందు ఇతర రాష్ర్టాలకు, విదేశాల్లో బొగ్గు ఉత్పత్తి చేసేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్నది. ఏటేటా 10నుంచి 20శాతం బొగ్గు ఉత్పత్తిని పెంచుకుంటూ వచ్చే కొన్ని సంవత్సరాల్లోనే 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలు రాయిని చేరుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలోనే సంస్థ విస్తరణకు అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఒడిశాలోని నైని కోల్బ్లాకును చేజిక్కించుకున్న సంస్థ మరికొద్ది నెలల్లోనే బొగ్గు ఉత్పత్తి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెండేళ్ల కింద అదే రాష్ట్రంలోనే న్యూపాత్రపాద అనే కొత్త బ్లాకును చేజిక్కించుకుంది. ఈ బ్లాక్ ద్వారా సింగరేణి సంస్థ ఏటా 10మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే అవకాశముంది. వీటన్నింటితో సింగరేణి ప్రతి ఏటా 10నుంచి 20శాతం బొగ్గు ఉత్పత్తిని పెంచుకుంటూ వచ్చే కొన్ని సంవత్సరాల్లోనే 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలు రాయిని చేరుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సింగరేణి బొగ్గుకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో సింగరేణిని విదేశాల్లో సైతం విస్తరించేందుకు సీఎండీ శ్రీధర్ ప్రణాళికలు వేస్తున్నారు. సింగరేణిలో యూనియన్లకు చెందిన నాయకులను దక్షిణాఫ్రికా, మొజాంబిక్, అస్ట్రేలియాకు పంపించి పూర్తి స్థాయి అధ్యయనం చేయిస్తూనే, ఆయనే స్వయంగా విదేశాల్లో పర్యటించి సంస్థకు అనువైన బొగ్గు బ్లాకులను దక్కించుకునే ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి 51శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49శాతం వాటాలు కలిగిన సంస్థ, విదేశాల్లో బొగ్గు బ్లాకులను కొనుగోలు చేయడం, ఇతర రాష్ర్టాలో విస్తరించడం వల్ల సింగరేణి రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో రామగుండం ఎన్టీపీసీకే 30శాతం బొగ్గును అందజేస్తున్నది. దీనికి తోడుగా టీజెన్కోకు పంపుతున్న సింగరేణి, రానున్న రోజుల్లో ఎంత ఉత్పత్తి చేసినా అందుకుతగ్గ డిమాండ్ ఉండే అవకాశాలున్నాయి. కాగా, సింగరేణి సంస్థను అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్తుంటే కేంధ్ర ప్రభుత్వం మాత్రం సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులను సంస్థకు కేటాయించకుండా వేలం ద్వారా అమ్మె ప్రయత్నం చేస్తోంది. దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థలోని కార్మిక సంఘాలు, కార్మికులు పూర్తిగా వ్యతిరేకిస్తూ 3 రోజుల పాటు సమ్మె నిర్వహించారు. భవిష్యత్ పోరాటాలకు సిద్దమవుతున్నారు.
విద్యుదుత్పత్తిలో దూకుడు..
బొగ్గు ఉత్పత్తిలోనే కాదు విద్యుత్ ఉత్పత్తిలోనూ సింగరేణి సంస్థ రాణిస్తున్నది. కొన్నేళ్ల దాకా మినీ విద్యుత్ ప్లాంట్లు మాత్రమే నెలకొల్పి సొంత అవసరాలు తీర్చుకుంటున్న సింగరేణి సంస్థ, మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి, సత్ఫలితాలు సాధిస్తున్నది. త్వరలోనే ఇక్కడ మరో 600 మెగావాట్ల యూనిట్ నెలకొల్పేందుకు అడుగులు వేస్తున్నది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి విజయవంతం కావడంతో సౌర విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఓసీపీల వద్ద సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నది. సింగరేణి వ్యాప్తంగా 500 మెగావాట్లకు పైగా సోలార్ విద్యుత్ను తయారు చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నది.
ఇదీ సింగరేణి ఆవిర్భావం..
ఖమ్మం జిల్లా సింగరేణిలో పురుడుపోసుకున్న సంస్థ 1889లో బొగ్గు ఉత్పత్తి మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదుగుతూ వస్తున్నది. 1880 నుంచి బొగ్గు అన్వేషణకు శ్రీకారం చుట్టగా, భూగర్భ శాస్త్రవేత్త విలియం కింగ్ చొరవతో ఈ అపార బొగ్గు నిక్షేపాల సంగతి బయటి ప్రపంచానికి తెలిసింది. మొదట ఆంగ్లేయుల ఆధీనంలో నడిచిన సంస్థ, ఆ తర్వాత నిజాం నవాబుల ఆధీనంలోకి వచ్చింది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ అధిపతిగా ఉంటూ సింగరేణిని ముందుకు తీసుకెళ్లారు. 1920 డిసెంబర్ 23 నుంచి హైదరాబాద్ సంస్థానం ఈ సంస్థను స్వాధీనం చేసుకొని, కార్యకలాపాలు మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఈ సంస్థ అంచెలంచెలుగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ముందుకు సాగింది. 1992 నుంచి 1996 మధ్య కాలంలో బీఐఎఫ్ఆర్ అంచుల దాకా వెళ్లి వచ్చిన సింగరేణి ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి వెనుతిరిగి చూడకుండా లాభాలు ఆర్జిస్తూ ముందుకు సాగుతున్నది. అప్పటి నుంచి లాభాల్లో వాటాను భారీగా పెంచి ఇస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 29శాతానికి పెంచి అందిస్తున్నారు.