శంకరపట్నం, మే 20 : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఐదు నిమిషాలకే టిప్పర్ ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. శంకరపట్నం మండల తాడికల్లో సోమవారం ఘటన జరుగగా, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, మానకొండూర్కు చెందిన పర్వతం ఎల్లయ్య(51) శంకరపట్నం మండలం తాడికల్కు చెందిన తన కూతురు ఊర పద్మ ఇంట్లో రెండు నెలలుగా ఉంటూ చిరు వ్యాపారాలు చేసుకుంటున్నాడు.
సోమవారం వ్యక్తిగత పనిపై బయటికి వెళ్లగా, తాడికల్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వద్దకు రాగానే జాతీయ రహదారి 563 నిర్మాణ సంస్థ బుల్డ్కాన్ కు చెందిన ఓ టిప్పర్ హుజూరాబాద్ వైపు వెళ్తూ వెనుక నుంచి వేగంగా వ చ్చి ఢీకొంది. టిప్పర్ టైర్లు ఎల్లయ్యపై వెళ్లగా తల పగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఛత్తీస్గఢ్కు చెందిన టిప్పర్ డ్రైవర్ సునీల్రాం పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
కాగా, సమాచారం తెలుసుకున్న ఎల్లయ్య కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ట్రాఫిక్ నిలిచిపోగా, హుజురాబాద్ టౌన్ సీఐ రమేశ్, సైదాపూర్ ఎస్ఐ ఆరోగ్యం, అదనపు సిబ్బంది అక్కడకు చేరుకుని, న్యాయం జరిగేలా చూ స్తామని వారికి నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. మృతుడి కి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. ఎల్లయ్య కొడుకు నరేశ్ ఫిర్యాదు మేరకు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు.