‘బండి సంజయ్కు మతిభ్రమించింది. పదవిలో ఉన్నా అని ఏది పడితే అది మాట్లాడుతున్నడు. మేం పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో బీజేపీకి నీవు అధ్యక్షుడిగా కొనసాగుతున్నవ్. అసలు నీవు ఉద్యమంలో ఉన్నవా..? రాష్ట్రం కోసం ఒక్కరోజైనా కొట్లాడినవా..? తెలంగాణ ఉద్యోగులు అమ్ముడుపోయారని అంటవా..? నీకెంత ధైర్యం.’ అంటూ బండి సంజయ్పై ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కలెక్టరేట్, టీఎన్జీవో, ఇతర కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బండి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కొత్తపల్లి, అక్టోబర్ 31: ఉద్యోగ సంఘ నాయకులు, టీఎన్జీవో నేతలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఉద్యోగులకు సిగ్గులేదు.. అధికార పార్టీకి అమ్ముడుపోయారు. పైరవీలు, పదోన్నతుల కోసం పాకులాడేవాళ్లంటూ’ సంజయ్ మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్, టీఎన్జీవో, ఇతర కార్యాలయ ఎదుట ఉద్యోగులు, సిబ్బంది మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కరీంనగర్ టీఎన్జీవో భవన్లో ప్రత్యేకంగా సమావేశమై బండి సంజయ్ మాటలను ఖండించారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు వేరు అనే భావన నుంచి రాజకీయ నాయకులు ఇప్పటికైనా బయటికి రావాలని హితవుపలికారు.
రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం ఉద్యోగ సంఘ నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక సహించేంది లేదన్నారు. జగిత్యాల నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బోగ శశిధర్తో కలిసి ఉద్యోగులు నిరసన తెలిపారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ ఎదుట టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్తో కలిసి ఉద్యోగులు, నాయకులు నిరసన తెలిపారు. సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎలుసాని ప్రవీణ్తో కలిసి ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆయాచోట్ల ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఒకరోజు కూడా కంటికి కనబడని వ్యక్తి తాము ఉద్యమించి సాధించుకున్న రాష్ట్రానికి ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని, అలాంటి వ్యక్తి ఇలాంటి అర్థరహితమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారని, ఒక అధ్యక్షుడిగా కొనసాగే అర్హత లేదన్నారు. ఉద్యోగ సంఘాలు కండ్లు ఎర్రజేస్తే సంజయ్ తెలంగాణలో అడ్రస్సు లేకుండా పోతాడని, ఖబర్దార్ బండి సంజయ్ అని హెచ్చరించారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల టౌన్: కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న ఉద్యోగులు
ఊరుకునేది లేదు
ఉద్యోగులమంతా తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగకుండా ఉద్యమించినం. విధులను పక్కన పెట్టి రాష్ట్రం సాధించుకున్నం. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వంతో స్నేహపూరితంగా వ్యవహరిస్తూ ఉద్యోగుల సంక్షేమంతోపాటు సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో కృషి చేస్తున్నది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నది. కానీ, బండి సంజయ్ ఉద్యోగ సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇప్పటికైనా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి.
– బొంకూరి శంకర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు,
ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ (పెద్దపల్లి)
ఆరోపణలను ఖండిస్తున్నాం
టీఎన్జీవోస్ సంఘం ప్రభుత్వానికి అమ్ముడుపోయిందంటూ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. భేషరతుగా టీఎన్జీవోస్కు క్షమాపణ చెప్పి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 42 రోజుల పాటు సకల జనుల సమ్మె విజయవంతంలో టీఎన్జీవోస్ కీలకంగా పనిచేసిన విషయం గుర్తుంచుకోవాలి. 75 ఏండ్ల చరిత్ర గల టీఎన్జీవోస్, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి అమ్ముడు పోయారని మాట్లాడడం విడ్డూరంగా ఉంది. టీఎన్జీవోస్ తెలంగాణ ఉద్యమంలో పని చేసినప్పుడు బండి సంజయ్ ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. వెంటనే ఆయన ఆరోపణలను ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో ఆందోళనలు కొనసాగుతాయి.
– ఎలుసాని ప్రవీణ్కుమార్,
టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు (రాజన్నసిరిసిల్ల)
భాషా విధానం మార్చుకోవాలి
బండి సంజయ్.. మొదట మీ భాషా విధానాన్ని మార్చుకోండి. తెలంగాణ ఎన్జీవోల సంఘం నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉద్యోగుల మనోభావాలను దెబ్బ తీశాయి. 76 ఏండ్లుగా ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి అహర్నిషలు పని చేస్తున్న టీఎన్జీవోల సంఘంపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలి. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడటం సరికాదు. ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ఉద్యోగులకు, టీఎన్జీవోస్ సంఘం నాయకులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో అందోళనలు ఉధృతం చేస్తాం.
