ముకరంపుర, మే 13: వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించేందుకు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే రైతుల ఆకలి తీర్చేందుకు పాలకవర్గం వరుసగా రెండో సీజన్లోనూ ‘ఉచిత మధ్యాహ్న భోజనం’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. కాగా, ఈ సీజన్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సొంత ఖర్చుతో నిర్వహిస్తుండగా, శనివారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి రైతులకు ‘ఉచిత మధ్యాహ్న భోజనం’ కార్యక్రమాన్ని ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు, మేయర్ వై సునీల్రావు, డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతులకు స్వయంగా భోజనం వడ్డించారు. మార్కెట్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధాన్యం అమ్మేందుకు పలు గ్రామాల నుంచి మార్కెట్కు వస్తున్న రైతులకు మధ్యాహ్నం సమయంలో రుచికరమైన భోజనం పెట్టి వారి ఆకలి తీరుస్తున్న పాలకవర్గాన్ని మంత్రి అభినందించారు. ఏఎంసీ ఛైర్మన్ రెడ్డవేని మధు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ మార్కెట్ కమిటీలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఈ యాసంగి సీజన్లో మంత్రి గంగుల సొంత ఖర్చుతో రైతులకు భోజనం అందిస్తున్నారని వివరించారు.
యార్డుకు ధాన్యం తీసుకువచ్చిన రైతులెవరూ ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఏఎంసీ ఆధ్వర్యంలో వానకాలం సీజన్ నుంచి ఉచిత మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అంతకుముందు రెన్యువల్ చేసిన లైసెన్సులను మంత్రి చేతుల మీదుగా 8 మంది కూరగాయల వ్యాపారులకు అందించారు. ఇక్కడ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్గౌడ్, కరీంనగర్ రూరల్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, డైరెక్టర్లు కర్నాటి చలమయ్య, పబ్బతి రంగారెడ్డి, గుంటి రాజమల్లు, సోమిరెడ్డి లక్ష్మారెడ్డి, గోలి మల్లయ్య, గంగాధర లస్మయ్య, గుండేటి అనిత, చంద్రపల్కల అంజయ్య, బోనాల జనార్దన్, మహ్మద్ మహముద్పాషా, విజయ్కుమార్ ముందడా, శివనాథుని వెంకటేశ్వర్లు, డీఎంవో పద్మావతి, మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పురుషోత్తం పాల్గొన్నారు.