నేదునూరు.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రానికి దూరంగా ఉన్నా సుపరిచితమైన గ్రామం. ఈ గ్రామంతో పాటు దీని పరిధిలో ఉన్న గోసంగిపల్లె వాసులు నాడు రెండు సార్లు భూములను త్యాగం చేశారు. కానీ, ఆనాటి ప్రభుత్వాలు అరకొర పరిహారమే అందించడంతో నిర్వాసితులు అరిగోస పడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పందించి ఇండ్ల పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు 63 మందికి ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడంతోపాటు త్వరలో వీరిలో అర్హులకు గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3 లక్షల ఆర్థికసాయం అందజేయనున్నారు.
-తిమ్మాపూర్, జూలై31
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నేదునూరు గ్రామంతో పాటు దీని పరిధిలోని గోసంగిపల్లె మొదట లోయర్ మానేరు డ్యాం నిర్మాణంతో కొంత ముంపునకు గురైంది. ఆ తర్వాత రిజర్వాయర్ వద్ద పవర్ ప్లాంట్ ఏర్పాటుకు స్థల సేకరణ చేయడంతో మరోసారి ఆ గ్రామస్తులు వారి భూములను ప్రజావసరాల కోసం త్యాగం చేశారు. అయితే, ఆనాటి ప్రభుత్వాలు ఇచ్చిన అరకొర పరిహారంతో కొందరు పక్కనే ఇండ్లను నిర్మించుకుని నివాసం ఉంటుండగా, మరికొందరు మాత్రం ఆ పరిహారంతో మరెక్కడా భూములు, ఇండ్లు కొనుక్కోలేక ముంపు ప్రాంతంలోని గోసంగిపల్లెలో గోస పడుతూ నివాసం ఉంటున్నారు. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా వారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ, వారి గోసను స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన గత వాన కాలంలో అప్పటి కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి గ్రామంలో పర్యటించి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. వారి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. గోసంగిపల్లె వాసులు 25 మందితోపాటు గ్రామంలోని మరి కొందరు ఇండ్లు లేనివారితో కలిపి 63 మందికి ఇండ్ల స్థలాలను మంజూరు చేశారు. కాగా, మంగళవారం వీరికి పట్టాలు పంపిణీ చేయడంతో పాటు గ్రామంలో సర్పంచ్ వడ్లూరి శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
నేదునూరు గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే పట్టాలు పంపిణీ చేయనుండగా, అర్హులకు త్వరలోనే గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలను ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం సాయం చేయనున్నది. దీంతో పట్టాలు అందుకోనున్న గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ తమను ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే రసమయి తమ సమస్యలను అర్థం చేసుకుని, పరిష్కరిస్తున్నారని సంతోషపడుతున్నారు.
మాది నిర్వాసిత గ్రామం. చాలా మందికి ఇండ్లు లేకపోవడంతోపాటు కొందరు గోసంగిపల్లెలోని అప్పటి పాత ఇండ్లల్లోనే కాలం గడుపుతుండడం నా చిన్నప్పటి నుంచీ చూస్తున్న. వారి పరిస్థితి చూసి ఎమ్మెల్యే రసమయి దృష్టికి తీసుకెళ్లగానే అధికారులతో కలిసి పర్యటించి వారికి పక్కా ఇండ్ల స్థలాలతో పాటు గృహలక్ష్మి పథకం వర్తించేలా కృషి చేస్తానని మాటిచ్చారు. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే రసమయన్న అందజేయడం సంతోషంగా ఉంది.
– వడ్లూరి శంకర్, సర్పంచ్(నేదునూర్)
వానకాలం వచ్చిందంటే చాలు గోసంగిపల్లె వాసులు ఎంతగానో ఇబ్బంది పడుతుండేది. సమస్య నా దృష్టికి వచ్చిన నాడే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామంలో పర్యటించా. ఏడాదిలోపు వారికి పక్కా ఇండ్లు నిర్మించుకునేందుకు పట్టాల పంపిణీ చేస్తానని హామీ ఇచ్చా. అలాగే, గ్రామంలో ఇండ్లు లేనివారికి స్థలాలు మంజూరు చేయించా. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోపు పట్టాలను పంపిణీ చేస్తున్నా.
– రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే