లోక్సభ ముందస్తు ఎన్నికలకు కేంద్రం అడుగులు వేస్తున్నదా..? అందు కోసం అంతా సిద్ధం చేస్తున్నదా..? అంటే అవుననే సమాధానం వస్తున్నది. నిబంధనల ప్రకారం 2024 ఏప్రిల్లో జరగాల్సిన ఎన్నికలను ఈ సారి మార్చిలోనే నిర్వహించే అవకాశం కనిపిస్తున్నది. ఓటరు జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా హడావుడిగా జారీచేసిన ఆదేశాలు ఇదే సంకేతాన్ని ఇస్తున్నాయి. అంతేకాదు, సవరించిన ఓటరు తుది జాబితా సైతం 2024 ఫిబ్రవరి 8నే ప్రకటించాలని ఆదేశించడం ‘ముందస్తు’ను బలపరుస్తున్నాయి. మరోవైపు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తుండగా, వీటన్నింటినీ చూస్తే.. పక్కాగా కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలే అధికంగా ఉన్నాయనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి.
– కరీంనగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇటీవల ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజో రాం, రాజస్థాన్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి కౌంటింగ్ ఈ నెల 3న పూర్తయింది. ఇప్పుడిప్పుడే ఆ ఐదు రాష్ర్టాల్లో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. కానీ, కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఈ ఐదు రాష్ర్టాల్లో ఓటర్ల జాబితా సవరణకు ఈ నెల 5న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఎన్రోల్మెంట్ పూర్తయిందని పేర్కొం టూ, ఈ ఐదు రాష్ర్టాల్లోనూ ఓటర్ జాబితా సవరణ పూర్తి కావాలని ఆదేశించింది.
అందులో భాగంగా 2024 జనవరి ఒకటి నాటికి 18 ఏండ్లు నిండిన యువతీయువకులు కొత్తగా ఓటు నమోదుచేసుకోవడానికి అవకాశం కల్పించింది. 2024 జనవరి 6న ఓటరు జాబితాకు సంబంధించి పై ఐదు రాష్ర్టాల్లో ఇంటిగ్రేటెడ్ డ్రాప్టు విడుదల చేయాలని ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం, అదే నెల 6 నుంచి 22వ తేదీ వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణకు అవకాశం కల్పించింది. అంతేకాదు, ఈ సమయంలో శని, ఆదివారాల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించాలని పేర్కొంది. వచ్చిన అభ్యంతరాలను ఫిబ్రవరి 2 వరకు పరిష్కరించి చర్యలు తీసుకోవడంతోపాటు తుది జాబితాను ఫిబ్రవరి 8న ప్రకటించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.
ఎన్నికలు ముగిసిన రెండు మూడు రోజుల్లోనే తిరిగి ఓటరు జాబితా సవరణకు కేంద్రం ఆదేశాలు జారీ చేయడం చూస్తే, ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్లుగా కనిపిస్తున్నది. నిజానికి 17వ లోకసభ ఎన్నికలు 20 19 ఏప్రిల్లో జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించి 2019 మార్చి 18న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించింది. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించారు. 2019 ఏప్రిల్ 10న మొదటి దశ లోక్సభను ఎన్నికల ను ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం, మే 23 వరకు నిర్వహించింది. ఈ సారి కూడా ఏప్రిల్లో ఉండొచ్చని అందరూ భావించారు. కానీ, కేంద్రం మాత్రం మార్చిలోనే ఎన్నికల నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నది.
ఓటర్ తుది జాబితాను 2024 ఫిబ్రవరి 8న ప్రకటించాలని ఆదేశాలు జారీ చేయడం చూస్తే, ముందస్తు అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఈ లెక్కన ఫిబ్రవరి చివరలోనే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. అందుకే యుద్ధప్రాతిపదికన ఓటరు జాబితా కార్యక్రమాన్ని చేపట్టిందన్న అభిప్రాయాలున్నాయి. ఇదే సమయంలో ఇటీవల ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగితే, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ర్టాల్లో బీజేపీ విజయం సాధించింది. మూడు రాష్ర్టాల్లో అధికారంలోకి రావడంతో బీజేపీ మంచి ఊపు మీదున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంతో పోలిస్తే తెలంగాణలోనూ కొంత ఓటింగ్ శాతం పెరిగిందని, ఇది కూడా ఎంపీ ఎన్నికలకు కలిసి వస్తుందన్న ధీమాతో ఆ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తున్నది.
వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ జోష్లోనే ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని ఆ పార్టీ కేం ద్ర నాయకత్వం భావిస్తున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగానే కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఓటరు జాబితా సవరణకు ఆదేశాలు జారీ చేసిందన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నా రు. దీంతోపాటు ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధంగా ఉండాలని వచ్చిన ఆదేశాల మేరకు.. ఆయా జిల్లాల కలెక్టర్లు సైతం క్షేత్రస్థాయి అధికారయంత్రాగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. మొత్తంగా కేంద్రం ఓటర్ జాబితా సవరణకు జారీ చేసిన ఆదేశాలను నిశితంగా పరిశీలిస్తే, వచ్చే ఏడాది మార్చిలోనే లోక్సభ ఎన్నికలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా, ఆయా పార్టీలు సన్నద్ధమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
లోక్సభ ముందస్తు ఎన్నికలకు కేంద్రం అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇటీవల శాసనసభ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ర్టాల్లో ఓటరు జాబితా సవరణ కోసం జారీ చేసిన ఆదేశాలు చేయడం వీటిని బలపరుస్తున్నాయి. తాజాగా, ఈ ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో మూడు ప్రధాన రాష్ర్టాల్లోనూ బీజేపీ హవా కనిపించడం కూడా అందుకు కారణం కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.