మానకొండూర్, ఫిబ్రవరి 11: వ్యవసాయ బావుల వద్ద కరెంట్ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లలో రాగి తీగను దొంగిలిస్తున్న అంతర్ జిల్లా ముఠా మానకొండూర్ పోలీసులకు చిక్కింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రాజ్కుమార్ వివరాలు వెల్లడించారు. మండలంలోని గట్టుదుద్దెనపల్లి శివారులో ఈ నెల 10న ఓ ట్రాన్స్ఫార్మర్లోని 41 కిలోల రాగి తీగను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు చెంజర్ల సబ్స్టేషన్ ఏఈ రమేశ్ మానకొండూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శనివారం సాయంత్రం మానకొండూర్ చెరువుకట్ట వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా, కరీంనగర్ వైపు వెళ్తున్న కారు (టీఎస్ 21 డీ 7715)లో ఇద్దరు వ్యక్తులు, కారు వెనుకాలే ద్విచక్ర వాహనంపై వస్తున్న ఒకరు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని స్టేషన్కు తరలించి విచారించారు. విచారణలో మానకొండూర్కు చెందిన కోండ్ర ప్రణీందర్ అలియాస్ ప్రన్వి, కరీంనగర్లోని సుభాష్నగర్కు చెందిన నెరువట్ల వెంకటేశ్, నెరువట్ల అజయ్, రాంనగర్కు చెందిన పార్వతం సతీశ్ ముఠాగా ఏర్పడి వివిధ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు.
వీరు దొంగిలించిన రాగి తీగ, ఇతర సామగ్రిని మానకొండూర్లోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన సిరిగిరి వెంకటమ్మ, కరీంనగర్లోని అలకాపురి కాలనీకి చెందిన టేకు మల్లేశం, కోతిరాంపూర్కు చెందిన లోకిని మల్లేశంకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. వీరిపై కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాల్లోని ఆయా పోలీస్స్టేషన్లలో 27 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులు కోండ్ర ప్రణిందర్, నెరువెట్ల వెంకటేశ్, పార్వతం సతీశ్ నుంచి కారు, ద్విచక్ర వాహనం, ఇన్వర్టర్, టేబుల్, టేబుల్ ఫ్యాన్, 10 కిలోల రాగి వైర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు నిందితులతో పాటు దొంగిలించిన రాగి, ఇతర సామగ్రిని కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ముగ్గురు నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలించగా, మిగతా నలుగురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అంతర్జిల్లా దొంగలను పట్టుకున్న సీఐ రాజ్ కుమార్, సిబ్బందిని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.