– రాజనరేందర్, టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, (పెద్దపల్లి)
క్షమాపణ చెప్పాల్సిందే
ప్రభుత్వం, ప్రభుత్వోద్యోగులు వేరు అనేలా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను టీఎన్జీవో తరఫున తీవ్రంగా ఖండిస్తున్న. ఇలాంటి వ్యాఖ్యలు ఇకనైనా మానుకుంటే మంచిది. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు, టీఎన్జీవో నేతలు ఏ పార్టీకైనా అనుకూలంగా, వ్యతిరేకంగా ఉండరు. ఉద్యోగుల హక్కులు, ఇతర డిమాండ్లను తీర్చే క్రమంలో ప్రభుత్వానికి, ప్రభుత్వోద్యోగులకు మధ్య సంధానకర్తగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారితో కలిసి పనిచేస్తం. కానీ, సంజయ్ మునుగోడు ఉపఎన్నికల్లో లబ్ధి కోసం ఉద్యోగసంఘ నాయకులను, ఉద్యోగులను, టీఎన్జీవోలను కించపరిచేలా మాట్లాడడం సరికాదు. బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాల్సిందే.
– మారం జగదీశ్వర్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు (కరీంనగర్)
ఉద్యమంలో అందరితో కలిసి పనిచేశాం
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగులుగా క్రియాశీల పాత్ర పోషించాం. అన్ని పార్టీలతో కలిసి ఉద్యమించడమే కాకుండా ఉద్యమంలో ఉద్యోగులందరినీ భాగస్వామ్యం చేయడంలో జేఏసీ పక్షాన టీఎన్జీవో సంఘం తరఫున విశేషంగా కృషిచేశాం. రాష్ట్రం సాధించిన తర్వాత బంగారు తెలంగాణ సాధనకు మావంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఎవరో ఒక నాయకుడు తప్పుగా మాట్లాడితే ఆయనను నిందించాలేగానీ మొత్తం ఉద్యోగులను, టీఎన్జీవోల సంఘాన్ని, నాయకులందరిపై బురదజల్లేలా బండి సంజయ్ మాట్లాడిన మాటలు తీవ్ర మనస్థాపనకు గురిచేశాయి. ఉద్యోగ సంఘ నాయకులపై కించపరిచేలా, ఆత్మైస్థెర్యం దెబ్బతీసేలా మాట్లాడితే ఇక సహించేది లేదు.
– దారం శ్రీనివాస్రెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి, కరీంనగర్
క్షమాపణ చెప్పాల్సిందే
బండి సంజయ్ ఉద్యమంలో ఎక్కడున్నడు? రాష్ట్రం కోసం ఒక్క రోజైనా కొట్లాడిండా..? 42 రోజులు సకల జనుల సమ్మె చేస్తే ఏ రోజైనా కంటికి కనిపించిండా..? ఉద్యోగులంతా రాష్ట్రం కోసం పోరాడినం. రోడ్లపైకి వచ్చి కొట్లాడినం. తెలంగాణ సాధించుకున్నం. ఇప్పుడేమో సంజయ్ తెలంగాణ ఉద్యోగ సంఘాలు అమ్ముడు పోయాయని మాట్లాడుతున్నడు. ఆయనే చెప్పాలె. ఎవరికి అమ్ముడు పోయినయో? ఎవరు కొన్నరో? నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతున్నడు. ఉద్యోగుల సంక్షేమం, వారి సమస్యల పరిషారం కోసం ఉద్యోగ సంఘాలు పని చేస్తున్న విషయం ఆయనకు తెల్వదా? ఉద్యోగులను కించపర్చిన ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఊరుకునేది లేదు. రాబోయే రోజుల్లో టీఎన్జీవో తరఫున గుణపాఠం చెబుతం.
– ముజాహిద్హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
అవమానించడం సరికాదు
ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడానికి ఉద్యోగులు చేస్తున్న కృషిని గుర్తించకపోగా అనుచిత వ్యాఖ్యలతో దూషించడం సరికాదు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఉద్యోగులు తమ విధులను నిర్వర్తిస్తారే కానీ పార్టీలకు సేవచేయరు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేషరతుగా ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి.
– బోగ శశిధర్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు (జగిత్యాల)
ప్రమోషన్ల కోసం ఎవరూ విధులు నిర్వర్తించరు
ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన ఏ ఉద్యోగి కూడా తొందరగా ప్రమోషన్లు రావాలని కోరుకోరు. వారి సీనియార్టీని బట్టి ప్రమోషన్లు వస్తయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగులు సకలజనుల సమ్మె, పెన్డౌన్, వంటా వార్పు, రైల్రోకో వంటి ఎన్నో కార్యక్రమాలు చేసినం. అలాంటి ఉద్యోగులను తప్పుపట్టి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు.
– నాగేందర్రెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి
(జగిత్యాల)